కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కారణంగా.. ప్రజా సంక్షేమ పథకాలపై చర్చ జరుగుతున్నది. ఉచితాలు అంటూ ఈ పథకాలను బీజేపీ వ్యతిరేకిస్తున్నది. ఇది సరైనదేనా? ప్రజల సంక్షేమం మాటేమిటి? అన్న ప్రశ్నలు ముందుకొస్తున్నాయి.
సంక్షేమ పథకాలను కేంద్ర పాలక పక్షం పాక్షికంగా అమలు చేసి రాజకీయ లబ్ధి పొందింది. ఏరు దాటి తెప్ప తగలేసినట్లు ఇప్పు డు ప్రతిపక్షాల పాలనలోని ప్రజా సంక్షేమ కార్యక్రమాలను తెగనాడుతున్నది. మరొకవైపు, తాము చెల్లిస్తున్న పన్నులతోనే వాటిని పాలకులు అమలు చేస్తున్నారని, అలగా జనానికి తమ సొమ్ము ఖర్చు చేస్తుంటే, తమకు అన్యాయం జరుగుతోందని నూతన మధ్య, ఉన్నత మధ్య తరగతి ప్రజలు వాదిస్తున్నారు.
సంపన్నులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు ప్రత్యక్ష పన్నులు చెల్లిస్తారు. వీటిని ఎగవేసే అవకాశాలు, ఎగ్గొట్టించే వృత్తికార సంస్థలు చాలా ఉన్నాయి. పేదలు, కింది మధ్య తరగతి ప్రజలు పరోక్ష పన్నులు చెల్లిస్తారు. బీడీలు, సబ్బులు, షాంపూలు, బియ్యం, ఉప్పుపప్పులపై పన్నులు పరోక్ష పన్నులే. వీటిని వినియోగదారులు తప్పించుకోలేరు. మనం సమాజం నుంచి పలు ప్రాథమిక అవసరాలను తీర్చుకుంటాము. మనం వాడే రోడ్లు, భవనాలు, గ్రంథాలయాలు, విద్యా వైద్యాలయాలు ప్రజాధనంతో నిర్మించినవే. వాటిపై ప్రభుత్వం నిరంతరంగా నిర్మాణ, నిర్వహణ ఖర్చులు పెడుతూ ఉంటుంది. ఈ ఖర్చుల కోసం ప్రజలు పన్నులు చెల్లించాలి. ఎవరు ఏ సౌకర్యాలను వాడుతున్నారు, ఎవరు వేటిపై పన్నులు చెల్లించాలి అని తేల్చ టం కష్టం. అందుకే సంపాదనలపై ప్రత్యక్ష పన్నులు, వినియోగాలపై పరోక్ష పన్నులు విధిస్తారు పాలకులు.
శ్రమ శక్తి మాత్రమే ఉన్న కార్మికులు సామాజిక వనరుల ను, సౌకర్యాలను తక్కువగా వాడుకుంటారు. వాళ్ళు స్థాని క ప్రయాణాలే గాని సుదీర్ఘ ప్రయాణాలు తక్కువగా చేస్తా రు. చదువుకోని వారు విద్యాలయాలను, గ్రంథాలయాలను వాడరు. సంపన్నులతో పోల్చితే వైద్య సౌకర్యాలను తక్కువగా వాడుతారు. విద్యార్థులు, వైద్య, ఇంజినీరింగ్, వ్యవసాయం మొదలగు వృత్తివిద్యలను అభ్యసించేవారు, ప్రజాధనాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.
పేదల కంటే, వృత్తి నిపుణులు, ఉద్యోగులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎక్కువ మోతాదులో సమాజానికి తిరిగి ఇవ్వాలి. కానీ, వాళ్ళు సమాజానికి అనగా ప్రభుత్వానికి చెల్లించవలసిన దానికంటే తక్కువే చెల్లిస్తారు. సంపన్నులు విలాసాలకు సహజ వనరులను ఖర్చు చేస్తారు. కాలుష్యాలను పెంచుతారు. పేదలు ఈ పని చేయరు. కాబట్టి ‘మేం ఎక్కువ పన్ను చెల్లిస్తున్నాం. మా డబ్బుతో పేదలు, శ్రామికులు బతుకుతున్నారు’ అన్న సంపన్నుల ప్రచారంలో వాస్తవం లేదు.
