చతురం తురగం పరినర్తయతః.. పథి పౌరజనాన్ పరిమర్దయతః
నహి తే భుజభాగ్యభవో విభవః.. భగినీ భాగ్యభవో విభవః
పూర్వకాలంలో రాజులుండే వాళ్లు. వాళ్ల అంతఃపురాల్లో రాణులతోపాటు బామ్మరుదులూ ఉండేవాళ్లు. వాళ్లు ఎంత సన్నాసులు, అసమర్థులూ అయినా సరే.. ‘రాజుగారి తాలూకు’ అనే లేబుల్ తగిలించుకొని పెత్తనాలు చేసేవాళ్లు. సరే.. నచ్చినా నచ్చకపోయినా ప్రజలు భరించాల్సివచ్చేది.
అలాంటి ఓ రాజుగారి బావమరిది తన అశ్వం మీద అధికారమదంతో నిర్లక్ష్యంగా స్వారీ చేస్తూ పురవీధుల్లో జనాన్ని తొక్కేస్తూ వెళుతున్నాడు. దారిలో మనుషులను వెతికి మరీ వారిపైకి తన గుర్రాన్ని పోనిస్తూ పరుగులు పెట్టిస్తున్నాడు. వాళ్లు భయపడి పారిపోతుంటే వికటాట్టహాసాలు చేస్తున్నాడు. ఏం చేసినా ప్రజలు కిక్కురుమనక పోవడంతో అతనికి మహోత్సాహంగా ఉంది. తన వైభవానికి మురిసిపోతూ మీసాలు తిప్పుతున్నాడు.
దీన్ని చూసి ఆగ్రహించిన ఓ మహిళ ఇలా అంది. ‘ఓయీ..గుర్రాన్ని చాలా నేర్పుగా తిప్పుతూ మార్గంలో ఉన్న పౌరులను బాగా తొక్కిస్తూ మురిసిపోతున్నావు. ఇదంతా నీ భుజబల పరాక్రమం వల్ల వచ్చిన వైభవం అనుకుంటున్నావో ఏమో! కానే కాదు.. కేవలం నీ సోదరి భాగ్యం (రాజుగారి పత్ని కావడం) వల్ల వచ్చిపడిన వైభవం మాత్రమే’.(ఇది లేకపోతే నీవు చిల్లిగవ్వకు కొరగావు) అంటూ ఈసడించింది. అయినా ఇదేదీ లెక్క చేయకుండా ఆ బామ్మరిది అశ్వాన్ని గంతులేయిస్తూ ముందుకు వెళ్లడం, ఈ క్రమంలో కర్మగాలి సదరు గుర్రం బాలెన్స్ తప్పి కిందపడిపోగా మన కథానాయకుడికి కాళ్లూ చేతులు విరిగి కుయ్యోమొర్రో అనడం జరిగిపోయాయి.
బావల అధికారాన్ని చూసి పెట్రేగిపోయే ఇలాంటి బామ్మరుదులు రాజుల కాలంలోనే కాదు. వర్తమాన ప్రజాస్వామ్య వ్యవస్థల్లోనూ ఉంటారు. అచ్చం మన రాష్ట్ర బీజేపీ నాయకుల్లాగా!
‘మా బావ రాజు.. ఏం చేసినా చెల్లుతుంది’ అనుకునే ఆ కాలపు బామ్మరుదులకు.. కేంద్రంలో అధికారం మాది, ఏమైనా చేయగలం అనుకునే నేటి బీజేపీ నాయకుల అహంభావానికి అట్టే తేడా కూడా లేదు. సొంత బలం కాకుండా ఇతర బలాన్ని చూసి విర్రవీగడం, అధికారమదంతో నోటికొచ్చిన మాటలతో పేట్రేగిపోవడం దానికి నిదర్శనం. ‘జైల్లో పెడతాం’ అనే పొగరుబోతు మాటలనుంచి, అధికారమదంతో కళ్లు మూసుకుపోయి ‘నూకలు తినండి’ అని చేసిన అవహేళనలు.. తెలంగాణ నుంచి వచ్చే ఆదాయం మీద పడి కేంద్రం ఎలా బతుకుతున్నదో మరిచిపోయి ‘తెలంగాణ మీద డబ్బు వేస్ట్ చేయదలుచుకోలే’దంటూ ఒళ్లు మరిచి చేసిన వ్యాఖ్యలదాకా.. గల్లీ లీడైర్లెనా ఢిల్లీ లీడైర్లెనా బీజేపీ మూకల వరస ఒక్కటే. రాష్ట్ర అధ్యక్షుడు ‘సీఎంకు బడితెపూజ చేస్తాం’ అంటే, జాతీయ అధ్యక్షుడు ‘సీఎంకు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది’ అని.. ఓ ఎమ్మెల్యే. ‘బుల్డోజర్లు వస్తున్నాయని’… అన్నింటికన్నీ వెకిలి క్యారెక్టర్లే!
