గురుకుల సొసైటీల్లో బోధన సిబ్బంది కోసం చేపట్టిన నియామకాల ప్రక్రియ అడుగడుగునా లోపాలమయంగా మారింది. ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరిలో నియామక పత్రాల పంపిణీ చేసింది. ఆ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి నియామక పత్రాలను అందజేశారే గానీ పోస్టింగ్ ఆర్డర్లను మాత్రం ఇప్పటికీ ఇవ్వలేదు. నియామకపత్రాల్లో పొందుపరిచిన అరవై రోజుల గడువు ముగియడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జేఎల్, డీఎల్ మొదలైన పోస్టులకు ఎంపికైన వారికి నియామకపత్రాల్లో ఇచ్చిన గడువు మే నెలతో ముగుస్తుంది. ట్రిబ్ అధికారుల ఉదాసీనత, ఆచరణలో స్పష్టత కొరవడటం, ఆరోహణ పద్ధతిలో నియామక ప్రక్రియను చేపట్టకపోవడంతో బ్యాక్లాగ్ పోస్టులు ఏర్పడుతున్నాయి.
బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా భర్తీ ప్రక్రియ చేపట్టాలని ఉద్యోగార్థులు ప్రస్తుత ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం శూన్యం. దీంతో కొంతమంది కోర్టు మెట్లెక్కారు. పర్యవసానంగా మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో నియామకాలపై ఓ కమిటీని ఏర్పాటు చేశారు. కానీ, నేటికీ ఆ కమిటీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం గురుకుల విద్యా సొసైటీల్లో బోధన సిబ్బందిగా విధులు నిర్వర్తిస్తున్న టీజీటీ, పీజీటీ, జేఎల్, డీఎల్, పీడీలకు పదోన్నతి కల్పించి, బదిలీలు చేపట్టాకే నూతనంగా ఎంపికైన వారికి పోస్టింగ్లు ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వస్తున్నది.
ఎన్నికల కోడ్ ఉన్నందున ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేమని ప్రభుత్వం వాదిస్తున్నది. అయితే వాస్తవానికి పదోన్నతులు, బదిలీలకు ఎన్నికల కోడ్తో సంబంధం ఉండదు. అది సంస్థాగతంగా, అంతర్గతంగా జరిగే ప్రక్రియ. ఎన్నికల కోడ్ పేరిట కాలయాపన చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదు. మరోవైపు గురుకుల బోర్డులో కీలకమైన చైర్మన్ సహా అనేక పదవుల నియామకాల్లో ముందడుగు పడటం లేదు. దీనివల్ల పాలనాపరమైన, అతిముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతున్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగార్థులకు న్యాయం చేకూరేలా నిర్ణయం తీసుకోవాలి. నూతన విద్యా సంవత్సరం ఆరంభం కాకముందే నియామకపత్రాలు పొందినవారికి పోస్టింగ్లు ఇవ్వాలి.
– నియామకపత్రాలు పొందిన అభ్యర్థులు