యుద్ధ విద్యల్లో చివరిదైన దండాన్ని మాత్రమే నమ్ముకుని బీజేపీ దేశమంతా అరాచకీయం చేస్తున్నది. బీజేపీ ఎన్నెన్ని ప్రభుత్వాలను ఎట్లా కూలదోసిందో కొత్తగా ఏకరువు పెట్టడం లేదు. షర్మిలకు తన అన్నతో ఉన్న గట్టు పంచాయితీ కారణంగా తెలంగాణకు వచ్చి గోల చేస్తున్నరు. పట్టపగలు డ్రామాలు ఆడబోతే పోలీసులు టోయింగ్ చేసి తీసుకపోయిన్రు. పని లేని ప్రధాని అదొక ఘన కార్యంగా భావించి ఆమె క్షేమ సమాచారాలు విచారించిన్రు. కారణం సింపుల్… ఆమె బీజేపీ ప్రచ్ఛన్న నాయకురాలు. ఒకప్పుడు మహర్దశలో ఉండి, బహుజన రాజకీయాలను ప్రభావితం చేసిన బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి తదనంతర కాలంలో బీజేపీ చెప్పిందే చేతగా తన ఉనికి కోల్పోయిన్రు. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడైన ప్రవీణ్ కుమార్ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న, సుప్రీంకోర్టు సహా అన్ని వ్యవస్థలనూ చెరబట్ట జూస్తున్న బీజేపీని పల్లెత్తు మాట అనరు. కారణం బీఎస్పీ కూడా ప్రచ్ఛన్న బీజేపీయే.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి చంద్రబాబు మానస పుత్రుడు అన్నది జగద్వితం. రేవంత్ చంద్రబాబు కోసం, బాబేమో బీజేపీ కోసం ఎంతకైనా తెగిస్తరు. మోదీ-బాబు కొత్త జి-20 బంధం వెనక కారణం ఇదే. తనను తరిమేసిన కేసీఆర్పై కక్ష సాధింపు కోసం బీజేపీకి బూర ఊదుతున్నరు చంద్రబాబు. ఖమ్మం సభలో అదే రొడ్డకొట్టుడు. ఆయన పుట్టడానికి మూడున్నర శతాబ్దాల ముందే జగజ్జేయంగా విలసిల్లిన హైదరాబాద్ను తనే ఉద్ధరించానని చెప్పుకోవడం వికారం. వాళ్ళ పాలన ముగిసిన ముచ్చట కదా? ప్రజలు విసిగి, వారి నుంచే స్వాత్యంత్య్రంసిద్ధింపజేసుకుంటమంటే, ఆ పోరాటానికి జడిసి, తప్పనిసరి పరిస్థితుల్లో లేఖ కూడా ఇచ్చింది నిజమే కదా? తమ ఆధిపత్యం వాస్తవమేననీ, తెలంగాణకు స్వేచ్ఛ కావలసిందేననీ పరోక్షంగా ఒప్పుకున్నరు కదా? ఒప్పుకున్నట్టే ఒప్పుకుని రాష్ట్రం సిద్ధించినాక ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని దొడ్డిదారిన కూల్చ ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయిందీ నిజమే కదా? 2024 దాకా హైదరాబాద్పై ఉమ్మడి రాజధానిగా ఉన్న అవకాశాన్ని వదులుకుని, భయపడి పారిపోయింది నీవే కదా చంద్రబాబు… మరి ఏమి మారిందని మళ్లా వస్తున్నరు?
ఈ దేశంలో మత రాజకీయాలను బొంద పెట్టాలని ఎట్లా లక్ష్యంగా పెట్టుకున్నమో, కుల రాజకీయాలను కూడా అట్లాగే కూకటి వేళ్ళతో పెకలించి వేయడం యజ్ఞంగా పూనుకున్నం మేము. ఈ రోజు మీరు మాకు కాదు, మేమే మీకు వెలుగు చూపగలిగేవాళ్లము.
టీడీపీ ఖమ్మం సభ కాసాని జ్ఞానేశ్వర్ ధన ప్రదర్శన తప్ప చంద్రబాబు గొప్పేమీ లేదు! తెలంగాణకు సమస్యలు సృష్టిస్తున్న కేంద్రం గురించి చంద్రబాబు ఏమీ అనలేదు. కేసీఆర్ పేరు కూడా ఎత్తకుండా స్పీచ్ ముగించిండు. ఏ ఒక్క చోట కూడా జై తెలంగాణ అనలేదు. ‘తెలంగాణ’ పదం ఆయన ఉనికికే ఉలికిపాటు, భవిష్యత్తుకే గగుర్పాటు! ఆయన గమనించాల్సింది ఏమంటే – ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీకి ఉత్థాన పతనాలే తప్ప పునరుత్థానాలు ఉండవు. ముఖ్యమంత్రిగా ఉండగానే ఇక్కడి నుంచి పారిపోయి… ఇపుడు అధికారం, ప్రాభవం కోల్పోయిన సమయంలో మరలా వస్తా, ఏదో కొత్తగా పొడిచేస్తా అనడం కన్నా హాస్యం మరొకటి ఉంటదా? ఒకరిది అన్నతో పంచాయితీ, మరొకరిది కులం పంచాయితీ. వీళ్లందరినీ వాడుకుని చలి కాచుకొనే తెలివి మరొకరిది. వీళ్ళ పప్పులు ఇక్కడే కాదు, వాళ్ళ వాళ్ళ రాష్ర్టాలలో కూడా ఉడకనివ్వొద్దు. ఇది మన బాధ్యత!
