‘మేము నల్లని బొగ్గును ఉత్పత్తి చేస్తాం… కానీ ఎల్లప్పుడూ పర్యావరణ పరిరక్షణే మా లక్ష్యం’. ఇదీ తెలంగాణ అతి పెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి నినాదం. నినాదానికే అది పరిమితం కాలేదు . ఏటా లక్షలాది మొక్కలు నాటుతూ నల్లని నేలల్లో హరితవనాలు సృష్టిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఏటా కోట్లాది మొక్కలు నాటుతూ పచ్చదనం పెంపు ద్వారా హరిత సింగరేణిగా ముందుకు సాగుతున్నది.
తెలంగాణ రాష్ట్రం అవతరించిన తొలినాళ్లలోనే సీఎం కేసీఆర్ అటవీ విస్తీర్ణం పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అధికారిక లెక్కల ప్రకారం కనీసం 33 శాతం ఉండాల్సిన అటవీ విస్తీర్ణం తెలంగాణ రాష్ట్రంలో 24 శాతానికే పరిమితమైనట్లు గుర్తించారు. భావితరాలకు ఇది శాపం కాకుండా యుద్ధప్రాతిపదికన రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు ప్రణాళికలు సిద్ధంచేశారు. గత తొమ్మిదేండ్లుగా ఏటా తెలంగాణకు హరితహారం ద్వారా కోట్లాది మొక్కలునాటే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నాటిన ప్రతి మొక్క ఎదిగేలా అన్ని శాఖల భాగస్వామ్యంతో చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే భారీగా అటవీ శాతం వృద్ధి సాధించటం గర్వకారణం.
తెలంగాణకు హరితహారం నినాదంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో తెలంగాణ కొంగు బంగారం సింగరేణి సంస్థ ముఖ్యభూమిక పోషిస్తున్నది. సింగరేణి వ్యాప్తంగా లక్షలాది మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏటా ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నది.12 రీజియన్ల పరిధిలోని భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్లు, కార్యాలయాలు, దవాఖానలు ఇతర అన్నిరకాల సంస్థ ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతూ హరిత వనాలు సృష్టిస్తున్నది. 2014కు పూర్వం సింగరేణి అటవీ శాఖ ఆధ్వర్యంలో 1.31 కోట్ల మొక్కలు నాటగా 2015 నుంచి 2022 వరకు గడిచిన ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్ మానస పుత్రిక హరితహారంలో భాగం గా 5 కోట్ల 71 లక్షల మొక్కలు నాటారు.
ఏటా మొక్కలు నాటే కార్యక్రమం కోసం సింగరేణి సంస్థ గతంలో10 నర్సరీలు నిర్వహించేది. సంస్థ చైర్మన్ శ్రీధర్ ఆదేశాల మేరకు మరో రెండు నర్సరీలు అదనంగా ప్రారంభించారు. అందులో ప్రత్యేకంగా అంతరించిపోతున్న వృక్షజాతులకు చెందిన మొక్కలను పెంచుతున్నారు. వీటిలో రావి, మర్రి, జువ్వి, నారెప వంటి 22 జాతుల మొక్కలున్నాయి. తక్కువ ప్రదేశంలో ఎక్కువ మొక్కలు నాటే మియావాకి పద్ధతిలో మొక్కలు నాటడం, మూసివేసిన ఓపెన్ కాస్ట్ల ప్రాంగణాల్లో కోట్ల వ్యయంతో ఎకో పార్కులు ఏర్పా టు చేస్తున్నది. 12 సింగరేణి ఏరియాల్లో 48 పార్కులు, 99 గార్డెన్లు ఏర్పాటుచేసి ఆ ప్రాంత ప్రజలు, కార్మికులు వారి కుటుంబ సభ్యులు ఆహ్లాదంగా గడిపేలా నిర్వహిస్తుంది.
హరితహారం సృష్టికర్త ముఖ్యమంత్రి కేసీఆర్….ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తిని ఏకలవ్య శిష్యుడిలా సింగరేణిలో కొనసాగిస్తున్నారు సింగరేణి ఫైనాన్స్ అండ్ పా డైరెక్టర్ బలరాం. ఆయనే స్వయంగా 15 వేలకు పైగా మొక్కలు నాటి సింగరేణి హరితహారానికి ‘బ్రాండ్ అంబాసిడర్’ గా మారారు. సింగరేణి వ్యాప్తంగా 12 ఏరియాల్లో ఏ కార్యక్రమానికి హాజరైనా మొక్కలు నాటడం ప్రథమ లక్ష్యంగా పెట్టుకొని ఉద్యోగులు వారి, కుటుంబ సభ్యుల్లో స్ఫూర్తి నింపుతున్నారు. ఏదో తూతూ మంత్రంగా ఒకటి రెండు మొక్కలు నాటడం కాకుండా వేలాదిగా మొక్కలు నాటడం ఆయన ప్రత్యేకత.ఆయనే స్వయంగా పార పట్టి మొక్కలు నాటి, మట్టి పూడ్చి ఉద్యోగులందరిలోనూ హరిత స్ఫూర్తిని పెంపొందిస్తున్నారు. ఇప్పటికే వారు నాటిన 15 వేలకు పైగా మొక్కలు వనాలుగా మారాయి. వివిధ గను ల ప్రాంతాల్ల్లో ఏర్పాటు చేసిన హరితవనాలకు ‘బలరాం వనాలు’గా పేరు పెట్టుకుంటూ ఉద్యోగులు మురిసిపోయేలా వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నారు.
మొత్తంగా తెలంగాణ దశాబ్ది అభివృద్ధిలో అటు బొగ్గు ఉత్ప త్తి, థర్మల్.. సోలార్ విద్యుత్
ఉత్పత్తి, సామాజిక స్పృహలో, హరిత స్ఫూర్తిలో తెలంగాణకే తలమానికంగా నిలుస్తున్నది తల్లి సింగరేణి.