సామాజిక సమానత్వ మూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నది. ఇది విగ్రహం మాత్రమే కాదు, భారత రాజ్యాంగం ఈ దేశ పౌరులకు ప్రసాదించిన స్వేచ్ఛ, సమానత్వ, సోదరభావాల సహజీవన నమునా అది.
తన పోరాట అస్తిత్వానికి ప్రతీకగా నిర్మితమవుతున్న తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం. దాని వెనుకనే అంబేద్కర్ విగ్రహం. విస్మరణకు గురైన అస్తిత్వాలకు ఈ రెండూ బలమైన ప్రతీకలు. స్వాతంత్య్ర భారతదేశం వజ్రోత్సవాలు జరుపుకొంటున్న వేళ ఆవిష్కృతమవుతున్న చారిత్రాత్మక దృశ్యం కూడా. విభిన్న సామాజిక జీవనరీతులు కలిగిన జనుల మధ్య ఏకీభావాన్ని ప్రోదిచేసే ఉద్దీపన శక్తినిచ్చిన మహా మానవతా మూర్తి విగ్రహం అది. ప్రజాస్వామ్య బలీయ భావనకు పునాదిగా సగర్వంగా నిలబడుతున్నట్టుంది. ఒక ఓటు-ఒక విలువ అనే సహజ న్యాయసూత్రాన్నీ ఈ విగ్రహం బలీయంగా వ్యక్తం చేస్తున్నది.
సమకాలీన భారత రాజకీయాల్లో అంబేద్కర్ పేరు తిరుగులేని భావన. ఇది కొన్ని సమూహాలకు మాత్రమే పరిమితం కాదు. మానవ ధర్మాన్ని ప్రబోధిస్తూ అశేష భారతావనీ అమ్మల, అట్టడుగు జనుల స్వేచ్ఛాప్రదాతగా, ఆర్థిక, సామాజిక, రాజకీయ సమాన అవకాశాల కల్పతరువుగా చారిత్రక వాస్తవాన్ని అందరూ గుర్తిస్తున్న సందర్భం ఇది. పార్టీ ఏదైనా, వారి విధానం మరేదైనా, వారి వారి పార్టీల నినాదాలు ఏవైనా… ఆయన బోధించిన మౌలిక, సామాజిక, రాజకీయ అంశాలను నిత్యం ప్రస్తావించాల్సిదే. ప్రస్తుతం మన దేశంలో ఇదో అనివార్యత. ఇలాంటి సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నది.
‘వర్తమాన రాజకీయాల్లో దేశం ఎలా ఉన్నది? ఎట్లా ఉండాల్నని స్వాతంత్య్రోద్యమకారులు కాంక్షించారు. భారత రాజ్యాంగ పీఠిక ఆత్మ ఏం చెప్తున్నది?’ వంటి అంశాలను ఎలుగెత్తి చాటుతుందీ విగ్రహం. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటును రాజకీయ ఆవేశాలతో చూస్తే చరిత్రను, సామాజిక పరిస్థితులను తలకిందులుగా అర్థం చేసుకున్నట్టవుతుంది. అది మాత్రమే కాదు, సంకుచిత స్వభావంతో చూసినా, విశ్లేషించినా భారతీయ సమాజపు ఆత్మ అర్థం కాదు. పైగా తప్పుడు అవగాహనకు వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. ఈ విగ్రహాన్ని ముందుతరాలకు భారతీయుల సామాజిక, సోదర, సమత్వ భావనను నింపేదిగా చూడాలి. మహాత్మాగాంధీ, నెహ్రూ, పటేల్ల స్వాతంత్య్రోద్యమ కాంక్షలకు ప్రతిబింబంగా చూడాలి. అప్పుడు అంబేద్కర్ విగ్రహమే కాదు, అది ఏర్పాటుచేయాలనే భావన వెనుకున్న అంతరార్థ ఆలోచనాధార సుస్పష్టంగా అర్థమవుతుంది. అర్థం చేసుకోవాల్సిన చారిత్రక అనివార్యత కూడా ఉన్నది.
అంబేద్కర్ అంటే రిజర్వేషన్లు మాత్రమే కాదు, అన్ని శూద్ర సమూహాలకు రాజ్యాధికార ప్రదాత. రామానుజులు సంత్ రవిదాస్, మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల, పరమశివుని, తధాగతుని ఆలోచనాభక్తి భావనాత్మక రీతుల ప్రబోధం కూడా. ఇవి చాలా సున్నితమైన అంశాలు కావొచ్చు. కానీ నిత్యజీవిత సత్యాలు కూడా. ఇది కేవలం నేటికి సంబంధించిన విషయం కాదు, వేల ఏండ్ల భారతీయుల జీవన గమనాల సారాంశం. ఈ అన్ని అంశాలను పోత పోస్తే వచ్చిందే అంబేద్కర్ విగ్రహం. భారత రాజ్యాంగం ఉనికిలోకి వచ్చిన తర్వాత ఈ దేశానికి సరికొత్త మార్గనిర్దేశనం జరిగింది. ఇప్పటివరకూ చట్ట సభల్లోకి అడుగుపెట్టనివారికి, చట్టాలు ఎట్లా చేస్తారో, అవి ఎట్లా తమపై ప్రభావం చూపిస్తాయో కూడా తెలియనివారికి అధికారాన్ని, చట్టాన్ని తయారుచేసే శక్తినిచ్చింది మన రాజ్యాంగం. అయితే, దానికి వెన్నెముకగా నిలిచింది అంబేద్కర్.