గుజరాత్ శవాల మీద నడిచి ఢిల్లీ అధికార దండం అనే నడమంత్రపు సిరిని అందుకున్న బీజేపీ ఎగిరెగిరి పడుతున్నది. కేంద్రం అండ చూసుకొని రాష్ట్ర బీజేపీ కర్ర పెత్తనాలకు, వీధి దొమ్మీలకు దిగుతున్నది. వీళ్ల వాగుడుకు ఉచ్ఛం నీచం ఉండదు. ఏదో దేశమంతా వీళ్ల జేబుల్లో ఉన్నట్టు కలరింగులు. ‘కేసీఆర్ను వదలబోం.. జైల్లో పెడతాం’.. అని పదేపదే అంటాడొకడు. అవును. జైళ్లు వీళ్ల అయ్యగారి జాగీర్లు. అత్తగారు పసుపు కుంకుమ కింద పెట్టిన కట్నాలు. అందుకే ఎవరినైనా పెట్టాలనుకుంటే పెట్టేస్తారు. చట్టాలు లేవు. కోర్టులు లేవు. హిట్లర్ కాలపు ఫాసిస్టు అరాచకం కొత్తగా ఈ పార్టీ రూపంలో కనిపించడం లేదూ. బెంగాల్లో ఇలాగే మమతా బెనర్జీ వెంట పడి ఆఖరుకు మూతిపండ్లు రాలగొట్టుకున్నారు. తిరిగి అధికారం చేపట్టాక దీదీ ఈ మూకలను తరిమితరిమి కొడుతున్నది. ఇంకా బుద్ధి వచ్చినట్టు లేదు.
మార్చి 1న ఇక్కడకు వచ్చిన పార్టీ జాతీయ సహ కార్యదర్శి ఒకరు గుర్రంపోడు ఘటన మినహా బీజేపీ ఎస్సీ,ఎస్టీ మోర్చా మరేమీ చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారట. అంటే అలాంటి ఘర్షణాత్మక హింసాత్మక వాతావరణం తెలంగాణలో సృష్టించాలని బీజేపీ ఉవ్విళ్లూరుతున్నది. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ఛుగ్ బెంగాల్ తరహాలో పోరాడాలన్నారు. అక్కడ బీజేపీ ఎంత రక్తపాతం సృష్టించిందో ఆ ఘర్షణల్లో ఎన్ని శవాలు లేచాయో అందరికీ తెలుసు. కేంద్రం అండతో బరితెగించిన మూకలు సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మీదే దాడిచేసిన విషయం దేశమంతా చూసింది. బీజేపీ నాయకుల ఆలోచనలు ఏ వైపు వెళుతున్నాయో ఈ వ్యాఖ్యలు చెప్తున్నాయి. రాష్ర్టాల్లో అరాచకాలు రెచ్చగొట్టడం.. కేంద్రంలోని వ్యవస్థలు రక్షణగా నిలవడం గత కొంతకాలంగా దేశంలోని ప్రతిపక్ష రాష్ర్టాల్లో జరుగుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఎన్నిసార్లు దాడులు జరిగాయో లెక్కేలేదు. అక్కడి శాంతి భద్రతలు చేతుల్లో పెట్టుకున్న కేంద్రం వినోదం చూస్తున్నది. మన రాష్ట్రంలో గత ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు మీద పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నల్లగొండ జిల్లాకు రౌడీ మూకలను వెంటేసుకొని వెళ్లి రాళ్ల దాడులకు దిగి హింసను రెచ్చగొట్టిన విషయం, ఆర్టీసీ సమ్మె సందర్భంలో శవాన్ని కబ్జాపెట్టి అల్లకల్లోలం రేపిన విషయం చెప్పేదేమిటి? బీజేపీ హింసనే నమ్ముకున్నది. దానికి జాతీయ నాయకుల ప్రోత్సాహం లభిస్తున్నది.
యుద్ధం సైన్యానిది.. ప్రచారం బీజేపీది..