బోత్ ఆర్ నాట్ సేమ్!
ఇపుడు మీరెవరైనా అడగవచ్చు – మరి కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టి దేశమంతా తిరగవచ్చా? చంద్రబాబు, షర్మిల మాత్రం తెలంగాణలో తిరగకూడదా?’ అని! రాజ్యాంగ పరంగా చూస్తే తిరగవచ్చు, ఓట్లు అడగవచ్చు. కానీ నైతికంగా, గతం చెప్పే గణాంకాల చరిత్ర పరంగా మాత్రం వారికి ఆ అర్హత లేదు. ఎనిమిదేండ్ల తన పాలనలో తెలంగాణను సర్వతోముఖాభివృద్ధి బాట పట్టించిన కేసీఆర్ తెలంగాణ మాడల్ దేశమంతా చేసి చూపిస్తా అని అడగవచ్చు. నైతికత, గణాంకాలు ఆయనకు తోడుగా ఉన్నాయి.
మత వివక్ష ద్వారా సమాజాన్ని విచ్ఛిన్నం చేసిన సాంస్కృతిక మాదక ద్రవ్య వ్యాపారి నరేంద్ర మోదీ ఒక పనికిరాని గుజరాత్ మాడల్ను చూపించి దేశ ప్రధాని కాగలిగినప్పుడు; అంతకు కొన్ని వేల రెట్లు గుణాత్మకమైన, పారదర్శకమైన, అభివృద్ధి కారకమైన, సంక్షేమ పూరకమైన, ఆత్మ గౌరవ ప్రేరకమైన పాలన అందించిన వాడిగా కేసీఆర్కు శత్రువులు సైతం కాదనలేని ట్రాక్ రికార్డ్ ఉన్నది. దేశమంతా తెలంగాణలాగే కరెంటు, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, ఆసరా కావాలి అని డిమాండ్లు రావడం వాస్తవం కాదా? రేపు బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో ఈ పథకాలు అమలు చేస్తామంటే చంద్రబాబు గానీ, షర్మిల గానీ ఒద్దనగలరా? త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ర్టాల్లో బీఆర్ఎస్ ఈ మేనిఫెస్టో ప్రకటిస్తే ఒక్కరైనా తప్పు పట్టగలరా? తామెందుకు చేయలేదో చెప్పగలరా?
కేసీఆర్ తాను చేసిన పనులను చూపిస్తూ ఓటు అడుగుతరు. ఆ ఓటు దేశాభివృద్ధికి చోటు అని చెపుతరు. మరి విఫల పాలనల ప్రతినిధులు ఏమివ్వగలరు తెలంగాణకు? ప్రజలెట్ల నమ్ముతరు మిమ్మల్ని? అందుకనే అనేది… బోత్ ఆర్ నాట్ సేమ్!
కేసీఆర్ చెప్తున్న గుణాత్మకమైన మార్పు సాధ్యమే. రాబోయే రోజులకు తను ఇటీవల ఆవిష్కరించిన ఆరు కొత్త పాలసీలను, వాటి వెనక ఉన్న తపనను గమనించి నమ్మండి. ఇందులో ప్రతి ఒక్కటీ తెలంగాణలో చేసి చూపించిన్రు. నూతన విదేశాంగ విధానం లాంటివి ఒకటి రెండు కొత్తగా దృష్టి పెట్టవలసి వస్తుంది.
మిత్రులారా… గోదాదేవి పూల మాలలను ముందు తాను అలంకరించుకొని తృప్తి చెందిన తర్వాతే వాటిని శ్రీరంగనాథుని మెడలో చూసి పరవశించిపోయేది. అర్పణలోని ఆనందం వేరే! అది ప్రియునిగా భావించిన దేవునిపైనైనా… దైవ సమానంగా భావిం చే ప్రజల కోసమైనా… తాదాత్మ్యపు భావనలో రెండూ ఒకటే. ఈ మానవాళికి శాంతిని ప్రసాదించిన మహనీయుడు యేసుక్రీస్తును స్మరించుకోవలసిన సందర్భం కూడా ఇదే.
అర్హత లేని వారికి అధికారం ఇస్తే / దయ ధర్మం దారి తప్పునేమో; దారి తప్పిన వారిని చేరదీయకుంటే / తిరిగి తిరిగితిరగబడతారే మో; తగిన వారికి తగు బలమిచ్చి / సహనం, క్షమ, సఖ్యతనిచ్చి… అంటూ ఆ దేవునికి మొర పెట్టుకుంటరు మోదుకూరి జాన్సన్.
దేవుడి పేరు ఏమైనా, రూపం ఏదైనా, అసలు రూపమే లేకపోయినా… సారం ఒకటే… ద్వేషం నశించాలి. ప్రేమ-అర్పణ విలసిల్లాలి. అందుకు చేయాల్సినది-అర్హత లేనివారికి అధికారం ఇవ్వొద్దు, తగిన వారికి తగు బలం ఇవ్వాలి!
ఆ దేవుళ్ల ఆశీర్వాదంతో, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వెలుగులో ఈ దేశాన్ని కాపాడుకుందాం. కుల మతాల కుత్సితులకు బుద్ధి చెపుదాం!
– శ్రీశైల్ రెడ్డి పంజుగుల
90309 97371