సమస్యను మూలాల నుంచి అర్థం చేసుకోవటం, అక్కడి నుంచే పరిష్కారాన్ని ప్రారంభించటం ముఖ్యమంత్రి కేసీఆర్ పద్ధతి. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన ‘మన ఊరు- మన బడి’ని ఈ విధంగానే అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చి వేసే బృహత్తర కార్యక్రమం ఇది. రూ.7,300 కోట్ల భారీ వ్యయంతో తెలంగాణ అంతటా ఉన్న 26 వేల సర్కారు బడులను ఆధునీకరించే విద్యాయజ్ఞం. తొలి విడుత కింద 9,123 పాఠశాలలను ఎంపిక చేసి వాటిలో 1200 స్కూళ్లను సర్వహంగులతో తీర్చిదిద్దారు. భవనాలకు మరమ్మతులు, గోడలకు రంగులు, ఫర్నీచర్, కిచెన్షెడ్లు, డైనింగ్హాళ్లు, టాయిలెట్లు, ఎల్ఈడీ లైట్లు, ఫ్యాన్లు, గ్రీన్ చాక్పీస్ బోర్డులు, తాగునీరు, డిజిటల్ తరగతులు, సోలార్ ప్యానెళ్లతో ప్రభుత్వ పాఠశాలలకు కొత్త నిర్వచనంలా ఉన్నాయివి. విద్యార్థినులకు శానిటేషన్ ప్యాడ్లను కూడా అందజేయనున్నారు. ఆధునీకరణ కోసం ఒక్కో బడిపై రూ.5 లక్షల నుంచి రూ.కోటికిపైగా ప్రభుత్వం ఖర్చు చేసింది.
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం తెలంగాణ అంతటా ప్రభుత్వ పాఠశాలల పట్ల విశ్వాసాన్ని మరింత పెంచనున్నది. మరోవైపు, సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుపాలన్న రాష్ట్ర ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయం అమలులోకి వచ్చింది. ఇప్పటి వరకూ మధ్యతరగతి, ఆపై విద్యార్థులకే పరిమితమైన ఇంగ్లిష్ మీడియం చదువులు రాష్ట్రంలోని లక్షలాది మంది పేద కుటుంబాల విద్యార్థులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ విధంగా ప్రభుత్వ బడులను రూపంలోను, సారంలోను మార్చి వేయటానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో పని చేస్తుండటం హర్షణీయం. సగటున ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏడాదికి రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్నది. తెలంగాణ గురుకులాల నుంచి వస్తున్నట్లుగా, ప్రభుత్వ పాఠశాలల నుంచి కూడా ఆణిముత్యాల వంటి పిల్లలు ఎదిగి వచ్చి, దేశాన్ని గర్వపడేలా చేసే రోజులు సమీప భవిష్యత్తులోనే మనం చూస్తాం.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత విద్యారంగాన్ని కొత్తపుంతలు తొక్కించారు సీఎం కేసీఆర్. పూర్తి ఉచితంగా ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించే రెసిడెన్షియల్ గురుకులాలను వందల సంఖ్యలో కొత్తగా నెలకొల్పారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు రూ.20 లక్షల ఆర్థికసాయం అందిస్తూ వారి కలల్ని సాకారం చేస్తున్నారు. 2004లో ఉద్యమ సమయంలో కేసీఆర్ గంభీరావుపేటలో మాట్లాడుతూ, తెలంగాణ వచ్చిన తర్వాత కేజీ టు పీజీ విద్యా విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. అన్నట్లుగానే నేడు అదే ప్రాంతంలో కేజీ టు పీజీ క్యాంపస్ సాకారమై నిలిచింది. కేసీఆర్ దార్శనికతతో కేవలం ఎనిమిదేండ్లలో వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్యుత్తు, ఐటీ, కులవృత్తులు మొదలైన రంగాలు సంపూర్ణంగా మారిపోయి తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపాయి. విద్యారంగంలోనూ అటువంటి ఫలితాలు రానున్నాయి. భారతావనికే రోల్మోడల్గా మన స్కూళ్లు నిలువనున్నాయి.