ప్రాజెక్టులు నవ నాగరికతకు ప్రాణాధారాలు. ప్రజల ఆకలిదప్పులు తీర్చే అన్నపూర్ణలు. అందుకే ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని నవభారత నిర్మాత జవహర్లాల్ నెహ్రూ అభివర్ణించారు. కానీ, ఆయన అంతేవాసులమని చెప్పుకొనే పార్టీ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రాజెక్టులను రాజకీయ సాధనాలు గా, ఆయుధాలుగా మార్చి పబ్బం గడుపుకోవాలని చూస్తుండటం మహా విషాదం. నీటి కోసం యుద్ధాలు జరిగే రోజులు వస్తాయంటారు. కానీ, నీళ్లను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం అక్కసు రాజకీయాలతో తెలంగాణ ప్రజల భవితను ఆగమాగం చేస్తున్నది. ప్రపంచ చరిత్రలోనే అద్వితీయ ప్రాజెక్టుగా, అతిపెద్ద ఎత్తిపోతలుగా మన్ననలందుకున్న కాళేశ్వరంపై కక్షపూరిత రాజకీయాలు సాగిస్తున్నది. పగుళ్లు లేని ప్రాజెక్టులుంటాయా? ప్రకృతి బీభత్సాలు సంభవించినప్పుడు అతలాకుతలం కాని జలాశయాలుంటాయా? అగ్రరాజ్యం అమెరికాలో అయినా, కమ్యూనిస్టు చైనాలో అయినా.. ఎంతటి మహోన్నత సాంకేతికతతో, ఎంతో సమున్నతంగా నిర్మించినా.. జలవిలయం దాపురిస్తే ఊగిపోయి నెర్రెలు వారడం సహజం. కాళేశ్వరం విషయంలోనూ అదే జరిగింది.
ఐదు శతాబ్దాల్లో కనీవినీ ఎరుగని వరద వస్తే ప్రాజెక్టుకు చిన్న కుదుపు రాదా? మహాజల నిర్మాణంలో ఇసుమంత సమస్య వస్తే ఎద్దుపుండు కాకికి ముద్దు అన్నట్టుగా ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ వీరంగాలు వేస్తున్నాయి. కల్పాంతం వచ్చి ప్రపంచం మునిగిపోయినట్టు వెర్రి కేకలు పెడుతున్నాయి. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టుగా చిందు లు తొక్కుతున్నాయి. పిడుక్కి, బియ్యానికి ఒక్కటే మంత్రం అన్నట్టుగా అవినీతి మంత్రం జపిస్తున్నాయి. కాళేశ్వరాన్ని అనతికాలంలో పూర్తిచేసి ప్రపంచ చరిత్రలో తన స్థానం సుస్థిరం చేసుకున్న కేసీఆర్ కీర్తి శిఖరంపై బురదజల్లే యత్నం చేస్తున్నాయి. ఆ క్రమంలో ప్రజలకు తీరని అన్యాయం తలపెడుతున్నాయి. కేసీఆర్ మీద ఎక్కడ లేని అక్కసు పెంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అవాకులు చవాకులు పేలుతూ, మాటలు తూలుతున్నారు. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టుగా కేసీఆర్ మీద కక్షతో ప్రజలకు ప్రాణాధారమైన ప్రాజెక్టును నీళ్లపాలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. మరమ్మత్తుల మాటెత్తకుండా ప్రాజెక్టులను అడ్డం పెట్టుకుని పగ సాధిస్తున్నారు. తెలంగాణ నీటి భద్రతకు గండి కొడుతున్నారు. ఆచరణ సాధ్యం కాదని ఎప్పుడో నిపుణులు తేల్చేసిన తుమ్మిడిహెట్టి పేరు మీద కొత్త నాటకానికి తెరతీస్తున్నారు.
