CM KCR | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ చైతన్యం తొణికిసలాడే గడ్డ. ప్రజలే కేంద్రం బిందువుగా.. వారి సమస్యలే ఇతివృత్తంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ సమాజం ఎన్నడూ వదులుకోదు’ అని బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ‘చిల్లర మల్లర రాజకీయ శక్తులను ఎప్పుడూ తెలంగాణ ఆదరించదని ఆయన తేల్చిచెప్పారు. తెలంగాణతో బీఆర్ఎస్ పార్టీది పేగుబంధం అని పేర్కొన్నారు. పురిటిగడ్డపైన గులాబీ పార్టీ మరోసారి బ్రహ్మాండమైన విజయం సాధించడం తథ్యం అని విస్పష్టం చేశారు. దేశంలో జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రగతిని అడుగడుగునా అడ్డంకులు సృష్టించే శక్తులపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ‘వేల దాడులు.. లక్షల కుట్రలను ఛేదించి నిలిచి గెలిచిన పార్టీ మనది. నాడు మనం భయపడితే తెలంగాణ వచ్చేదా? సాహసమే ఊపిరిగా సాగుతున్న ప్రయాణంలో.. మీరే నా బలం.. మీరే నా బలగం’ అంటూ ఆయన సోమవారం పార్టీ శ్రేణులకు లేఖ రాశారు. పార్టీ అధినేత కేసీఆర్ రాసిన లేఖ యథాతథంగా..
భారత రాష్ట్ర సమితి కుటుంబసభ్యులకు నమస్తే..! అన్నం తినో అటుకులు తినో.. ఉపాసం ఉండో పద్నాలుగేండ్లు పేగులు తెగేదాక కొట్లాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నం. అధికారం లేకున్నా ఉద్యమ కాలంలో జెండా భుజాన వేసుకొని.. లాఠీలకు, జైళ్లకు వెరవకుండా రేయింబవళ్లు శ్రమించి పార్టీని కాపాడుకున్న ఘనత, కీర్తి గులాబీ సైనికులకే దక్కుతుంది.
ప్రజల ఆశీర్వాదం.. నిబద్ధత కలిగిన లక్షలాది కార్యకర్తల అసమాన కృషితో అపురూప విజయాలు సాధించి రెండుసార్లు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికార పగ్గాలు చేపట్టింది. ఉద్యమవీరులుగా నాడు.. నవ తెలంగాణ నిర్మాణయోధులుగా నేడు పట్టుదల, అంకితభావంతో పనిచేస్తూ అపూర్వ విజయాలు సాధించిపెట్టింది మీరే. మీరిచ్చిన బలంతోనే 60 లక్షల సభ్యత్వంతో అజేయమైన శక్తిగా ఎదిగింది బీఆర్ఎస్. పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఎవ్వరికీ సాధ్యం కాని, ఏకపక్ష విజయాలను సాధిస్తూ రికార్డులను తిరగరాసింది. 21 ఏండ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, ఆటుపోట్లను తట్టుకొని మొక్కవోని దీక్షతో ముందుకుసాగుతూ గమ్యాలను ముద్దాడిన గట్టి సిపాయి మన పార్టీ!
కష్టసుఖాలల్లో కలసి నడుస్తూ.. ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్లా పల్లెల్లో… గల్లీల్లో గులాబీ పతాకాన్ని రెపరెపలాడించి నాకు కొండంత అండగా నిలిచిన మీ రుణాన్ని ఎన్నడూ తీర్చుకోలేను. ఇతరులకు పాలిటిక్స్ అంటే గేమ్.. బీఆర్ఎస్కు మాత్రం టాస్క్. రాజకీయాన్ని ప్రజల ఆకాంక్షలను నెరవెర్చే పవిత్ర కర్తవ్యంగా భావించి కొత్త పంథాలో నడుస్తూ కోటి ఆశలతో ఏర్పడిన తెలంగాణను కోటి కాంతులు విరజిమ్మే నేలగా తీర్చిదిద్దుకున్నం.