కాన్షీరాం బీఎస్పీ ఏర్పాటుచేసిన తర్వాత ఆయన రాజకీయ ఆలోచానావిధానంతో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు అత్యంత దయనీయ జీవులు. అలా చట్టసభల్లోకి వచ్చిన వారిగురించి నాటి పత్రికలు పతాకస్థాయిలో హెడ్డింగ్లతో వార్తలు రాశాయి. సరిగ్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలామంది కొత్తవారు. అందునా రాజకీయ అధికారానికి దూరంగా ఉన్నవారు, వాటి వాసనలు కూడా తెలియని చాలామంది తొలిసారి చట్టసభల్లోకి అడుగుపెట్టారు. తమ జీవితాలను బాగు చేసుకునే సువర్ణావకాశాన్ని దక్కించుకున్నారు. అంతేకాదు, ప్రాంతీయ అసమానతల గురించి, అల్ప సంఖ్యాకులపై అధిక సంఖ్యాకులు చేసే పెత్తనాల గురించి అంబేద్కర్ నాడే చెప్పారు. భాషా ప్రయుక్త రాష్ర్టాలు కావాలని నాడు కొందరు చేసిన వాదనలను పూర్వపక్షం చేసిందీ అంబేద్కరే. చిన్న రాష్ర్టాల వల్ల ఈ దేశం అద్భుతంగా పురోగమిస్తుందని అభయం ఇచ్చిన మహా మేధావి అతనే. అందుకుగాను భారత రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు బాటలు వేసిందీ ఆయనే. కాబట్టి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు సముచితం మాత్రమే కాదు, స్వయం పాలన, ఆత్మగౌరవం కోసం ముగింపు లేని ప్రాణత్యాగాల పోరాటాలకు తావు లేదని భారత రాజ్యాంగం ద్వారా హామీనిచ్చిన మహనీయున్ని నిత్యం గుర్తు చేసుకునేందుకు చేసిన ప్రయత్నం ఇది.
అంబేద్కర్ కేవలం అణగారిన ప్రజల, ఈ దేశపు మాతృమూర్తుల వేదనను గుర్తించి, వారి హక్కుల కోసం పోరాడిన యోధుడు మాత్రమే కాదు. భారతీయ ఆర్థికవ్యవస్థ ఎట్లా ఉండాలో, సంపద ఎట్లా వికేంద్రీకరణ చేయాలో కూడా చెప్పిన సామాజిక ఆర్థికవేత్త. రాజకీయ, సామాజిక, ఆర్థిక సమాన అవకాశాలు ఎట్లా ఉండాలో కూడా చెప్పిన ఆధునిక భారతదేశపు ఆత్మ ఆయన. అధికార కేంద్రానికి సమీపంలో ఆయన విగ్రహం ఆకాశపు అంచులను తాకే ఆత్మగౌరవంలా కన్పిస్తున్నది.
హుస్సేన్సాగర్ తీరానికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఈ దేశంలోనే బహుశా తొలిసారి విద్యుత్ వెలుగుల ఉత్పత్తి కేంద్రం అది. సకల భోగభాగ్యాలను వద్దనుకొని సర్వసాధారణ జీవితమే మేలని భావించిన వ్యక్తి. హుస్సేన్సాగర్ను మనకు అందించిన తాత్విక చింతనాపరుడు నడయాడిన ప్రాంతం అది. అట్లా ఆ సరస్సు అలలు తీరాన్ని తాకుతున్నట్లుగానే భారతీయ సమాజాన్ని నిత్యం మేల్కొల్పుతూ… చైతన్యపరుస్తూ తన ఆచరణ, ఆలోచనాతీరుతో సరికొత్త భారతావనికి మార్గదర్శకత్వం వహించిన మహనీయుడిని విగ్రహరూపంలో స్మరించుకోవడం, నిర్మించుకోవడం, నిత్యం గుర్తుంచుకోవడం కేవలం కృతజ్జత మాత్రమే కాదు, చారిత్రక బాధ్య త కూడా. ఈ పనిని తెలంగాణ ప్రభుత్వం చేసిందనే చెప్పాలి.
– గోర్ల బుచ్చన్న
87909 99116
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్, టీవీ వ్యాఖ్యాత)