సరిహద్దుల్లో సహజంగా జరిగే చర్యలను కూడా రాజకీయాలకు వాడుకున్న ఘనత బీజేపీకే దక్కుతుంది. సైనికులు ప్రాణాలకు తెగించి జరిపిన సర్జికల్ స్ట్రైక్ను తమ ఘనతగా బీజేపీ ప్రచారం చేసుకుంది. ఈ విషయంలో ఎవరైనా అనుమానాలు వ్యక్తంచేస్తే వారిని దేశద్రోహులని నిందించడమూ వారికే చెల్లింది. అసలు బీజేపీ పుణ్యమా అని సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తినపుడల్లా దేశంలో ఏవైనా ఎన్నికలు ఉన్నాయా? అని అనుమానించే స్థితి ఏర్పడింది. ఎన్నికలు సమీపించినపుడల్లా సరిహద్దుల్లో యుద్ధం వస్తుందా? అని చూసే పరిస్థితి.
రెండు కుటుంబాల పార్టీ..
అనేక దశాబ్దాలుగా బీజేపీ శ్రేణులు పాడిందే పాటరా అని వినిపించే స్లోగన్ ఒకటి ఉంది. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ.. ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలు. మా పార్టీలో కుటుంబం ఉండదు. వారసత్వం ఉండదు అని. సరే.. బీజేపీ అగ్రనాయకులు పెళ్లిళ్లు చేసుకోరు. పెళ్లాలనూ ఏలుకోరు. కాబట్టి పిల్లలు.. వారసత్వం ఉండదు. అదేదో వారి సమస్య. కానీ వారిలాగే దేశంలోని నాయకులంతా తాడూ బొంగరం లేకుండా ఒంటికొమ్ము సొంటికాయలాగ ఉండాలని అంటే ఎట్లా? పైగా కుటుంబాలు, వారసత్వాలు ఉండకూడదని రాజ్యాంగంలో కూడా రాసిలేదు. అది వదిలేసి అదేదో గొప్ప క్వాలిఫికేషనైనట్టు వల్లె వేయడం బీజేపీకి అలవాటైంది. ఇటీవల కేంద్రమంత్రి కిషన్రెడ్డిగారు దానికి మరింత పదును పెట్టి ‘ టీఆర్ఎస్ తన కుటుంబ అభివృద్ధి గురించి ఆలోచిస్తుంది. బీజేపీ తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచిస్తుంది’ అని గొప్ప డైలాగొకటి వదిలారు. అంత ఆలోచించి ఆయన రాష్ర్టానికి ఏం చించారో.. ఎంత చించారో మాత్రం చెప్పలేదు. కాకపోతే కిషన్రెడ్డిగారు గుర్తించవలసిన అంశం ఒకటి ఉంది. కాంగ్రెస్, ఎన్సీపీ వంటి జాతీయపార్టీల నుంచి సమాజ్వాదీ, డీఎంకే వంటి ప్రాంతీయ పార్టీల దాక ఆ పార్టీలన్నీ లబ్ధ ప్రతిష్ఠులైన నాయకుల నేతృత్వంలో పురుడుపోసుకున్నవి.అనేక పోరాటాలు, త్యాగాల పునాదుల మీద ఏర్పడినవి. ప్రజలకు ఆ నాయకుల మీద.. వారితో కలిసి నడిచిన వారి కుటుంబసభ్యుల మీద గౌరవం ఉండటం, ఆదరించడం సహజం. అంతమాత్రాన అవి కుటుంబ పార్టీలైపోతే మరి బీజేపీ సంగతేమిటి? బీజేపీ పార్టీని ప్రభుత్వాన్ని అంబానీ. అదానీ అనే రెండు కుటుంబాలు నడుపుతున్నాయంటారు. మోదీ నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ రెండు కుటుంబాల ఆస్తులు ఇబ్బడిముబ్బడిగా పెరిగి వారు ప్రపంచ కోటీశ్వరుల జాబితాలో చేరారు. ఈ కోణంలో చూసినపుడు ప్రాంతీయ పార్టీలు ఏక కుటుంబ పార్టీలైతే, మరి బీజేపీ రెండు కుటుంబాల పార్టీ అన్నట్టా?
రైతుల నోళ్లు కొట్టే పాలసీ..
