చాలా ఏండ్ల కిందట ఒక మిత్రుడు ‘అవినీతి అనేది నోట్లోని ఉమ్మి లాంటిది. మనది మనకు బాగానే ఉంటది, చప్పరించి మింగేస్తం. ఎదుటివారిది మాత్రం అసహ్యం వేస్తది’ అని నాతో అన్నాడు! అసలు అవినీతి అంటే అక్రమ సంపాదనకు సంబంధించిన విషయంగా మాత్రమే అర్థం చేసుకుంటం. కానీ కాదు. లోతుగా చూస్తే నీతిలేని పనులన్నీ అవినీతే. మరి ఎవరు తేల్చగలరు ఏది నీతి, ఏది కాదు అని? సమాధానానికి రావడానికి, సమాధానపడటానికి రెండు పేరాల సమయం తీసుకుందాం. ఈ రెండు ఉదాహరణలు చూద్దాం.
రామాయణంలో వానర రాజు వాలిని చెట్టు చాటునుంచి చంపుతడు రాము డు. యుద్ధ నియమాల ప్రకారం అది అనైతికం. కానీ తమ్ముడిని రాజ్యం నుంచి తరిమేసి, తమ్ము డి భార్యను చెరపట్టిన వాడు నియమాల గురించి మాటలాడవచ్చునా? దానికి విలువ ఉంటదా?
భారతంలో అంగరాజు కర్ణుడిని నిరాయుధుడిగా, కూరుకుపోయిన రథచక్రాన్ని ఎత్తుతున్న సందర్భంలో కృష్ణుడి పనుపు మీద బాణం వేసి కూలుస్తడు అర్జునుడు. యుద్ధ నియమాల ప్రకారం అది అనైతికం. కానీ ఒక మహిళను నిండు సభలో వలువలు ఊడ్పించినపుడూ, ఒక యువకుడిని నలుగురు చుట్టుముట్టి హత్య చేయడంలో భాగస్వామి అయినపుడూ రాని నైతిక మీమాంస యముని మహిషపు లోహ గంటలు మోగినపుడు రావచ్చునా?
త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే సినీ మాటల రచయి త అంటరు ‘మనవి కానప్పుడు విలువలు, మన వి అయినపుడు లెక్కలూ మాట్లాడితే చాలా బాగోదు’, అని! కాబట్టి… అవినీతి, అనైతికతకు గుత్తేదారులు అయినవారు తమ స్వలాభం కోసం, సొంత అజెండా కోసం ఇతరులను నిం దించినపుడు, కక్షలు సాధిస్తున్నపుడు, దానికో సం అన్ని వ్యవస్థలనూ నిర్లజ్జగా, బాహాటంగా ఉపయోగించుకుంటున్నపుడు మనం ఎవరిపక్క న నిలవాలో తెలియజెప్పేందుకు మన పురాణేతిహాసాల్లోని నిక్షిప్తాలు, ప్రక్షిప్తాలూ ఎన్నో ఉదాహరణలు ఇస్తయి మనకు. సునామీలా చుట్టుముట్టేసే అసమగ్ర, అసమాచార వాట్సాప్ వర్సిటీ ప్రాయోజిత ప్రసారాల్లో కొట్టుకుపోయేపుడు ఈ వివేచన గడ్డిపోచలా మనకు సాయపడుతది. ఏటికి ఎదురీదే ఉలిపికట్టెలా మనను మనం నిలుపుకొనే సందర్భాలూ ఇలాంటివే.
తెలంగాణ ఉద్యమకారిణి, జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కవితను అవినీతి పేరుతో టార్గెట్ చేయడాన్ని మనం ఇట్లనే లోతుగా విశ్లేషించుకుంటే సూక్ష్మం బోధపడుతది. కవిత గురించి రాసేటపుడు సీఎం కేసీఆర్ కూతురు అని మొదలుపెట్టడం అంటేనే ఆమె ఎందుచేత టార్గెట్ అయిన్రు అనేది స్పష్టపడుతది.
