దేశంలో నల్లధనాన్ని, అవినీతిని రూపుమాపుతానని, ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేస్తానని ప్రధాని నరేంద్రమోదీ ఓ రోజు రాత్రి అకస్మాత్తుగా చేసిన నోట్ల రద్దు ప్రకటనకు ఆరేండ్లు పూర్తి. ఎప్పటిలాగే ఈ నిర్ణయాన్ని కూడా ఆయన అత్యంత నాటకీయంగా, తన క్యాబినెట్ మంత్రులతో సహా ఎవరికీ తెలియకుండా దాచిపెట్టి ప్రకటించారు. కనీసం ఆర్బీఐని కూడా సంప్రదించలేదు. తన మీద తనకు అంతటి ‘నమ్మకం’ మోదీజీకి. ఆయన ఆత్మవిశ్వాసం సంగతేమోగానీ.. దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం నోట్లరద్దుతో అతలాకుతలమైంది. కొన్ని కోట్ల బతుకులు అల్లాడిపోయాయి. చిరువ్యాపారులు జీవనోపాధిని, అనేక మంది ఉద్యోగాలను కోల్పోయారు. నిరుపేదలు చేతిలో ఉన్న డబ్బుతో నిత్యావసరాలు కొనుక్కోలేక ఆకలి బాధలు పడ్డారు. బ్యాంకు ల ముందు పడిగాపులు కాస్తూ అనేక మంది మరణించారు. ప్రధానమంత్రే స్వయంగా భారతీయుల మీద జరిపిన ‘సర్జికల్ స్ట్రయిక్’ నోట్లరద్దు.
దీనికి కారణమైన మోదీగానీ, బీజేపీగానీ ఈ ఆరేండ్లలో ఎన్నడూ పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. సరికదా.. ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీసే నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా సమయంలో ప్రకటించిన ఆకస్మిక లాక్డౌన్ వీటిలో ఒకటి. దీనివల్ల దేశ జనాభాలో దాదాపు 80 శాతానికిపైగా ఉన్న పేదలపై మరోసారి తట్టుకోలేని భారం పడింది. ఆర్థిక రంగమూ చిన్నాభిన్నమైపోయింది. ఇటువంటి మరో నిర్ణయం జీఎస్టీ. ఒకే దేశం-ఒకే పన్ను అంటూ తీసుకొచ్చిన జీఎస్టీ అంతిమంగా రాష్ర్టాలకున్న ఆర్థిక అధికారాలన్నింటినీ లాగేసుకొని, కేంద్రం ముందు దేహీ అని యాచించే పరిస్థితిని తీసుకొచ్చింది. ఇంట్లో ఒక నిర్ణయం తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చిస్తాం. 140 కోట్ల మంది భారతీయుల జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎంత కసరత్తు అవసరమవుతుంది? కానీ, ఇదేమీ పట్టించుకోకుండా, గుడ్డెద్దు చేలో పడ్డట్లు మోదీ సర్కారు నిర్ణయాలు ఉంటున్నాయి.
నోట్లరద్దు సందర్భంగా మోదీ ఆర్భాటంగా ప్రకటించిన లక్ష్యాలేవీ ఆయన చెప్పినట్లుగా 50 రోజుల్లో కాదుగదా.. ఈ ఆరేండ్లలో కూడా సాకారం కాలేదు. రద్దయిన రూ.500, రూ.1000 నోట్లలో 99 శాతం నోట్లు తిరిగి బ్యాంకుల్లో జమ అయ్యాయని స్వయంగా ఆర్బీఐ వెల్లడించింది. అంటే నల్లధనం నగదు రూపంలో, అది కూడా రద్దయిన నోట్ల రూపంలో లేదని స్పష్టమైంది. దానిని రూపుమాపే చర్యలే లేవు. ఉగ్రవాదం ఏమైనా తగ్గిందా అంటే.. అదీ లేదు. కశ్మీర్ ఇప్పటికీ మండుతూనే ఉన్నది. సరిహద్దు రాష్ర్టాల్లో పాకిస్థాన్, చైనా అనుకూల శక్తులు, సంస్థలు బలహీనపడినదీ లేదు. కనీసం దేశంలో నగదు లావాదేవీలు తగ్గాయా అంటే అదీ జరుగలేదు. 2016లో ఉన్నదానికన్నా ప్రస్తుతం 71.84 శాతం ఎక్కువ నగదు ప్రజల వద్ద ఉందని ఆర్బీఐ నివేదిక ద్వారా వెల్లడైంది. ఈ విధంగా నోట్లరద్దు ఏ రకంగా చూసినా చారిత్రక వైఫల్యమే.