ఒకే దేశం, ఓకే పార్టీ, ఓకే మతం నినాదాలతో బీజేపీ దేశ సార్వభౌమత్వాన్ని మింగేయాలని చూస్తున్నది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అదే ప్రజల హక్కులను హరిస్తున్నది. ధన మదంతో ప్రజా ప్రతినిధులను అంగట్లో సరకుల్లాగా కొని ప్రభుత్వాలు పడగొడుతున్నది. అలాంటి నీతి మాలిన బీజేపీ ఆటలకు అడ్డుకట్ట వేయాలి. ఆ పార్టీని ఈ దేశం నుంచి తరిమేయాలి.
ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మత విద్వేషాలతో పబ్బం గడుపుకోవాలని బీజేపీ ఆలోచిస్తున్నది. తమ పార్టీ అధికారంలో లేని చోట ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొడుతున్నది. తమ దారికి రాకపోతే ఈడీ, సీబీఐలను ప్రయోగిస్తూ భయ భ్రాంతులకు గురి చేస్తున్నది. రాష్ర్టాల హక్కుల్ని హరిస్తూ సమాఖ్య స్ఫూర్తిని కాలరాస్తున్నది. ఇతర రాష్ర్టాల్లో మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి గత కొన్ని నెలలుగా బీజేపీ కుట్రలు పన్నుతున్నది. కేసీఆర్పైనా, ఆయన కుటుంబంపై కక్ష సాధింపుకు ఉపక్రమించింది. కేసీఆర్ బీఆర్ఎస్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించగానే బీజేపీలో కల్లోలం మొదలైంది. తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన కేసీఆర్కు అనేక పార్టీలు, మేధావులు, వివిధ వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయింది.
ఆనాటి నుంచి కేసీఆర్ను జైల్లో పెడుతము… తెలంగాణ సర్కారును కుప్ప కూలుస్తమంటూ బీజేపీ నేతలు అహంకార పూరిత వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డబ్బు, పదవులు ఎర వేయాలని చూసి రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు చిక్కిపోయారు. టీఆర్ఎస్ను చీల్చాలని బీజేపీ ఆడిన జూదానికి ఎమ్మెల్యేలు తలొగ్గలేదు. నికార్సయిన టీఆర్ఎస్ సైనికులుగా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టారు. దీంతో మునుగోడులో గెలుపు కోసం బీజేపీ ప్రారంభించిన ్త నాటకం అభాసుపాలైంది.
బీజేపీ చేస్తున్న కుట్రలను టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అంచనా వేసి వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచుతున్నారు. తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని, ఎంత మంది ఏక్నాథ్ షిండేలు వచ్చినా టీఆర్ఎస్ను ఏమీ చేయలేరని బీజేపీకి దీటైన జవాబు ఇచ్చారు. అయినా హైదరాబాద్లో ఇటీవల జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నుండి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ నేతలు టీఆర్ఎస్ను పూర్తిగా నిర్వీర్యం చేయాలని పెద్ద ఎత్తున కుట్ర చేశారు. దీంట్లో భాగంగానే మునుగోడులో రాజగోపాల్ రెడ్డి చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు కారణమయ్యారు. ఇందుకోసం రాజగోపాల్కు బీజేపీ అధినాయకత్వం రూ.18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇస్తామని ఆశ చూపిందన్న ఆరోపణలు ఉన్నాయి.
మునుగోడులో భారీ మెజార్టీతో గెలిచి దేశానికి బీఆర్ఎస్ సత్తా చా టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఆగడాలను ఆధారాలతో ఎండ గట్టడం మొదలు పెట్టారు. దీంతో ఉక్కిరి బి క్కిరి అయిన బీజేపీ తమ కుట్రలో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు తెర లేపింది. కానీ ఎవరి కుట్రలైనా తెలంగాణ ఆత్మ గౌరవం ముందు తుత్త్తునియలు కావాల్సిందేనని బీజేపీ నాయకులు గుర్తుంచుకోవాలి. కేసీఆర్ స్ఫూర్తితో తెలంగాణతోపాటు దేశమంతా ‘బీజేపీ ముక్త్ భారత్’ కోసం ఉద్యమించాలి. బీజేపీకి రాజకీయ సమాధి కడితేనే భారత దేశం బతుకుతుందని ప్రజలు గ్రహించాలి.
– చిటుకుల మైసారెడ్డి
94905 24724
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)