తెలంగాణ ఉద్యమమే యువశక్తితో ఊపిరి పోసుకున్నది. ఆ ఉద్యమ పొత్తిళ్ల నుంచి ఎదిగిన టీఆర్ఎస్ మొదటినుంచి యువతకు సముచిత స్థానం ఇస్తున్నది. ఆ క్రమంలోనే టీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ను హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడమే దీనికి నిదర్శనం.
ఉద్యమాలకు నిలయమైన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అనేక మంది విద్యార్థి నేతలు ఇవ్వాళ ప్రజాప్రతినిధులుగా తెలంగాణ పునర్నిర్మాణంలో తమ వం తు పాత్ర పోషిస్తున్నారు. దీనంతటికీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్కు యువత, ముఖ్యంగా బడుగు బలహీనవర్గాల వారి పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. విద్యార్థి, యువశక్తిని గుర్తించి గౌరవించడంలో కేసీఆర్కు ఉన్న విజన్ స్పష్టంగా కనిపిస్తున్నది.
ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో యువకులు చాలా తక్కు వ. నాడు యువకులను జెండాలు మోసేవరకే పరిమితం చేసి, జేజేలు కొట్టించుకున్నవారే తప్ప రాజకీయంగా అవకాశాలు కల్పించింది లేదు. అరుదుగా ఎవరైనా కనిపించారంటే.. అదీ రాజకీయ వారసత్వంతోనే. కానీ తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత యువశక్తి రాష్ట్ర రాజకీయాల్లో ప్రబలశక్తిగా కనిపిస్తున్నది. ఎలాంటి రాజకీయ వారసత్వం, ఆర్థికబలం లేని కొత్తతరం యువకులకు కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారు. యూనివర్సిటీ విద్యార్థులను నేరుగా పార్లమెంటుకు, అసెంబ్లీకి పంపిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది.
కేసీఆర్ 2014 ఎన్నికల్లో యువతను, ఉద్యమకారులను గుర్తించి చట్టసభలకు పంపించారు. పలు కార్పొరేషన్ల చైర్మన్లుగా కూడా యువతకే అవకాశం కల్పించారు. విద్యార్థి, యువజన విభాగం నాయకులుగా పనిచేసిన వారిని పార్లమెంట్కు పంపించిన ఘనత టీఆర్ఎస్ది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లోనూ విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చినవారినే నియమించారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేసిన యువకులనే రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఎంపిక చేయటం చారిత్రాత్మకం.
యువశక్తిని అంచనా వేసి, అవకాశాన్ని బట్టి యువతకు రాజకీయ అవకాశాలు కల్పించడంలో టీఆర్ఎస్ పార్టీది అగ్రస్థానం. ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం గొప్పది. సాధారణ కుటుంబానికి చెందిన, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్కు హుజూరాబాద్ టికెట్ ఖరారుచేసి మరోసారి భవిష్యత్తుతరానికి యువ నాయకత్వాన్ని అందించడం ఆహ్వానించదగిన పరిణామం.
పరిస్థితులను బట్టి ఇప్పటివరకూ విద్యార్థి ఉద్యమకారులకు, యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించింది టీఆర్ఎస్ మాత్రమే అనటంలో అతిశయోక్తి లేదు. జాతీయపార్టీలుగా చెప్పుకొనే పార్టీలు చేయలేని సాహ సం టీఆర్ఎస్ చేసింది. అందులో భాగంగానే హుజూరాబాద్లో విద్యార్థి నాయకునికి అవకాశం ఇవ్వడం హర్షణీయం. భవిష్యత్ తెలంగాణలో యువకులకు రాజకీయాల్లో ప్రాధాన్యం ఇచ్చే పార్టీ టీఆర్ఎస్ అనే చెప్పకతప్పదు. ఇలా పాత, కొత్తల మేలు కలయికగా యువశక్తికి పాలనావ్యవహరాల్లో, చట్టసభల్లో సముచిత స్థానం ఉన్నప్పుడే సృజనాత్మక రాజకీయాలు పరిఢవిల్లుతాయి. అనుభవానికి తోడు నిత్యనూతన ఆలోచన, ఆచరణలతోనే రాజకీయాలు సుసంపన్నమవుతాయి. ప్రజాస్వామిక రాజకీయం బలోపేతమవుతుంది. హుజూరాబాద్లో యువశక్తికి ప్రాధాన్యం ఇవ్వటం ఒక నవశకానికి నాంది.
-సంపత్ గడ్డం