కంటిలో నలుసు పడిందని కనుగుడ్డు పీకేసుకుంటామా? వేలికి గాయమైందని చేతిని నరికేసుకుంటామా? మందువేసి నయం చేసుకోమా? ఇంటికి పగుళ్లు వస్తే పేల్చేసుకుంటామా? ప్రాజెక్టుకు సమ స్య వస్తే కూల్చేసుకుంటామా? కంతలు పూడ్చి సరిచేసుకోమా? కాళేశ్వరం అనేది కాకతీయ గొలుసుకట్టు తరహాలో నిర్మించిన గొప్ప జలవ్యవస్థ అని ప్రపంచం వేనోళ్ల పొగడటం మనం చూడలేదా? నీళ్లు పల్లం నుంచి ఎత్తులకు ఎక్కడం, ఆ తర్వాత మైళ్లకు మైళ్లు పరుగులు పెట్టడంతోనే కదా తలాపు న పారే గోదారి ఇంటింటి తలుపు తట్టింది. ఎన్నో పంప్హౌజ్లు, రిజర్వాయర్లు, కాల్వలు కలిస్తేనే తెలంగాణ తల్లి మెడలో కాళేశ్వరం జలహారమైంది. కరవులతో తల్లడిల్లిన తల్లి పచ్చని చీరకట్టు కొని దేశానికే అన్నంపెట్టడం గిట్టలేదా కాంగ్రెస్ కండ్లకు?
మహోధృతమైన వరదకు ఓ చిన్న కుదుపు వచ్చింది. మరమ్మతులు చేసుకుని మళ్లీ వినియోగంలోకి తేవాలి కానీ.. ఏదో జరిగిపోయినట్టు ఆ తీతువు కూతలేమిటి? ప్రాజెక్టుకు సమస్య వస్తే ఏ ప్రభుత్వమైనా చేసేదేమిటి? చేయాల్సిందేమిటి.. పరిస్థితిని చక్కదిద్దే వ్యూహాన్ని రచించుకుని మరమ్మతులు చేయించడం, ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్టును సత్వరమే ప్రజల సేవకు సమాయత్తం చేయడం. పర్రెల్ని, కంతల్ని భూతద్దంలో చూపి, చేతకానితనం వెనుక దాక్కోవడం ఏమిటి.. హూవర్ డ్యాంకు సమస్యలొస్తే, హెబ్జెన్ డ్యాం కొట్టుకుపోతే అప్పటి అమెరికా ప్రభుత్వం పాత పాలకులపై విష ప్రచారానికి ఒడిగట్టిందా? మానవ తప్పిదానికి, మానవాతీత శక్తుల ప్రకోపానికి మధ్య తేడా తెలుసుకునే విజ్ఞత కొరవడితేనే ఇలాంటి సంధిప్రేలాపనలు వెలువడుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల మాటలు వారిలోని గందరగోళాన్ని, దిక్కుతోచనితనాన్ని పట్టిస్తున్నాయి తప్ప పరిణతిని ఏమాత్రం సూచించడం లేదు. ప్రాజెక్టు మీద తొందరపడి బురదచల్లారు. ఇప్పుడు ఆగమేఘాల మీద మరమ్మతులు చేసి, అంతా సవ్యంగా ఉందని చెప్పి, నీటిని విడుదల చేస్తే తమ బండారం యాడ బైటపడుతుందోనని వారు జంకుతున్నట్టుంది. ప్రాజెక్టుతో పాటు కేసీఆర్ కీర్తిని నీటిపాలు చేయాలనే దుగ్ధతో ప్రజలను కష్టాలపాలు చేస్తున్నారు. పంటలు ఎండుతున్నాయి. జనం గుండెలు మండుతున్నాయి. ‘మరమ్మతులు మీకు చేతకాకపోతే తప్పుకోండి.. మేం చేసి చూపిస్తాం’ అని విపక్ష బీఆర్ఎస్ నిండు సభలో నిలదీయడంలో తప్పేముంది? నీళ్లను అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తే ప్రజాగ్రహ వెల్లువలో ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం. ఇప్పటికీ సమయం మించిపోలేదు. చేసిన తప్పును ఒప్పుకొని దిద్దుబాటు చర్యలు చేపడితే మంచిదని రేవంత్ సర్కారు గుర్తించాలి.