కష్టాలు.. కన్నీళ్లు.. కరువులతో అల్లాడిన తెలంగాణ నేడు పచ్చని పంటలతో, చిరునవ్వులతో కళకళలాడుతున్నది. ఆగమైపోయిన తెలంగాణ నేడు కుదుటపడ్డది. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నది. ఒక్కో పథకం ఒక్కో ఆణిముత్యమై దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. కలలో కూడా ఊహించని కార్యాలను చేపట్టి అసాధ్యమనుకున్న పనులు సుసాధ్యం చేసి చూపించి తెలంగాణను దేశానికి నమూనాగా నిలబెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అడిగినవీ.. అడగనివీ.. చెప్పినవీ.. చెప్పనివీ ఎన్నో పనులు చేస్తూ అందరి బంధువుగా నిలిచాం. ఏ వర్గాన్నీ చిన్నబుచ్చలేదు. ఏ ఒక్కరినీ విస్మరించలేదు. మనకు కులం లేదు, మతం లేదు. తెలంగాణ సమాజానికి పొత్తుల సద్దిమూట బీఆర్ఎస్. సంపదను పెంచుతూ, ప్రజలకు పంచుతూ భారతదేశాన్ని సాకే ఐదారు రాష్ర్టాల్లో ఒకటిగా అవతరించి ఉజ్వలంగా వెలుగొందుతున్నది తెలంగాణ.
మనం ఇట్లా ఉంటే.. దేశం కథ ఇంకో లెక్కన ఉన్నది. 75 ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా కోట్ల మందికి తాగడానికి నీళ్లు లేవు. తినడానికి తిండి లేదు. నదుల నిండా నీళ్లున్నా, పొలాలకు సాగునీళ్లు రాలేదు. కరెంట్ కష్టాలు తీరలేదు. అన్ని వనరులు, వసతులూ ఉండి కూడా భారతదేశం భంగపడుతున్నది. చైనా, సింగపూర్, దక్షిణ కొరియా లాంటి దేశాలు అద్భుతమైన ప్రగతిని సాధిస్తుంటే మనం ఇంకా కులమతాల కుమ్ములాటల్లో మునిగిపోయి ముందడుగు వేయలేకపోతున్నం.
మన ఒక్క రాష్ట్రం బాగుంటేనే సరిపోదు. దేశం కూడా బాగుండాలి. దేశాన్ని ఇన్నాళ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీలకు తెలివి లేదు, విజన్ లేదు, సంకల్పం లేదు. అందుకే దేశానికి కొత్త ఎజెండాను నిర్దేశించి జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు భారత రాష్ట్ర సమితిగా మరో ప్రస్థానాన్ని మొదలుపెట్టినం. ఏదైనా పని మొదలుపెడితే కడదాకా కాడిదించే అలవాటే లేని ఉక్కు సంకల్పం మనది.
‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదం ఎత్తుకొని దేశం కోసం బైలెల్లిన మన పార్టీ పైన కేంద్రంలోని
బీజేపీ బరితెగింపు దాడులు చేస్తూ తెలంగాణ ప్రగతికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నది.
వేల దాడులు, లక్షల కుట్రలను ఛేదించి నిలిచి గెలిచిన పార్టీ మనది. నాడు మనం భయపడితే తెలంగాణ వచ్చేదా? సాహసమే ఊపిరిగా సాగుతున్న ప్రయాణంలో మీరే నా బలం.. మీరే నా బలగం…
చైతన్యం తొణికిసలాడే గడ్డ తెలంగాణ. ప్రజలే కేంద్ర బిందువుగా.. వారి సమస్యలే ఇతివృత్తంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ సమాజం ఎన్నడూ వదులుకోదు. చిల్లర మల్లర రాజకీయ శక్తులను ఎప్పుడూ ఆదరించదు. తెలంగాణతో బీఆర్ఎస్ పార్టీది పేగుబంధం. పురిటిగడ్డ పైన గులాబీ పార్టీ మరోసారి బ్రహ్మాండమైన విజయం సాధించడం తథ్యం.
ఇది ఎన్నికల సంవత్సరం. నిరంతరం ప్రజల్లో ఉంటూ పనికి మాలిన పార్టీలు పనికట్టుకొని చేసే దుష్ప్రచారాలను అప్రమత్తతతో తిప్పికొట్టాలి. భారత రాష్ట్ర సమితిని మరింత బలోపేతం చేసే బాధ్యత మీ భుజస్కంధాలపైనే ఉన్నది. ధర్మమే జయిస్తుంది.
జై తెలంగాణ.. జై భారత్..!
మీ.. కే.చంద్రశేఖర్ రావు బీఆర్ఎస్ అధ్యక్షులు