యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి తెలంగాణ రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల పట్ల మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నది. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల పట్ల కక్షపూరితంగా ఉంటున్నది. రాజ్యాంగ, శాసన, న్యాయవ్యవస్థ, ఆర్థిక, వ్యవసాయ, విద్యుత్, విద్య, ఇరిగేషన్ లాంటి అన్నిరంగాల్లో వివక్ష ప్రదర్శిస్తున్నది.
రాజ్యాంగంలోని ఆర్టికల్-1 ప్రకారం.. భారతదేశం ‘రాష్ర్టాల సమాహారం’ అని రా జ్యాంగంలోని మొదటి పేజీలోనే స్పష్టంగా పేర్కొనబడింది. కానీ నేడు ప్రతిపక్ష రాష్ర్టాలను, బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి తదనుగుణంగా బీజేపీ ఒకే జాతి, ఒకే సంస్కృతి, ఒకే ఎన్నిక, ఒకే ప్రభుత్వం లాంటి ప్రమాదకర ధోరణులకు శ్రీకారం చుడుతున్నది. సమాఖ్య ఆధారమైన రాష్ర్టాల వ్యవస్థను కుప్పకూల్చి యూనిటరీ స్వభావంతో అంతిమంగా ఏక వ్యక్తి పాలన దిశగా నడుస్తున్నది. ఎన్ఫ్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ లాంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్ష నేతలను భయబ్రాంతులకు గురిచేస్తున్నది. రాజ్యాంగం లోని రాష్ర్టాల జాబితాలో ఎంట్రీ ఫోర్టీన్ కింద ఉన్న వ్వవసాయాన్ని, ఎంట్రీ సెవెంటీన్ కింద ఉన్న ఇరిగేషన్ అంశాలను కేంద్రం కబళించింది.
కేంద్రీకృత సేకరణ ప్రకారం సెంట్రల్ పూల్ కోసం ఆహార పదార్థాల సేకరణ కేంద్రానికి సంబంధించిన విషయం. వరి ధాన్యాన్ని కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేరుగా గానీ, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లాంటి రాష్ట్ర ఏజెన్సీల ద్వారా గానీ సేకరణ చేసి ఎఫ్సీఐలో నిలువ చేస్తారు. ఈ ధాన్యాన్ని కేంద్రమే కనీస మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేసి ఆయా రాష్ర్టాలకు సరఫరా చేస్తుంది. దీని అర్థం ఆహారధాన్యాల కొనుగోలు అనేది కచ్చితంగా కేంద్రమే చేయాలి. నిబంధన ప్రకారం ధాన్యం కొనవలసిన కేంద్రం కొనుగోలు చేయకుండా రైతులకు అన్యాయం చేస్తుంటే ఆ కేంద్రాన్ని ఉరితీయాలా? ధాన్యం ఎందుకు కొనుగోలు చేయరని ప్రశ్నిస్తూ రైతుల తరపున పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉరితీయాలా? అడ్డం పొడుగు మాట్లాడుతున్న వీరులు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి.
ఈ నేపథ్యంలో దేశానికే ధాన్యరాశిగా మారిన తెలంగాణలో ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కొర్రీలు పెట్టడం గర్హనీయం. దేశంలోని ఏ రాష్ట్రం నుంచైనా ధాన్యాన్ని సేకరణ చేయాల్సిన బాధ్యత నిబంధనల ప్రకారం కేంద్రానిదే. కానీ కేంద్రం తెలంగాణ వడ్లు కొనకుండా ఉండటానికి అనేక సాకులు చెప్తున్నది. పారా బాయిల్డ్ రైస్ను ప్రజలు ఎక్కువగా ఉపయోగించడం లేదని, అలాగే ఇప్పటికే బఫర్ స్టాక్లున్నాయంటూ కొనలేమని చెప్తున్నది. ముడి బియ్యం నూకలుగా మారుతున్నాయంటూ.. తెలంగాణ నుంచి పారా బాయిల్డ్ రైస్ను గాని, ముడి బియ్యాన్ని గాని కొనే సమస్యే లేదని కేంద్రం అంటున్నది. ఈ పర్యాయం వరకు బియ్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా, రానున్న రబీ సీజన్లో రైతులకు నచ్చచెప్పి వరిపంటలు వేయకుండా నిలవరించవచ్చనే విశ్వాసంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాతపూర్వకంగా ఇచ్చిన విషయం వాస్తవమే కావచ్చు. వరి సాగువైపునకు వెళ్లకుండాఎంత చెప్పినా తెలంగాణ రైతులు యాసంగిలో వరి సాగుచేశారు. ఈ స్థితిలో పంట లు వేసిన రైతాంగాన్ని బాధ్యత కలిగిన రాష్ట్ర ప్రభు త్వం గాలికి వదిలేయలేదు. అందువల్ల యాసంగి వరిధాన్యాన్ని కొనవలసిందిగా కేంద్రా న్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నది. రైతులు తెలంగాణవాసులే కాకుండా అంతకుమించి భారతీయు లు. ప్రతి భారతీయ పౌరుని సంక్షేమాన్ని చూడవలసిన బాధ్యత భారత ప్రభుత్వానికి లేదా?
