కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 11వ పంచవర్ష ప్రణాళిక (2007-2012)ను ప్రవేశ పెట్టింది. దేశంలో నీటిపారుదల రంగాన్ని వేగంగా అభివృద్ధి చేసి ఉత్పత్తి పెంచాలనేది ఈ ప్రణాళిక ఉద్దేశం. దానికోసం ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశంలోని దాదాపు 16 ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించింది. ఈ హోదా కల్పించబడిన ప్రాజెక్టులకు 90శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది.
ప్రతి రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టుకైనా హోదా ఇవ్వాలనేది నాటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టులకు కొత్తగా జాతీయ హోదా ఇచ్చే ఉద్దేశం తమకు లేదని ప్రకటించింది. కానీ బీజేపీ పాలిత రాష్ర్టాలకు మాత్రం జాతీయ హోదా ఇస్తూ వస్తున్నది. ఇదే వారు చెప్తున్న డబుల్ ఇంజిన్ సిద్ధాంతమైతే 2024 ఎన్నికల్లో దేశ ప్రజలు బీజేపీని తిరస్కరించడం ఖాయం.
తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని రాష్ట్ర విభజన సమయం లో యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం నీటిపారుదల రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. కృష్ణా, గోదావరి నదులపై రెండు భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మొదట నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ కోరితే అప్పటి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కొత్తగా ఏ రాష్ర్టానికీ జాతీయ హోదా ఇచ్చే ఉద్దేశం లేదని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. తెలంగాణకు చెందిన ఏకైక కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కూడా ‘దేశంలో తెలంగాణ కంటే పేద రాష్ర్టాలు చాలా ఉన్నాయి. ఒకవేళ దేశంలో ఏ ప్రాజెక్టుకైనా కొత్తగా జాతీయ హోదా ఇస్తే తెలంగాణ ప్రాజెక్టుకు కూడా హోదా తెస్తా’నని మీడియా సాక్షిగా చెప్పారు.
తాజాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రంలోని అప్పర్భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంతోపాటు 2023-24 బడ్జెట్లో రూ.5300 కోట్లు కేటాయించింది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు వ్యతిరేకంగానే కాకుండా సుప్రీం కోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టుకు కేం ద్ర జలసంఘం అనుమతి ఇచ్చింది. అంతటితో ఆగకుండా కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ వెంటనే ఆమోదం తెలుపడం బీజేపీ ద్వంద్వ వైఖరిని తెలుపుతున్నది. అన్ని అనుమతులు ఉన్న కాళేశ్వరానికి హోదా గురించి ఎన్నిసార్లు అడిగినా స్పందించని బీజేపీ ప్రభుత్వం, ఏ అనుమతులులేని, అసలు నికర జలాల కేటాయి ంపులు లేని అక్రమ ప్రాజెక్టుకు జాతీయ హో దా ఇవ్వడం విడ్డూరం. కేవలం కర్ణాటక ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మాత్రమే ఈ ప్రాజెక్టుకు అనుమతిచ్చిందనేది వాస్తవం. కేంద్రమంత్రి కిషన్రెడ్డి దీనిపై 4కోట్ల తెలంగాణ ప్రజానీకానికి సమాధానం చెప్పాలి.
తుంగభద్ర నదికి సంబంధించి భద్ర నది లో కర్ణాటకకు కేటాయించిన 62.5 టీఎంసీ ల నీటిని ఇప్పటికే పూర్తిగా వినియోగించుకుంటున్నది. నికర జలాలు లేనప్పటికీ తుం గ నది నుంచి 17.4 టీఎంసీల నీరు, భద్ర నుంచి 30 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించింది. తద్వారా 5.75 లక్షల ఎకరాలకు సాగు నీరందించటంతో పాటు 367 చెరువులను నింపాలని ప్రతిపాదించారు. దిగువ రాష్ర్టాల అభ్యంతరాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా, కర్ణాటక కడుతున్న ఈ అక్రమ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపి నిధులు కేటాయించారు. అప్పర్ భద్ర ప్రాజెక్టు కారణంగా, కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ర్టాల ఉమ్మడి ప్రాజక్టైనా తుంగభద్ర డ్యాంకు నీరందక దాని మనుగడ ప్రశ్నార్ధకం కానున్నది. దీని ఫలితంగా రాయలసీమకు చెందిన 4 జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాకు తాగు, సాగు నీరు అందక ఎడారిగా మారే ప్రమాదమున్నది.
అదేవిధంగా ఆర్డీఎస్ కింద 90 వేల ఎకరాలకు కూడా నీటి లభ్యత ఉండదు. అన్నిటికంటే ప్రధానంగా తుంగభద్ర నుంచి కృష్ణా నదిలో చేరే 60 టీఎంసీల నీరు రావడం చాలా కష్టం. దాని ప్రభావం శ్రీశైలం, పోతిరెడ్డిపాడు, నాగార్జునసాగర్ ప్రాజెక్టులపై ఉంటుంది. కనుక ఈ అక్రమ ప్రాజెక్టును ఆపాలని తెలుగు ప్రజలు కోరుతున్నారు. మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో ‘కెన్బెట్వా’,‘అప్పర్ భద్ర’ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి కాళేశ్వరాన్ని విస్మరించడాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తున్నది.
2019 నుంచి తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తున్నది. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను పదేపదే బతిమాలుతున్నది. తెలంగాణలోనూ మత విద్వేషాలు రెచ్చగొట్టి అధికారంలోకి రావాలనుకుంటున్నది. కానీ తెలంగాణ ప్రజ లు అమాయకులు కారన్నది బీజేపీ తెలుసుకోవాలి. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ ఓటు అడగాలంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు వెంటనే జాతీయ హోదా ఇచ్చి నిధులు మం జూరు చేయాలి. అదేవిధంగా తెలంగాణకు అన్యాయం జరగకుండా 4 రాష్ర్టాల మధ్య కృష్ణా నీటిని పునఃపంపిణీ చేయాలి. అంతేకానీ ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే పట్టించుకోకుండా తెలంగాణలో అధికారంలోకి వస్తామని పగటి కలలు కనడం మానుకుంటే మంచిది.
-రాగి శ్రీనివాస రెడ్డి
99850 98432