‘మీరు భ్రష్టు పట్టించిన ఈ దేశాన్ని గాడిలో పెడుతా; తెలంగాణలో లాగ దేశమంతా 24 గంటలు కరెంటు ఇస్తా; ఇంటింటికీ రక్షిత తాగునీరు ఇస్తా; ప్రతి ఎకరానికీ కడుపు నిండా సాగు నీరు ఇస్తా; జాతీయ జెండాలు చైనాలో కాదు మన గల్లీల్లో తయారు చేపిస్తా; మీరు తెగనమ్ముతున్న ఎల్ఐసీ, సింగరేణిలు సహా మన జాతిసంపదను ప్రజల పరం చేస్తా; తెలంగాణ వడ్లు పండిస్తే వద్దని, కొనబోమని బెదిరించి ఇపుడు దేశంలో ఆహారధాన్యాల కొరత వస్తున్నదని చెప్పే మీ దార్శనికత లేమి నుంచి దేశాన్ని విముక్తం చేస్తా; అసలైన అర్థంలో హైందవ ఆధ్యాత్మికత, తాత్వికతకు ప్రపంచంలో గుర్తింపు తెస్తా; నాలుగేండ్లు కాంట్రాక్టు ఉద్యోగమిచ్చి ఆ తర్వాత రోడ్డుమీద పడేయకుండా మన యువతకు భద్ర జీవితం ఇచ్చే ప్రణాళికలు రచిస్తా; పుట్టినప్పటి నుంచి కట్టెకాలే వరకూ మహిళలను కంటికి రెప్పలా కాపాడుకునే చట్టబద్ధ పాలన అందిస్తా; బహుజనుల జీవితాలను కాన్షీరాం చూపిన వెలుగులో ప్రగతిమార్గం పట్టిస్తా; ఒక్కమాటలో… అంబేద్కర్ పేరు సచివాలయానికి పెట్టడమే కాదు, ఆయనను గుండెలో దాచుకొని, రాజ్యాంగ పీఠికలోని ప్రతి అంశమూ మ్యానిఫెస్టోగా పనిచేస్తా… ఇందుకే బీఆర్ఎస్..’ అని రణన్నినాదం చేసిండు కేసీఆర్.
ఇదిగో ఇక్కడ కాలింది బీజేపీకి. కాళింది మడుగులో కాళీయుడిలాగ రెచ్చిపోతున్నరు. ఎక్కి తొక్కేవాడి ఉగ్రరూపం ముందున్నది! రాముడి పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే వారి బండారం బీఆర్ఎస్ వచ్చినంక ఇంకా ఇంకా బయటపడుతున్నది. కేసీఆర్కు దేశవ్యాప్తంగా దక్కుతున్న ఆదరణ, పెరుగుతున్న మద్దతు చూసినంక బీజేపీకి నిద్రపట్టడం లేదు.
కేసీఆర్ను దెబ్బతీయాలనే ఒకే ఒక్క లక్ష్యంతో పనిచేస్తున్నరు. ఆయన ప్రభుత్వాన్ని కూల్చడానికి దొంగ స్వాములను పంపిన్రు. ఆయన వారిని వలవేసి పట్టుకొని చిప్పకూడు తినిపించింన్రు. దేశంలో తొమ్మిది రాష్ర్టాల్లో పారిన పాచిక ఇక్కడ తిరగబడింది. దాంతో బీజేపీ అహం మరింత దెబ్బతిన్నది. దేశవ్యాప్త ప్రముఖ నాయకులతో కలిసి మోదీపై లేఖాస్త్రం సంధించిన్రు కేసీఆర్. కాళ్ల కింద నేల కదిలే భయవిహ్వలత ఆవహించింది వారికి.
కాబట్టే కేసీఆర్ కూతురు కవిత టార్గెట్ అయి న్రు! వేరే కారణమేమీ లేదు. మిత్రులారా.. ఈ వ్యాసం శీర్షిక ప్రకారం కొంచెం ఓపెన్గా మాట్లాడుకుంటే లిక్కర్ స్కామ్ ఒక స్కామే కాదు. బోడి వందకోట్ల అంశం ఒక అంశమా? మోదీ, ఆయన మిత్రులూ దోచేసిన లక్షల కోట్ల అవినీతి ముందు ఢిల్లీలో జరిగింది స్కామ్ అంటే ప్రజలు నవ్విపోరూ? మోదీజీ మీరు రోజూ పొద్దున్న తినే ఇంపోర్టెడ్ తైవాన్ పుట్టగొడుగులతో కలిపి మింగేసే ఎంగిలిలా మీ అవినీతి, మీ అనైతికత, మీ సర్వభ్రష్టత మీకు కమ్మగా ఉన్నది కదూ?
