గత వందేండ్ల కాలంలో అంతర్జాతీయ సమాజం రెండు ప్రపంచ యుద్ధాలను చూసింది. రెండు భిన్న సిద్ధాంతాలకు ప్రాతినిధ్యం వహించిన అమెరికా-సోవియట్ రష్యా మధ్య ప్రచ్ఛన్నయుద్ధాన్ని చూసింది. ఇవన్నీ ఆర్థిక మూలాల్నించి వచ్చిన సంక్షోభాలే. ఈ గుణపాఠాల నేపథ్యంలోనే సంక్షేమరాజ్యం అన్న భావన పురుడుపోసుకున్నది. విద్య, వైద్యం, ఆహారం, ఉపాధి వంటి ప్రజల మౌలికావసరాల కల్పనకు ప్రభుత్వాలు ప్రాధాన్యమివ్వటం మొదలైంది. కానీ, ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు తగ్గకపోగా.. ప్రపంచవ్యాప్తంగా మరింతగా పెరుగుతున్నాయి. దానికి పరిష్కారం ఏమిటి?
2014లో థామస్ పికెటీ రాసిన ‘కాపిటల్ ఇన్ ద ట్వంటీ ఫస్ట్ సెంచ రీ’ (సీ21గా ప్రసిద్ధినొందింది) పుస్త కం ఆర్థిక శాస్త్ర రంగంలో దశాబ్దాల తర్వాత వచ్చిన సమగ్ర, సాధికారిక గ్రంథంగా పేరు తెచ్చుకున్నది. విశ్వవ్యాప్తంగా ఆర్థిక అంతరాలు తగ్గుముఖం పట్టకపోగా, పెరుగుతూ ప్రస్తుతం 19వ శతాబ్దం నాటి స్థాయికి చేరుకున్నాయని ఈ గ్రంథం వెల్లడించిం ది. అంతేకాదు.. ఆర్థికవ్యవస్థలను ప్రతిభావంతులైన వాణిజ్యవేత్తలు కాకుండా, కొన్ని వ్యాపార కుటుంబాలు నియంత్రించిన గతకాలపు పోకడలు మళ్లీ తలెత్తుతున్నాయని తెలిపింది. దీనికి పికెటీ పెట్టిన పేరు.. ‘పేట్రిమోనియల్ కాపిటలిజం’( వారసత్వ పెట్టుబడిదారీ వ్యవస్థ).
ప్రపంచ సంపద వివరాల్ని ఏటా వెల్లడించే ఫోర్బ్స్ ఈ ఏడాది జాబితా ప్రకారం.. గత ఏడాది ప్రపంచ బిలీయనీర్ల సంపద 5 లక్షల కోట్ల డాలర్ల నుంచి 13 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది. ఇటీవల విడుదలైన ‘ప్రపంచ అసమానతల నివేదిక-2022’ ప్రకారం ప్రపంచ సంపద 317 లక్షల కోట్ల డాలర్లు. దీంట్లో కేవలం 2 శాతం సంపద ప్రపంచ జనాభాలో సగం వద్ద ఉండగా.. 76 శాతం సంపద 10 శాతం జనాభా వద్ద ఉంది. ఈ సంపదను సంప్రదాయబద్ధమైన బంగారం, స్థిరాస్తుల రూపాల్లో పెట్టుకుంటే ప్రభుత్వాలు, చట్టబద్ధ సంస్థలు నియంత్రించే అవకాశం ఉంటుంది కాబట్టి.. బిలియనీర్లు తమ సంపదను బిట్కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీగా మారుస్తున్నట్లు తెలుస్తున్నది.
ఐఎంఎఫ్ మాజీ ఎండీ క్రిస్టీనా లెగార్డె మాటల్లో చెప్పాలంటే.. శ్రామికశక్తిలో పురుషులతో సమానంగా మహిళల భాగస్వామ్యాన్ని పెంచగలిగితే జపాన్ ఏటా 9 శాతం, భారతదేశం ఏటా 27 శాతం వృద్ధి రేటుతో పురోగమిస్తాయి.
