యావద్భారత దేశం ఈ నెల 18న ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సభలో కేసీఆర్ విరాట్ స్వరూపా న్ని దర్శించింది. నలుగురు ముఖ్యమంత్రులు, ఐదు జాతీయపార్టీలు ఒకే వేదికపై నుంచి ఒక్క గొంతుతో ఒక్క మాటగా అశేష జనవాహిని ముందు నిలబడి నినదించిన చారిత్రాత్మక సందర్భం. టీఆర్ఎస్ వరంగల్ సభ తర్వాత మళ్లీ ఏనాడూ ఇంతటి భారీసభ జరగలేదు.
ఉభయ కమ్యూనిస్టు నాయకులు కూడా ఖమ్మం సభలో పాల్గొని కేసీఆర్తో గొంతు కలిపారు. కమ్యూనిస్టు నాయకుడైన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలంగాణలో కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను తమ రాష్ట్రంలోనూ అమలుచేస్తామని సభలో ప్రకటించారు. పలు రాష్ర్టాల రాజకీయ నాయకులు కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మొన్నటి సభతో దేశంలోనే ఒక నవశకం ప్రారంభమైంది. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్, కంటివెలుగు వంటి పథకాలు యావత్ దేశాన్ని ఆకర్షించాయి. ఈ మధ్య తెలంగాణ జిల్లాల్లో పర్యటించిన కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలకు చెందిన ఎమ్మెల్యేల బృందం ముఖ్యమంత్రి కేసీఆర్ మరో ‘ఎంజీఆర్’ అని ప్రశంసించారు. దళితుల ఆర్థికాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న దళితబంధు పథకం విషయంలో కేసీఆర్ గొప్ప ఆలోచన చేశారని వారు కొనియాడారు. దళితులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే పథకమని, ఇలాంటి పథకం గురించి దేశంలోనే ఇంతవరకు ఏ నాయకుడూ ఆలోచించలేదన్నారు.
ఖమ్మం సభ గురించి ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఒక ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో… ‘సీఎం కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజల్లో ఒక బలమైన నమ్మకం ఉన్నది. ఆయన ఒక ఫైర్ బ్రాండ్. కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తున్నాయి. కేసీఆర్ను తక్కువగా అంచనా వేసేవారు తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుంద’న్నారు. ‘ఆయన ముస్లింల సంక్షేమం గురించి ఆలోచించే ఏకైక వ్యక్తి, వారి అభ్యున్నతి కోసం కృషిచేస్తున్నది తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక్కరే’ అని కీర్తించారు. ఇదొక్క అసదుద్దీన్దే కాదు, దేశంలోని మైనారిటీలందరి భావన.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు ఎంత పకడ్బందీగా ఉంటాయంటే ప్రారంభ దశలో వాటి గురించి సాధారణ వ్యక్తులకు, మేధావులకు కూడా అర్థం కాదు. అసాధ్యమైన పనులుగా అనిపిస్తాయి. అయితే, అవి సాకారమవుతున్న దశలోనే వాటి గొప్పదనం తెలుస్తుంది. 22 ఏండ్ల కిందట కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తెస్తానని ప్రకటించి టీఆర్ఎస్ పార్టీని స్థాపించినప్పుడు రాష్ట్రం వస్తుందన్న నమ్మకం చాలామందికి లేదు. తలలు పండిన రాజకీయ నాయకులంతా అదొక వ్యర్థ ప్రయత్నమన్నారు. అయితే, నిలువెల్లా ఆత్మవిశ్వాసం గల కేసీఆర్ మూడు కోట్ల తెలంగాణ బిడ్డల శక్తిని కూడగట్టి దాన్ని సుసాధ్యం చేసిచూపారు. దేశంలో ఏ పార్టీ, ఏ నాయకుడు చేయని మరొక సాహసానికి పూనుకున్నారాయన. దేశంలోని ప్రతిపక్ష నాయకులంతా నరేంద్ర మోదీని ప్రశ్నించడానికే భయపడుతున్న తరుణంలో కేసీఆర్ ఆయనను ఎదిరించి, నిలబడటమే కాకుండా ఆయనతో పోరాటానికి సిద్ధమయ్యారు.
ఖమ్మం భారీ బహిరంగ సభ బీజేపీపైన సమరశంఖం పూరించడం కాదు, దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ మహాయజ్ఞంలో తెలంగాణ అభివృద్ధి నమూనానే చోదకశక్తిగా ఉండబోతున్నదని సుస్పష్టం చేసింది. రానున్న రోజుల్లో దేశ ప్రజలకు కావలసిన ప్రత్యామ్నాయాన్ని తెలంగాణనే అందించబోతున్నది. ఎనిమిదిన్నరేండ్లలో తెలంగాణ సాధించిన ఘనవిజయాలే మన దేశ ప్రజలకు స్ఫూర్తినివ్వబోతున్నాయి. ఒకనాడు కరువు, కాటకాలతో తల్లడిల్లిన తెలంగాణ నేడు కేసీఆర్ నాయకత్వంలో పసిడి పంటల మాగాణిగా మారింది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విధానం దేశమంతటా రైతురాజ్యం ఆవిర్భావానికి మూలసూత్రం కాబోతున్నది.
కోలేటి దామోదర్: 98491 44406
(వ్యాసకర్త: రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్)