ప్రజలు, నాయకులు, మేధావులూ ఆలోచించాలి. కేసీఆర్పై కోపంతోనో, కల్వకుంట్ల కుటుంబంపై జెలసీతోనో అభిప్రాయాలు ఏర్పరచుకోకూడదు. బీజేపీ అక్రమ పద్ధతులు ఆర్థిక అవినీతికంటే వేల రెట్లు ప్రమాదకరం. అదానీ రూపంలో లక్షల కోట్ల రూపాయలు సాధారణ మదుపుదారుల సొమ్మును కాజేసిన వారిని ఈడీ ఎందుకు పట్టించుకోదు? ఎస్బీఐ, ఎల్ఐసీ నిర్వాహకులను ఎందుకు బోను ఎక్కించదు? బీజేపీలో చేరిన నాయకులను ఎందరెందరినో ఎందుకు వదిలిపెట్టింది? రెక్కలు ముక్కలు చేసుకొని ఈ దేశ సంపదను పెంచుతున్న సామాన్య ప్రజలను జీఎస్టీ పేరుతో దోపిడీ చేయడం కాదా అవినీతి? కార్పొరేట్ గద్దలకు దోచిపెట్టిన మొత్తంలో ఒకటో వంతు కూడా కాని ప్రజాధనాన్ని వివిధ సంక్షేమ రూపాల్లో ప్రజలకు అందిస్తే అవి ‘ఉచితాలు’ అని ఏడవడం, వాటిని బంద్ చేయాలని సొల్లు వాగడం కాదా అనైతికత? కరెంటు, నీళ్లు, ఉద్యోగాలు, ఆత్మగౌరవాల్లో తన రాష్ర్టాన్ని నెంబర్ వన్గా నిలబెట్టాలని తపన పడుతున్న ప్రభుత్వాన్ని ఆర్థిక ఇబ్బందులకు గురిచేయడం, తమ కక్షసాధింపు వల్ల ప్రజలే ఇబ్బంది పడుతరన్న ఎరుకలేని తనం కాదా అరాచకం? దేశంలో రూపాయి పతనం, విదేశాల్లో దేశ ప్రతిష్ఠ పతనం కాదా దేశద్రోహం? ఈ దేశానికి శిరోధార్యమైన గాంధీ విలువలను సబర్మతీ తీరాన పూడ్చిపెట్టి, ఆయన హత్యను కూడా కీర్తించడం కాదా కుసంస్కారం?
ఎన్టీఆర్ పాట ‘మనలో పాపం చేయనివాడే ఆ రాయి విసరాలి… ఏ లోపం లేనివాడే ఆ శిక్ష విధించాలి’ గుర్తుంది కదా మీకైనా? ఆ వెలుగులో చూస్తే ఇపుడు మోదీ ప్రహసనం ఎంత వికృతమెంత వైపరీత్యమెంత హాస్యాస్పదం? బీజేపీకి లొంగక కేసీఆర్ స్థయిర్యాన్ని పెంచినందుకు, బీఆర్ఎస్ రూపంలో దేశానికి తెలంగాణ లాంటి శ్రేయోరాజ్యం సాకారం చేయగల నాయకునిగా ఆయన గరిమ పెంచుతున్నందుకు కవిత కు అభినందనలు. కేసులు, శిక్షలు, చట్టబద్ధ మార్గాలకు స్వాగతం పలుకుతూనే… ఈ ప్రాసెస్కు తూట్లు పొడిచే నయవంచనను ఎదిరిద్దాం! కవితకు, కేసీఆర్కు అండగా ఉండటం అంటే యుద్ధ నియమాల ప్రకారం న్యాయం వైపు ఉం డటం. మనకు రాముడు, కృష్ణుడు చెప్పింది ఇదే.
‘When dictatorship is a fact, revo lution becomes a right’ అంటరు 19వ శతాబ్దపు ఫ్రెంచ్ రచయిత, తాత్వికుడు విక్టర్ హ్యూగో. ఇపుడు దేశమంతా విప్లవం రావాల్సి ఉన్నది. ఇది కల్వకుంట్ల కుటుంబ స్వవిషయం కాదు, వసుధైకై కుటుంబ సాధనా యజ్ఞంలో భాగం! ఆలోచించండి. గత తొమ్మిదేళ్లుగా ఆర్థికంగా మిమ్మల్ని రాచిరంపాన పెట్టిన దోపిడీదారుల గురించి కొంచెం సీరియస్గానే ఆలోచించండి. అసలైన అవినీతిపరులను, అనైతిక సామ్రాట్టులను ఎట్లా ఏరిపారేయాలో మనసు పెట్టి ఆలోచించండి. జై భారత్!
– శ్రీశైల్రెడ్డి పంజుగుల
90309 97371