మండల్ వర్సెస్ కమండల్.. ఇప్పుడు బీజేపీ మల్లగుల్లాలు పడుతున్నది దాని మీదే. మండల్ వెనుకబడినవర్గాల సంక్షేమాభివృద్ధికి ప్రతీక అయితే కమండల్ బీజేపీ మార్కు మత రాజకీయాలకు ప్రతీక అని చెప్పవచ్చు. ఇందులో బీజేపీ మొగ్గు ఎటువైపో అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు మండల్ గురించే ఆ పార్టీ కలత చెందుతున్నది. బీజేపీకి ఓబీసీల్లో ఉన్న మద్దతు అంతంత మాత్రమే. అందుకు చారిత్రిక కారణాలు అనేకం ఉన్నాయి. రిజర్వేషన్లను వ్యతిరేకించడం అయితేనేమి, బీసీ కులగణనకు మద్దతు తెలుపకపోవడం అయితేనేమి.. బీజేపీ విధానాలు మొదటి నుంచీ ఓబీసీల ఆకాంక్షలకు బద్ద వ్యతిరేకంగా ఉంటూ వస్తున్నాయి. ఓబీసీల సంక్షేమానికి మోదీ సర్కారు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదు. ప్రత్యేకంగా నిధులనూ కేటాయించలేదు. మండల్కు అడ్డుకట్ట వేసేందుకే నాడు బీజేపీ రథయాత్రలతో రచ్చ చేసిన సంగతి ఓబీసీలు మరువరు. 2015 బీహార్ ఎన్నికలకు ముందు సంఘ్ పరివార్ పెద్దలు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల ఎదురైన ప్రతికూల ఫలితాలు బీజేపీ కూడా మరువలేదు.
ఎదుటివారు చేస్తే బుజ్జగింపు, కుల రాజకీయాలు అని ఎగిరిపడే బీజేపీ ఇప్పుడు ఆ దారిలోనే వెళ్తున్నది. ‘విశ్వగురు’ అని వీరతాళ్లు వేయించుకునే మోదీ విశ్వకర్మ జపం చేస్తున్నది అందుకే. రైతు, ప్రజాసంక్షేమ వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల రాజకీయాలతో విస్తృత స్థాయిలో మద్దతు కూడగట్టడం కష్టమన్న సంగతి బీజేపీకి తెలుసు. మొత్తంమీద మారుతున్న సమీకరణాల నేపథ్యంలో వెనుకబడిన వర్గాల ఓట్ల కోసం బీజేపీ వెంపర్లాడుతున్నది. విడివిడిగా ఓబీసీలు చిన్నచిన్న సమూహాలే కావచ్చు. కానీ కలిపి చూస్తే పెద్ద ఓటర్లలో సింహభాగం వారే ఉంటారు. ఆ ఓటుబ్యాంకు మీద కన్నేసిన బీజేపీ విశ్వకర్మ పేరుతో చేతి వృత్తుల వారికి రుణం సమకూర్చే పథకాన్ని ముందుకు తెచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే ఇది సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బీసీ బంధుకు నకలులా ఉందని చెప్పక తప్పదు. కాకపోతే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేది వందశాతం సబ్సిడీతో రూ.లక్ష సాయం. కేంద్రం ఇచ్చేది కేవలం రుణం మాత్రమే. ఓబీసీల్లోని చేతి వృత్తులవారు, ఎంబీసీలను లక్ష్యంగా చేసుకుని దీనిని తెచ్చారనేది స్పష్టంగానే తెలుస్తున్నది.
సీఎం కేసీఆర్ సమ్మిళిత అభివృద్ధిలో భాగంగా సమాజంలోని సకల జనుల సంక్షేమానికి ఎన్నెన్నో పథకాలు చేపట్టి తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా, ఆదర్శ రాష్ట్రంగా నిలిపారు. మహిళలు, వృద్ధులు, దళిత బహుజనులు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, పారిశ్రామికులు ఇలా అన్ని వర్గాల పురోభివృద్ధికి బాటలు వేశారు. వెనుకబడిన కులాలవారందరికీ స్థలాలిచ్చి, నిధులిచ్చి ఆత్మగౌరవ భవనాలు కట్టించారు. బీసీ బిడ్డల చదువులకు గురుకులాలు అసంఖ్యాకంగా నెలకొల్పి అండదండలు అందించారు. స్కాలర్షిప్లు, విదేశీ విద్యా సహాయాలు అందిస్తున్నారు. ఉపాధి శిక్షణ కూడా సమకూరుస్తున్నారు. ఇవన్నీ కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసినవని ఎవరూ అనలేరు. దూరదృష్టి, లోతైన వివేచన వాటి వెనుక ఉన్నాయి. అందుకు భిన్నంగా బీజేపీ కేవలం ఓటుబ్యాంకు రాజకీయాల్లో భాగంగా పథకాలు ముందుకు తేవడం గమనార్హం.