ఈ నాయకులకు రాష్ట్రం పట్టదు. రాష్ట్ర ప్రయోజనాలూ పట్టవు. తాజాగా ధాన్యం సేకరణ వివాదంలో కేంద్ర మంత్రులనుంచి రాష్ట్రనాయకుల దాకా వారి వీరంగం హద్దులు దాటుతున్నది. ఇక్కడ రైతు అనేవాడు ఒకడున్నాడు.. అతడు నష్ట పోతాడన్నస్పృహ కూడా లేదు. ‘తెలంగాణ బియ్యం కొనేవాడే లేడని’ కేంద్రమంత్రి పార్లమెంటులో అవమానిస్తాడు. ‘ప్రజలకు నూకలు తినిపించండి’ అని అవహేళన చేస్తాడు. ‘మీ మంత్రులకు పనిలేదా?’ అని వెక్కిరిస్తాడు. ‘తెలంగాణ బియ్యం మీద డబ్బులు వేస్ట్ చేయదలుచుకోలేదు’ అని కూడా అంటాడు. దీనిమీద రాష్ట్ర నాయకులు స్పందించరు. కిషన్రెడ్డి పెద్ద నోరేసుకొని తప్పంతా రాష్ర్టానిదే. మేం అగ్రిమెంట్ ప్రకారం రా రైస్ ఎంతైనా కొంటాం అంటాడు. తెలంగాణ బిడ్డ అయితే ఇక్కడ యాసంగిలో రా రైస్ వస్తాయా? రావా? అనే విషయం తెలిసి ఉండాలి. తెలంగాణలో యాసంగిలో బాయిల్డ్ రకమే పండుతాయని తెలిసీ రా రైస్ మాత్రమే కొంటామనడం ఏమి నీతో ఆయన చెప్పడు. 2014లో రూ.3,404 కోట్ల విలువైన ధాన్యం కొంటే ఇపుడు రూ.26,641 కోట్ల ధాన్యం కొంటున్నామని ఇక తెలంగాణకు అన్యాయం ప్రసక్తి ఎక్కడుందని కేంద్ర మంత్రి ప్రశ్నిస్తారు. కానీ 2014లో లేని సాగునీటి లభ్యత ఇపుడు బాగా పెరిగింది, ధాన్యం దిగుబడి దేశంలోనే అగ్రస్థానానికి చేరి ఆ మేరకు ధాన్యం కొనుగోళ్లు పెరిగాయని మాత్రం గుర్తించరు.
2010లో అప్పటి కేంద్రం వికేంద్రీకృత ధాన్యసేకరణ విధానం తెచ్చి ధాన్యం సేకరణ రాష్ర్టాలకు అప్పగించిన సందర్భంలో కుదిరిన అవగాహన ప్రకారం ఒక రాష్ట్రంలో పండించిన ధాన్యంలో రాష్ట్ర అవసరాలకు పోనూ మిగులు ధాన్యం మొత్తానికి మొత్తం ఎఫ్సీఐ విధిగా కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చింది. ఆ అవగాహన మేరకే వచ్చిన ధాన్యమంతా ఎఫ్సీఐ కొన్నదే తప్ప ఇందులో కేంద్రం ప్రేమలు దోమలు లేవని ఆయన గుర్తించరు. బాయిల్డ్ రైస్ రాకుండా ప్రభుత్వం ఏ చర్యా తీసుకోలేదని బీజేపీ నాయకులు విమర్శిస్తారు. అయితే స్వయంగా సీఎం కేసీఆర్ రైతులను వరి వద్దని పిలుపునిచ్చారు. ఆఖరికి వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అని హెచ్చరించారు కూడా. కానీ ఆ పిలుపు మీద రాష్ట్ర బీజేపీ నాయకులు ఏమన్నారు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే స్వయంగా వరి వేయండి మెడలు వంచి కొనిపిస్తాం అంటూ రైతులను రెచ్చగొట్టారు. దీనిపై కిషన్రెడ్డి నోరెత్తడు. పైగా ఓ అడుగు ముందుకు వేసి యాసంగిలో రా రైస్ వచ్చే వరి రకాలు రైతులకు ఇవ్వలేదని, రా రైస్కు అనుగుణంగా మిల్లులను మార్చలేదని అంటారు. వరి ధాన్యంలో క్వాలిటీలో తేడాలుండే రకాలే తప్ప ప్రత్యేకంగా రా రైస్ మాత్రమే వచ్చే రకాలు ఉండవు. తెలంగాణలోవేసవి తీవ్రత వల్ల గింజ పెళుసుగా మారి వడ్లు తేలిగ్గా విరిగి నూకలు అధికంగా వస్తాయి తప్ప దీనికి వరి ధాన్యాల వెరైటీలకు ఏ సంబంధమూ లేదు. ఇక మిల్లింగ్ యూనిట్లు ప్రత్యేకంగా రా రైస్కోసం మార్చేదేమీ ఉండదు. బాయిల్డ్ మిల్లింగ్లో బాయిలర్, డ్రైయర్ వంటి పరికరాలు వాడుతారు. రా రైస్ మిల్లింగ్లో ఇవి వాడకుంటే సరిపోతుంది. పాపం కిషన్రెడ్డిగారికి ఇది తెలియదు.
(రెండో భాగం రేపు..)