కేసీఆర్కు యుద్ధం కొత్త కాదు. తెలంగాణ వస్తదా.. రానిస్తరా అనే సందేహాలను పటాపంచలు చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిన యోధుడు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే తెలంగాణ కోసం ఆయన ఎక్కని కొండ లేదు, మొక్కని బండ లేదు. వ్యూహ కుశలత, యుద్ధ చతురత తనలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే తెలంగాణ నిలిచింది, గెలిచింది. ఇప్పుడు తెలంగాణ మళ్లీ కష్టాలపాలైంది. ఒక్క మాటలో చెప్పాలంటే మళ్లీ చౌరస్తాలో నిలబడింది. కథ మళ్లీ మొదటికి వచ్చింది. తెలంగాణ శత్రువులు చెలరేగిపోతున్నారు. అందుకే ఆయన రంగంలోకి దిగి సమరశంఖం పూరించారు. బుగులు పడుతున్న తెలంగాణ భుజం తట్టారు.
నల్గొండ, కరీంనగర్ సభల్లో రైతు సమస్యలపై ధ్వజమెత్తారు. చేవెళ్ల, జహీరాబాద్ సభల్లో రాజకీయ ప్రత్యర్థులను ఎండగట్టారు. త్వరలో బస్సు యాత్రలు చేపడుతానంటూ సమరోత్సాహం చాటుతున్నారు. వయసు తనకు అడ్డంకి కాదని, అనారోగ్యాలు, కేసులు, కుటుంబ వేధింపులు తనను ఆపలేవని ఎలుగెత్తి చాటుకున్నారు. సోషల్ మీడియా దాడులూ తనను అడ్డుకోలేవని గర్జించారు. బట్టకాల్చి మీదేసేటోళ్ల బండారం బద్దలు కొడుతున్నారు. నాలుగు లేనిపోని విమర్శలు విసిరి చంకలు గుద్దుకునేవాడు నాయకుడు కాదు. ప్రజాబలంతో పోరాడేవాడు అసలు సిసలు నాయకుడని కేసీఆర్ ఆచరణలో ఢంకా నిరూపిస్తున్నారు.
తను బక్కపల్చటి మనిషి. కానీ, తనది ఉక్కుసంకల్పం. తనది దేహబలం కాదు. ప్రజాబలం. ఆ ప్రజాబలం అండదండలతోనే తెలంగాణ సాధించారు. గడ్డిపోచలను ఉక్కు ఊచలుగా మలచిన ఉక్కు సంకల్పం తనది. చిత్తశుద్ధితో కూడిన న్యాయమైన పోరాటం తనది. ప్రగతి పరుగులతో తెలంగాణ కీర్తికాంతులను దశదిశలా వ్యాపింపజేశారు. రెండు దశాబ్దాల పైచిలుకు కాలంలో ఆయన ఎదుర్కున్నట్టి కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు, విషపుకాట్లు మరే ఇతర నాయకుడూ ఎదుర్కోలేదు. తనలా తట్టుకుని నిలబడనూ లేదు. అవరోధాలు చూసి భయపడితే తను కేసీఆర్ ఎందుకవుతారు?! ఎవరి వల్లా కాని తెలంగాణను ఎలా సాధిస్తారు? నిజానికి ఇప్పుడు జరుగుతున్న దాడులకన్నా ఉద్యమకాలంలో వెయ్యిరెట్ల దాడులను ఎదుర్కొన్న అనుభవం తనకున్నది. తన మీద వెయ్యని నిందలేదు. చెయ్యని విమర్శ లేదు. అయినా ఆయన తన దృష్టి మరల్చలేదు. ఎత్తిన ఆయుధాన్ని దించలేదు.
తెలంగాణ వేదనలను తన భుజాలపైన మోసిన చరిత్ర తనది. అయినా ఏ నాడూ తను జంకనూలేదు, వెనుకడుగు వెయ్యనూ లేదు. ప్రత్యర్థుల ఎత్తుగడలు, పన్నాగాలు ఆయన దీక్షాదక్షతల ముందు చిత్తయి కుప్పకూలిన దృశ్యాలు మన కండ్లముందు ఇంకా సజీవంగా కదలాడుతూనే ఉన్నాయి. తనను పడగొట్ట బూనిన ప్రత్యర్థులను తిరగబడి విరగబోట్లు పొడిచిన ఉదంతాలు చరిత్రలో కోకొల్లలు. తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసం ఆయన ఎన్నడూ పని చేయలేదు. ఏది చేసినా ప్రజల మేలు కోసమే. ఇప్పుడాయన మరోసారి ప్రజాక్షేత్రంలోకి దిగి సమరశంఖం పూరించడంతో రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో దడ పుడుతున్నది.
అబద్ధం తొందరగా వ్యాప్తి చెందవచ్చు. కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది. కాంగ్రెస్ ఎన్ని కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వస్తేనేం.. వందరోజుల్లోనే వారి సత్తా తేటతెల్లమైంది. నాలుగు నెలల్లోనే తెలంగాణ తెర్లు తెర్లు అయ్యింది. నీటి కష్టాలైతేనేం, కరెంటు కోతలైతేనేం, పూర్తికాని రుణమాఫీ అయితేనేం, అందని రైతుబంధు అయితేనేం, పెరగని పింఛన్లు అయితేనేం, గోడెక్కని ఉద్యోగాల క్యాలెండర్ అయితేనేం.. అసలు సిసలు కాంగ్రెస్ నైజం ప్రజలకు దృగ్గోచరమైంది. కల చెదిరింది. కథ మారింది. పదేండ్ల నాటి కరువు రక్కసి కర్కశ కౌగిలిలో ప్రజలకు ఊపిరి సలపడం లేదు.
పొరపాట్లు చేసి అగచాట్లు పడుతున్నామని కుములుతున్న ప్రజలకు కేసీఆర్ గుండెదిటవు కలిగిస్తున్నారు. రాబోయే రోజుల్లో దిద్దుబాట్ల దిశగా అడుగులు పడాలని ఆత్మీయ ఓదార్పు అందిస్తున్నారు. ఈ కష్టకాలంలో ప్రజలకు ధైర్యం చెప్పేందుకు కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు అనగానే ప్రత్యర్థుల్లో వణుకు బయలుదేరింది. ఆయన సభలకు వస్తున్న జనశ్రేణులను చూస్తుంటే వారికి కండ్లు బైర్లు కమ్ముతున్నాయి. వారి మాట తీరు మారడమే అందుకు సాక్ష్యం. సీఎం రేవంత్ నోట సానుభూతి ఆట మాటలై వెలువడుతున్నాయంటేనే వాళ్లు ఆత్మరక్షణలో పడ్డారనే అర్థం. కేసీఆర్ నుంచి ప్రజలను ఎక్కువకాలం దూరం చేయలేరు! ఇది సత్యం.