కార్పొరేట్ సంస్థల అధిపతులు, పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు, సంపన్నులు సమాజం నుంచి పలు రూపాలలో అపార సమాచార జ్ఞాన సంపదను పొందుతారు. నిజానికి వీరికి ప్రోత్సాహకాల అవసరం లేదు. కానీ, వృత్తి వాణిజ్య సంస్థల, పరిశ్రమల స్థాపన, నిర్వహణలలో సమాజం నుంచి ఎక్కువ సౌకర్య సహకారాలను పొందేది వీరే. ప్రభుత్వాల నుంచి మౌలిక సదుపాయాలను, బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయంగా ప్రజాధనాన్నిఅప్పులుగా పొందుతారు. తమ వాణిజ్య సంస్థల్లో ప్రజలకు భాగస్వామ్య కల్పన నెపంతో ప్రజల డబ్బును సేకరిస్తారు. నామమాత్రపు సొంతసొమ్ముతో అధిక లాభాలు సంపాదిస్తారు. చాలా మంది ప్రభుత్వ బ్యాంకుల అప్పులు ఎగరగొట్టి నల్ల సంపాదన పెంచుకుంటారు. వీళ్ళు ఎంత ఎక్కువగా ప్రభుత్వ సౌకర్యాలు, రాయితీలు పొందితే అంత ఎక్కువగా కార్మిక శ్రమ దోపిడి జరుగుతుంది. అంతగా వారి లాభాలు పెరుగుతాయి. పేదలు, శ్రామికులు, దిగువ మధ్య తరగతి ప్రజలకు తమ శ్రమ శక్తియే సంపాదన వనరు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సౌకర్యాలు, రాయితీలు వారి శ్రమశక్తి ఉపయోగానికి సౌకర్యాలుగా మారుతాయి. వారు శ్రమశక్తిని ఎక్కువగా వాడే వెసులుబాటు కలుగుతుంది. దీంతో వారి దిన కూలీ పెరగదు. కానీ వారి శ్రమ సాంద్రత, సామర్థ్యం, ఉత్పత్తి స్థాయి, యాజమాన్య లాభాలు పెరుగుతాయి. సమాజం ప్రగతి సాధించి, దేశ సంపదలు అభివృద్ధి చెందుతాయి. ఈ విధం గా సంక్షేమ పథకాలు, రాయితీలు సమాజ శ్రేయస్సు సాధనాలు.
ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ప్రజల చేత ప్రజాపాలన జరుగుతుంది. పాలనలో రాజకీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి పార్టీకి నిర్దిష్ట సిద్ధాంతాలు, పాలనా పద్ధతులు ఉంటాయి. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడి, ఎక్కువ స్థానాలు పొందిన పార్టీ/కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ర్టాన్ని / దేశాన్ని రాజ్యాంగబద్ధంగా పాలించాలి. ఎన్నికల వాగ్దానాలను, ప్రకటించిన ప్రణాళికలను తన సిద్ధాంతాలకు అనుగుణంగా అమలు చేయాలి. అయితే, ప్రజాపక్షాల (ప్రాంతీయ పార్టీలు, వామపక్షాలు) పాలన విధానాలలో, కార్పొరేట్ పార్టీల (బీజేపీ, కాంగ్రెస్) పాలన విధానాలలో తేడా కనిపిస్తుంది.
ప్రజలకు సామాజిక దృక్పథం అవసరం. సెల్ఫోన్లు, మోటర్ సైకిళ్ళు, టీవీలు వాడే వారు పేదలు కారని కొందరు వాదిస్తారు. ఇవి నాగరిక పేదరిక అవసరాలని గుర్తించాలి. రాజ్యాంగం ప్రకారం మనది సంక్షేమ రాజ్యం. ప్రభుత్వాలు జనజీవితాలను సంపద్వంతుల కోణంలో కాక శ్రామిక దృక్పథంలో చూడాలి. పేదలను, కార్మికులను మనుషులుగా గుర్తించాలి. సంక్షేమ వాగ్దానాలతో కుర్చీనెక్కిన రాజకీయులు అప్పులు, అక్రమాల బూచీతో సంక్షేమాలకు అడ్డు తగలరాదు. రాజకీయ వ్యక్తిగత కక్షలను ప్రజలపై తీర్చుకోరాదు. ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోవాలి కాని వారిని ఓడించడానికి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు గండికొట్టరాదు. రాజకీయ విజ్ఞతను ప్రదర్శించాలి కాని అల్పత్వాన్ని కాదు.
– సంగిరెడ్డి హనుమంత రెడ్డి
94902 04545
(వ్యాసకర్త: ఆలిండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి)