కేంద్రంలో దశాబ్దకాలానికి పైగా చక్రం తిప్పుతున్న బీజేపీ పాఠ్యపుస్తకాల్లో మార్పులు, చేర్పుల పేరిట వివాదాలు రాజేస్తున్నది. బీజేపీ హయాంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) పాఠ్యపుస్తకాల్లో చేస్తున్న మార్పులు బోధనాంశాలుగా ఉన్న చరిత్ర, రాజనీతి శాస్త్ర పాఠ్యప్రణాళికను గత రెండేండ్లుగా తారుమారు చేస్తున్నాయి. 2014 తర్వాత ఈ రాజకీయ జోక్యం ఊపందుకున్నది. గతంలోనే మొఘల్ సామ్రాజ్యంపై అధ్యాయాలను తగ్గించడం లేదా పూర్తిగా ఎత్తేయడం జరిగింది. హిందూ జాతీయవాదాన్ని మహాత్మా గాంధీ ఆమోదించలేదని సూచించే పాఠాలనూ అటకెక్కించారు. 2002 గుజరాత్ అల్లర్ల ప్రస్తావనలను లేకుండా చేశారు.
వీటన్నిటి లక్ష్యం ఏమిటో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. మైనారిటీ వ్యతిరేక హిందుత్వ రాజకీయాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను మలచడమే పనిగా పెట్టుకున్నది బీజేపీ. దేశచరిత్రలోని కీలకఘట్టాలను మతకోణంలో మసిపూసి మారేడుకాయ చేయాలని చూస్తున్నది. తాజాగా తొమ్మిదో తరగతి పాఠ్యపుస్తకంలో సెక్యులర్, సోషలిస్టు అనే పదాలతో కూడిన భారత రాజ్యాంగ పీఠికను ఎత్తివేసినట్టు వార్తలు వెలువడ్డాయి. అంటే బడిపిల్లల మెదళ్లను తన భావజాలానికి అనుగుణంగా ప్రభావితం చేసేందుకు జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) 2020 కింద పాఠ్యాంశాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా మార్చివేస్తున్నది.
1 నుంచి 8 తరగతుల కొత్త పాఠ్యపుస్తకాలు ఇప్పటికే వాడుకలో ఉన్నాయి. 9వ తరగతికి కొత్త పాఠ్యపుస్తకాలు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. 10, 11 తరగతులకు సవరించిన పుస్తకాలు 202728 విద్యా సంవత్సరంలో విడుదల కానున్నాయి. వాటిలో ఏమేం మార్పులు తెస్తారో తెలియదు. అయితే ఎత్తివేత జరుగలేదని, పాఠ్యాంశాల పునఃపరిశీలన జరుగుతున్నదని అధికారులు ఈ వివాదం మీద సంజాయిషీ ఇచ్చుకుంటున్నారు. అయితే ఆగమేఘాలపై ఎమర్జెన్సీ పాఠాన్ని మాత్రం జొప్పించగలిగారు. ఎమర్జెన్సీ వ్యతిరేక ప్రజా ఉద్యమాలను ఆసరాగా చేసుకుని రాజకీయ బలాన్ని పెంచుకున్న బీజేపీ అదే అంశంలో నుంచి ఇంకా ఇంకా పిండుకోవాలని చూస్తున్నదన్నమాట.
తన పాలనలో నయా ఎమర్జెన్సీ అమలు చేస్తూ ప్రజల హక్కులను తొక్కిపెడుతూ, రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా విపక్షాలను లొంగదీసుకునే నేలబారు ఎత్తుగడలను అమలు చేస్తున్నది. ఓటుహక్కుపై ‘సర్’ను ఎక్కుపెట్టి పౌరసత్వాన్ని గందరగోళం చేస్తున్నది. ఒకే దేశం, ఒకే ఎన్నిక పేరిట దేశ రాజకీయ వ్యవస్థపై పట్టుబిగించాలని చూస్తున్నది. అందులో భాగమే ఈ చరిత్ర తిరగమోత. కోడలికి బుద్ధి చెప్పి, అత్త తెడ్డు నాకినట్టు ఎమర్జెన్సీని రాజకీయాలకు వాడుతూనే తాను మాత్రం తన అభీష్టానికి అనుగుణంగా చరిత్ర పరిశోధన మెడలు వంచుతున్నది. పాఠ్యాంశాల మార్పును దీనంతటి కొనసాగింపుగానే చూడాల్సి ఉంటుంది.
దేశవిభజన ఘోరకలిని చూసి చలించిపోయిన ఆనాటి నేతలు మతాతీత రాజకీయాల వైపే మొగ్గుచూపారు. స్వతంత్ర భారతానికి లౌకిక ఆదర్శాలతోనే రాజ్యాంగాన్ని రాసిపెట్టారు. దేశం ముక్కచెక్కలు కాకుండా కాపాడింది ఆ రాజ్యాంగమే. అదే సమయంలో మతం పేరిట విడిపోయిన పాకిస్థాన్ తర్వాత రెండు ముక్కలు కావడం తెలిసిందే. ఆ నేపథ్యంలోనే భారత రాజ్యాంగంలో సెక్యులర్, సోషలిస్టు పదాలను చేర్చి తొలినాళ్ల ఆదర్శాలను పటిష్టపరిచారు. ఆ ఆదర్శాలకు పూర్తి భిన్నమైన పార్టీ ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్నది. పాఠ్యపుస్తకాల్లోంచి సెక్యులరిజాన్ని మాయం చేసిన బీజేపీ అవకాశం దొరికితే రాజ్యాంగం నుంచే ఆ పదాన్ని తొలగించేందుకు ఏమాత్రం వెనుకాడదనేది వాస్తవం. రాజ్యాంగానికి మౌలిక మార్పులు చేయాలనే లక్ష్యంతో గత ఎన్నికల సందర్భంగా ‘అబ్ కీ బార్ చారౌ పార్’ అనే నినాదాన్ని బీజేపీ ఎత్తుకున్నప్పటికీ ప్రజలు ఉన్న మెజారిటీని ఊడగొట్టడం విశేషం. నిరంతర అప్రమత్తతే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష.