చెరపకురా చెడేవు! అని పెద్దలు ఊరకే అనలేదు. మొన్నటి మహారాష్ట్ర కుటిల ప్రయోగానికి నేడు బీహార్ సమాధానం చెప్పింది. ఏక్నాథ్షిండేలను తయారుచేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని, వాళ్లు తయారుకాకముందే ముందస్తు దాడికి దిగి నిరుత్తరుల్ని చేయగల సామర్థ్యం తమకు ఉన్నదని నిరూపించింది. ఇది రాజకీయ రణరంగం. ఇక్కడ ఎత్తులు పై ఎత్తులే. మహారాష్ట్రలో అనుభవం లేని ఉద్ధవ్ ఠాక్రే తన పతనాన్ని బేలగా చూస్తూ ఉండిపోతే, రాజకీయాల్లో తలపండిన నితీశ్ కుమార్ ప్రమాదాన్ని ముందే పసిగట్టి బీజేపీ కుట్రలకు చెక్ పెట్టారు. ఏడు పార్టీలతో కూడిన మహాఘట్బంధన్కు భారీ బలగం ఉన్నది. అత్తెసరు మెజారిటీ ఉంటే కూలగొట్టడం సులభం. కానీ ఆర్జేడీ-జేడీయూ కూటమికి గట్టి ప్రజా పునాది ఉండటం కూడా గమనించవలసిన అంశం. బీజేపీ తన కుట్రలను కొనసాగించవచ్చు. కేంద్రం ఆదేశాలతో ఈడీ, సీబీఐ, ఐటీలు ఇక మీదట దాడులు చేయవచ్చు. అవన్నీ నితీశ్ కుమార్ ఊహకు తట్టలేదని అనుకోలేము. కానీ, నితీశ్తోపాటు మహాఘట్బంధన్ నాయకులు రాబోయే యుద్ధానికి సిద్ధంగానే ఉన్నట్టు కనబడుతున్నది.
బీహార్ పరిణామాల నేపథ్యంలో బయటపడిన మరో కీలక అంశం బీజేపీ బలహీనత. ఆ పార్టీకి ఇప్పుడు దేశవ్యాప్తంగా మిత్రపక్షం అని చెప్పుకోదగ్గ గట్టి పార్టీ ఒక్కటంటే ఒక్కటీ లేదు. ఎనిమిదేండ్ల మోదీ హయాంలో కమలం ఏకఛత్రాధిపత్యం కారణంగా.. ఎన్డీఏ నిర్వీర్యమైపోయింది. మోదీ-షా నేతృత్వంలోని బీజేపీతో చెలిమి చేసే కంటే విడిపోవటమే మేలనుకొని పలు పార్టీలు కూటమికి టాటా చెప్పాయి. పంజాబ్లో అకాలీదళ్, మహారాష్ట్రలో శివసేన, బీహార్లో లోక్జన్శక్తి, జమ్ముకశ్మీర్లో పీడీపీ, ఇప్పుడు తాజాగా జేడీయూ.. ఎన్డీఏ నుంచి వైదొలిగాయి. తమతో చేయి కలిపిన పార్టీలను మింగేయాలని చూసే బీజేపీ వైఖరే దీనికి ప్రధాన కారణం. నాయకత్వ లోపంతో పాటు, రెండుగా చీలిపోయి బలహీనస్థితిలో ఉన్న అన్నాడీఎంకే మాత్రమే ఎన్డీఏ భాగస్వామ్యపక్షం ఇప్పుడు. ఈశాన్యంలోని చిన్నాచితకా పార్టీలు బీజేపీతో సైద్ధాంతికంగా కలిసిపోయినవి కావు. కేంద్రంలో బీజేపీ ఉన్నంత వరకే వెంట ఉంటాయి.
2024లో జరిగే లోక్సభ ఎన్నికలపైన, దేశంలోని విపక్ష కూటమి ఐక్యతపైనా బీహార్ పరిణామాలు గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉన్నది. దేశంలో తాము తప్ప మరో పార్టీనే లేకుండా, నిరంకుశ రాజ్య స్థాపన కోసం అడుగులు వేస్తున్న బీజేపీకి ఇది ఎంతైనా ఎదురుదెబ్బే. ఈ సానుకూల పరిస్థితిని ఆసరాగా చేసుకొని దేశంలోని విపక్షాలు ముందడుగు వేయాలి. సామాన్యుడి జీవితాన్ని దుర్భరం చేస్తున్న ధరల పెరుగుదల వంటి సమస్యలపైనా, దేశ మౌలిక స్వభావమైన ప్రజాస్వామ్యం, లౌకికత్వం, సమాఖ్యతత్వాన్ని దెబ్బతీస్తున్న కేంద్రం, బీజేపీ నియంతృత్వ పోకడలపైనా ఉద్యమించాలి. మన దేశ సుసంపన్న సాంస్కృతిక వారసత్వ సంపదను, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవాలి.