దేశానికి బువ్వ పెడ్తున్న తెలంగాణను నూకలు బుక్కమని కేంద్ర మంత్రి గేలి చేస్తుంటే, పంట వేయండని రైతులను ఎగదోసిన ఎంపీలు ఎక్కడికి పోయారు? నీటి అలల తాకిడితో ఒడ్డుకు కొట్టుకువచ్చే వ్యర్థ పదార్థం వలె, మత కల్లోల అలలపై గెలుపు ఒడ్డుకు చేరుకున్న వాచారులారా ఎక్కడ? మిముల్ని నమ్మి పంట వేసిన రైతన్న పంట కొనిపిస్తానన్న దళారి ఏడి? అని ఆగ్రహిస్తున్నాడు.
దేశంలో ఎవరికీ లేని సమస్య తెలంగాణకే ఎందుకని నోరు జారాడు మంత్రి? కాళేశ్వరానికి సాయం ఇవ్వకుం టే ఇప్పట్లో అది పూర్తి కాదనుకున్నారు. అంత భారీ ఎత్తిపోతలకు కరెంటు లేదన్నారు. అసలు ప్రాజెక్టు ఇంజినీరింగే తప్పన్నారు. కాళేశ్వరం పూర్తయ్యేసరికి, నదిలో నీళ్లు లేవన్నారు. నీళ్లొచ్చాయి సరే, పంటలు పండించడానికి రైతుల దగ్గర డబ్బులెక్కడివన్నారు. మళ్లీ ‘రైతుబం ధు’వై వచ్చాడు కేసీఆర్. అన్ని అడ్డంకులు తొలగిపోయి పంటలు విరగపండాయి.
ఇప్పుడు పంట కొంటే రైతులు లాభపడుతారు. ‘మన కు నూకలు మిగలవు’ అని బీజేపీ నేతలు భయపడుతున్నారు. అందుకే.. వరి ధాన్యం కొనకుండా సతాయిస్తున్నారు. కేసీఆర్ ముందుచూపుతో ‘యాసంగిలో వరి వేయకండి, కేంద్రం కొనబోదు. వేసి మీరు గోస పడకండి’ అని స్పష్టంగా చెప్పారు. కానీ.. ఒక వాచాలుడేమో వరి వేయకపోతే ‘ఉరి’ అన్నాడు. ఇంకొక వాచాలుడు ‘వరి వేయండి, మేం వరి కొనిపిస్తాం, మా బాధ్యత అన్నాడు’. దీంతో వస్తున్న ప్రమాదాన్ని ముందే ఊహించిన కేసీఆర్ ‘యాసంగి వరి కొంటారో, కొనరో చెప్పండి’ అని కేంద్రాన్ని నిలదీస్తున్నారు.
ఉప్పుడు బియ్యం పండుతాయని తెలిసి కూడా అబద్ధం చెప్పింది వారే. కాబట్టి వచ్చింది ఏ బియ్యమైనా ఇప్పు డు కొనాలంటున్నారు కేసీఆర్. యాసంగి పంటకు ఎక్కువ నూకలు వస్తాయని తెలిసి కూడా ‘రా రైస్’ మాత్రమే కావాలంటున్న మంత్రి, మిగిలిన నూకలు రైతులను బుక్కమంటున్నాడు! ఎంత మదమాశ్చర్యం? ఎంత అహంకారం? తెలంగాణ రైతులంటే ఎంత చిన్న చూపు? తెలంగాణ రైతులను ఇంతగా పరిహసిస్తున్నా ఎవ్వరూ నోరు మెదపడం లేదు. ఇప్పటికైనా అందరూ ఆలోచించాలి. నిజంగా తెలంగాణ కోసం పరితపిస్తున్నది ఎవరు, తెలంగాణలో శవ రాజకీయాలు చేయడానికి నీచానికి తెగబడుతున్నది ఎవరన్నది తెలంగాణ సమాజానికి తేటతెల్లమైంది.
తెలంగాణలో ఇంకా చాలా ప్రాజెక్టులు పూర్తయ్యే దశ కు చేరుకున్నాయి. గత నెల జహీరాబాద్ నియోజకవర్గం లో ముఖ్యమంత్రి చేపట్టిన సంగమేశ్వర, బసవేశ్వర పథకాలు పూర్తయితే మెతుకుసీమ మళ్లీ తలెత్తుకు నిలబడుతుంది. కరువు కాటకాలతో వెనుకబాటుకు గురైన నారాయణఖేడ్, కంగ్టి మండలాలు రేపు సస్యశ్యామలం కాబోతున్నాయి. ఉమ్మడి రాష్ట్రం లో శ్రీశైలం నీళ్లు చెన్నై వరకు పోయాయి. కానీ మంజీరా నీళ్లు నారాయణఖేడ్, జహీరాబాద్ నేలను తడపలేకపోయాయి. నేడు మన సీఎం కేసీఆర్ దశాబ్దాలుగా బీడుపడ్డ సింగూరు భూములను మంజీరా నీళ్లతో తడిపారు.
వడ్ల కోసం ప్రజలంతా కేసీఆర్ వెన్నంటే ఉంటామని చేసిన శపథం ఇంకా నా చెవుల్లో మార్మోగుతున్నది. ఇప్పుడు మాట వినకపోతే.. కేంద్ర పాలకుల తుప్పు వదిలించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వరి ధాన్యం కొనేదాకా అలుపెరుగని పోరాటం చేస్తారు.
– కొనింటి మాణిక్రావు
(వ్యాసకర్త: జహీరాబాద్ శాసన సభ్యులు)