యాసంగి వరి పండిస్తే కేంద్రం కొనుగోలు చేయకపోతే తెలంగాణ రైతులు ఆగమవుతారన్న ఉద్దేశంతో యాసంగి పంటలు వేయకుండా రైతాంగాన్ని ఒప్పించడానికి ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార యంత్రాం గం అందరూ ప్రయత్నించారు. ఆ సందర్భంలో బండి సంజయ్ లాంటి బీజేపీ నాయకులు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి తదితరులు మీరు ఎంత పండించినా చివరి గింజవరకు కొంటామని రైతాంగాన్ని రెచ్చగొట్టారు. బీజేపీ నేతల తీరు, ఇతర కారణాల వల్ల వరిసాగు విస్తృతంగానే జరిగింది. ఇప్పుడు ఆ పంటలు కొనవలసిన, కొనిపించవలసిన బాధ్యత రెచ్చగొట్టిన నాయకులకు, కేంద్రంలోని వారి అధికార పార్టీకి లేదా?
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇరిగేషన్ సౌలభ్యం పెరిగిన దరిమిలా సాగు విస్తీర్ణం చాలా పెరిగింది. కొన్ని భూముల్లో వరి మినహా మరే పంటలు పండవు. ఆ సందర్భంలో వరి ధాన్యాన్ని ప్రభుత్వం కచ్చితంగా కొనుగోలు చేయాలి. ప్రత్యామ్నాయ పంటలకు అవకాశం ఉన్న భూముల్లో రైతులకు కొన్ని సబ్సిడీలు, ఇతర రాయితీలు ప్రకటించి యాసంగిలో నూనెగింజలు, ఉద్యాన పంటలు లాంటి ప్రత్యామ్నాయ సాగును ప్రోత్సహించాలి. అలాగే వడ్లు విరగకుండా తెలంగాణలో మిల్లుల సాంకేతికతను అభివృద్ధి చేయాలి.
ఉక్రెయిన్ లాంటి యుద్ధ ప్రభావిత దేశంలో చైనా, వియత్నాం, ఇండోనేషియా తదితర దేశాల్లో నూకలకు డిమాండ్ ఉన్నది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ నుంచి నూక, బియ్యం, ఉప్పుడు బియ్యం కేంద్రం కొనుగోలు చేసి ఆయా దేశాలకు ఎగుమతి చేయవచ్చు.
వరి ధాన్యాన్ని, బియ్యాన్ని కేంద్రం కొనకపోవడం వెనుక వ్యవసాయరంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే కుటిలయత్నం జరుగుతున్నది. ఈ పోరాటంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని పార్టీలతో కూడిన అఖిలపక్షంతో ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచాలి. రాష్ట్రంలోని అన్ని పార్టీలు రాజకీయ ప్రయోజనాలు ప్రక్కనపెట్టి ఏకం కావాలి. ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో ముఖ్యమంత్రి చేసే పోరాటానికి చేయూతనివ్వాలి.
– కూనంనేని సాంబశివరావు
(వ్యాసకర్త: సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే)