కాళేశ్వరం.. ప్రపంచం అబ్బురపోయే జలప్రదాత. తెలంగాణకు వరదాయిని. బీడువారిన నేల కన్న మాగాణపు స్వప్నం. ముఖ్యమంత్రి కేసీఆర్ మేధోమథనంలో పుట్టిన అమృతభాండం. భవిష్యత్తుకు భరోసాగా చెమటోడ్చి కట్టుకున్న నీటిగూడు. తెలంగాణకు ప్రాణ ప్రదమైన ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చింది ఏమన్నా ఉందా? అంటే.. జవాబు సున్నా. విభజన హామీల కింద జాతీయహోదా అయినా ఇచ్చిందా? అంటే.. జవాబు పూజ్యం. ప్రాధేయపడినా పైసా ఇవ్వ లేదు. నీతి ఆయోగ్ సిఫారసు చేసినా చిల్లిగవ్వ ఇవ్వలేదు. కానీ ఇప్పు డు సర్వోన్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటులో పచ్చి అబద్ధాలకు కేంద్రం తెగబడింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా రూ.86 వేల కోట్లు ఇచ్చామని నిండుసభలో తన ఎంపీ ద్వారా పచ్చి అబద్ధాలు చెప్పించింది.
లోక్సభలో బీఆర్ఎస్ సభ్యుడు నామా నాగేశ్వరరావు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులేవీ తెలంగాణకు రాలేదని చెప్పినప్పుడు బీజేపీ సభ్యుడు నిశికాంత్ దూబే పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద కేంద్రం తరపున వకాల్తా పుచ్చుకున్నారు. కేంద్రం రూ.86 వేల కోట్లు ఇచ్చిం దని చెప్పుకొచ్చారు. మంత్రి సభలో లేనందున తాను ఈ అంశాన్ని వెల్లడిస్తున్నానని కూడా అన్నారు. పాలకపక్ష సభ్యుని మాటను వ్యక్తి గతం అనుకోవడానికి వీల్లేదు. ఇతరేత కారణాలుంటే తప్ప ప్రభు త్వం మాటగానే పరిగణించాల్సి ఉంటుంది. పాలక సభ్యుని అసత్య ప్రకటనలు సభను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయంటూ బీఆర్ఎస్ సభా హక్కుల నోటీసుకు సిద్ధం కావడం గమనార్హం. నిజం నిగ్గు తేల్చేందుకు అదొక్కటే మార్గమని వారు భావించడం సహజమే.
ఎందుకంటే సదరు సభ్యుడు చెప్పింది సత్యదూరం. అందుకు సభ రికార్డులు చూస్తే సరిపోతుంది. రెండేండ్ల కిందట (2021, జూలై 22) లోక్సభలో జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఏమన్నారో చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా రాష్ట్రం సొంత నిధులతోనే కట్టారని ఆయన ఒప్పుకొన్నారు. అసలు ఏ ప్రాజెక్టుకూ ఏగాని ఇవ్వలేదని ఆయన విస్పష్టంగా నొక్కిచెప్పారు. అదే సభలో అదే మంత్రి ఏడాది కిందట (2022, జూలై 31) అదే మాట మరోసారి చెప్పారు. అంటే రాష్ట్ర ప్రభుత్వమే రుణాలు సమీకరించుకొని ప్రాజెక్టు కట్టుకున్నదని సెలవిచ్చారు. పనిలో పనిగా ఆయన కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని కితాబు కూడా ఇచ్చారు. వాస్తవాలు ఇంత స్పష్టంగా ఉంటే పాలక సభ్యుడు అబ ద్ధాలకు ఎలా తెగించారు? లేనిదానిని ఉన్నట్టుగా చూపే సాహసానికి ఎందుకు పూనుకున్నారు? పదేపదే ఒక అబద్ధాన్ని వల్లిస్తూ పోతే ఏదో ఒకనాటికి జనం దానిని నమ్మేస్తారనే గోబెల్సియన్ ఆలోచన దీనివెనుక ఉందా? అసత్య ప్రచారానికి సభ్యునితో నాంది పలికించారా? రికార్డులు అబద్ధం చెప్పవుగా. పైగా ఆ మాటలు సంబంధి త మంత్రి నోటివెంట రాలిన ముత్యాలేగా. తెలంగాణ ప్రజలే కాదు, యావత్తు దేశప్రజలు దీనిని గమనిస్తున్నారనే సోయి ఉందా బీజేపీ పాలకులకు?