మరి, పరిష్కారం ఏమిటి?: బిలియనీర్లు ఈ విధంగా సంపదను పెంచుకుం టూ ప్రభుత్వాల నియంత్రణ లేని స్థాయికి చేరుకుంటుంటే ఇక ఆర్థిక అంతరాలను తగ్గించేదెలా? ఈ దిశగా అంతర్జాతీయ సమాజం కొన్ని ప్రయత్నాలు చేసింది. ఉదాహరణకు.. బహుళజాతి సంస్థల మీద కనిష్ఠంగా 15 శాతం పన్ను విధించాలని 136 దేశాలు ఇటీవల ఒక అంతర్జాతీయ ఒప్పందానికి వచ్చాయి. బహుళజాతి కంపెనీలు వివిధ దేశాల్లో ఉన్న పరిస్థితులను ఆధారం చేసుకొని పన్ను ఎగవేతకు, పన్నుల తరలింపునకు పాల్పడకుండా అడ్డుకోవటం ఈ ఒప్పందం లక్ష్యం. ఇది ఏ మేరకు అమలవుతుంది.. అమలైనా వచ్చిన సొమ్మును ప్రభుత్వాలు పేదల సంక్షేమానికి ఏ మేరకు ఖర్చుచేస్తాయన్న సందేహాలుఉండనే ఉన్నాయి.
సెంట్రల్ బ్యాంకుల నుంచి సులభంగా లభిస్తున్న డబ్బుతో ఫైనాన్షియల్ మార్కెట్లను, స్టాక్ మార్కెట్లను నియంత్రణలో పెట్టుకోవటం వల్లనే శతకోటీశ్వరులు తమ సంపదను కుప్పలు
తెప్పలుగా పెంచుకుంటున్నారు. ఇది అత్యంత తీవ్రమైన ఆర్థిక అంతరాలకు దారి తీస్తున్నది.
పెరిగిపోతున్న ఆర్థిక అంతరాలను తగ్గించటానికి చైనా చర్యలు చేపట్టింది. చైనా ఆర్థికవ్యవస్థపై, సమాజంపై తీవ్రమైన ప్రభావం వేసే అలీబాబా, టెన్సెంట్ వంటి భారీ కంపెనీలను నియంత్రించింది. గేమింగ్ ఇండస్ట్రీపై ఆంక్షలు విధించింది. విద్యారంగంలోని ప్రైవేటు సంస్థలను లాభాపేక్ష లేకుండా నిర్వహించుకోవాలని ఆదేశించింది. చైనా నియంతృత్వ దేశం కాబట్టి.. అక్కడ సాధ్యమవుతుంది గానీ.. భారత్, అమెరికా వంటి ప్రజాస్వామ్య దేశాల్లో ఇది సాధ్యమయ్యే పనేనా? ఆర్థిక అంతరాల తగ్గింపునకు ఆర్థికవేత్తలు పలు మార్గాలను సూచిస్తున్నారు. వాటిలో కొన్ని..
1.వ్యవసాయంపై పెట్టుబడు లు: పేదరికాన్ని తగ్గించటం, ఆర్థిక అంతరాలను రూపుమాపటంలో వ్యవసాయంపై పెట్టుబడులు పెట్టడం ముఖ్యమైనది. ప్రపంచంలోని పేదప్రజల్లో 80 శాతం గ్రామీణప్రాంతాల్లోనే ఉంటూ, వ్యవసాయరంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ప్రపంచ బ్యాంకు సిఫారసు చేస్తున్నది.
2. మహిళల భాగస్వామ్యం: ఆర్థిక అంతరాలను తగ్గించాలన్నా, దేశ జీడీపీని పెంచుకోవాలన్నా శ్రామికశక్తిలో మహిళల వాటాను పెంచటం, పురుషులతో సమానం చేయటం మేలైన మార్గం.
కె.వి.రవికుమార్
91827 77044