ఒకే దేశం, ఒకే చట్టం విధానాన్ని ఎర్రకోట సాక్షిగా తాము అమలుచేస్తున్నామని మోదీ ప్రభుత్వం చెప్పిన మాటలు కేవలం నీటి మీది రాతలుగా మిగిలాయి. అంతేకాకుండా అసెంబ్లీ స్థానాల పెంపుదలలో రాజకీయ స్వార్థంతో వ్యవహరించటం దేశంలో ప్రజాస్వామ్యం, ఫెడరలిజం పట్ల ప్రజల్లో నమ్మకం పోయేవిధంగా ఉన్నది. జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ స్థానాలు పెంచిన బీజేపీ తెలంగాణలో ఎందుకు పెంచదు?
తెలంగాణ, జమ్మూకశ్మీర్ రాష్ర్టాల విభజన చట్టాల్లో అసెంబ్లీ స్థానాల పెంపుదల ఉన్నప్పటికీ కేవలం జమ్మూకశ్మీర్కు మాత్రమే ‘డీ లిమిటేషన్’ చేయటం పూర్తిగా వివక్షాపూరితం. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ర్టాల పట్ల వివక్ష చూపటం కేంద్ర సర్కారుకు పరిపాటి అయ్యింది. ఆర్టికల్ మూడు కింద ఏపీ, జమ్మూకశ్మీర్ విభజన చట్టాల అమలులో ప్రత్యేకించి అసెంబ్లీ స్థానాల పెంపుదల అంశంలో పూర్తి భిన్నవైఖరి అవలంబించడం రాజ్యాంగ ఉల్లంఘనే.
జమ్మూకశ్మీర్కు ఆర్టికల్-370 కింద ఏర్పడిన ప్రత్యేకాధికారాలు, వెసులుబాట్లను, ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం ‘జమ్మూకశ్మీర్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్’ను తెచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్ 60లో అసెంబ్లీ స్థానాలు 107 నుంచి 114కు పెంచారు. సెక్షన్ 63లో 2026 తర్వాత వచ్చే జనాభా లెక్కల ప్రకారం కాకుండా 2011 జనాభా లెక్కలతో పునర్విభజన చేయాలని నిర్దేశించారు.
తెలంగాణ, విభజిత ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాలు వరుసగా 119 నుంచి 153, 175 నుం చి 225కు పెంచాలని ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం సెక్షన్ 26లో నిర్దేశించారు. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు పెంచాలని 2014 నుంచి టీఆర్ఎస్ విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నది. నాటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావుతో హోంశాఖ, దివంగత లెజిస్లేటివ్ కార్యదర్శి నారాయణరావు పలు దఫాలు సమావేశం నిర్వహించి చట్ట సవరణ లేదా కేంద్ర క్యాబినెట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో ఉభయ రాష్ర్టాల్లో అసెంబ్లీ సీట్లు పెంచవచ్చని నివేదికలు రూపొందించాయి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పలుమార్లు ప్రధాని మోదీని కలిసి సీట్ల పెంపుదల అమలుచేయాలని విజ్ఞప్తి చేస్తే ‘చూద్దాం.. చేద్దాం’ మాటలతో సరిపుచ్చటం గర్హనీయం.
కేంద్రం 2026 వరకు అసెంబ్లీ స్థానాలు పెంచకూడదని అలా చేయాలంటే ఆర్టికల్ 170 (3) సవరించాలని గత ఏడున్నరేండ్లుగా పార్లమెంట్లో, బయటచెప్తున్నది. మరి అదే జమ్మూకశ్మీర్ విషయంలో రాష్ట్ర పునర్విభజన చట్టంలో అసెంబ్లీ స్థానాల పెంపు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్దేశించింది. వెంటనే సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి రంజన్ ప్రకాశ్ దేశాయ్ను చైర్మన్గా డీ లిమిటేషన్ కమిషన్ను కేంద్రం ఏర్పాటుచేసింది. సిక్కింలో తాజాగా అసెంబ్లీ స్థానాలు 30 నుంచి 40కి పెంచేందుకు కేంద్ర హోంశాఖ ముసాయిదా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 26లోనే ‘సబ్జెక్ట్ టు ప్రొవిజన్’ స్థానంలో ‘నాట్ విత్ స్టాండింగ్ కంటైనింగ్ ఎనీథింగ్ ఆఫ్ ద ఆర్టికల్ 170 క్లాజ్ 3’ చేర్చి పార్లమెంట్లో చట్ట సవరణ లేదా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో అమలుచేయవచ్చని న్యాయకోవిదులు మాడభూషి శ్రీధర్, మాజీ ఎంపీ వినోద్కుమార్, ఎంపీ కేశవవరావు పలువురు న్యాయనిపుణులతో కూడిన బృందం కేంద్ర పెద్దలకు నివేదికలు అందజేసి కోరినా కేంద్ర వైఖరిలో ఎలాంటి మార్పు లేదు.
వాస్తవానికి 2013లో కేంద్ర క్యాబినెట్ రూపొందించిన ముసాయిదా బిల్లులోనే ఇరు రాష్ర్టాల సీట్ల పెంపుదల పేర్కొని సెక్షన్ 26లో చేర్చారు. ఆ తర్వాత క్యాబినెట్ తుది ఆమోదం పొందిన బిల్లును ఫిబ్రవరి 13న లోక్సభలో, ఫిబ్రవరి 18న రాజ్యసభలో ఆమోదించారు. ఈ బిల్లులోని అన్ని అంశాలను నాటి బీజేపీ నేతలు అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, వెంకయ్యనాయుడు పరిశీలించి వారి సమ్మతితో పలుమార్పులు చేసిన మీదట క్యాబినెట్ ఆమోదించిన వాస్తవాన్ని కేంద్రమంత్రి, బీజేపీ దృష్టికి తీసుకువస్తున్నాం.
ఇప్పటికైనా విభజన చట్టంలో మంజూరు చేసినవాటిని అమలుపరుస్తూ అసెంబ్లీ స్థానాల పెంపుదలకు కట్టుబడి ఉండాలి. అసెంబ్లీ స్థానాల పెంపుదలలో ఆయా రాష్ర్టాల పట్ల కేంద్రం చూపిస్తున్న వివక్షను మానుకోవాలి. అలా చేస్తేనే చట్టాల అమలుపై ప్రజల్లో నమ్మకం కలిగి ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలబడుతుంది.
విభజన బిల్లులో రాత్రికి రాత్రి సీట్ల పెంపు అంశాన్ని చేర్చారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అంటున్నారు. కనుచూపు మేరలో తెలంగాణలో తమకు అధికారం దక్కే అవకాశం లేనందున ఈ వాదన ముందుకు తెస్తున్నట్లనిపిస్తున్నది. దీన్నిబట్టి కేంద్రం అసెంబ్లీ స్థానాల పెంపును రాజకీయ కోణంలోనే చూస్తుందన్నది స్పష్టమైంది. 2001 జనాభా ప్రకారం చూసినా ఆంధ్ర, తెలంగాణలో దళితులు, గిరిజనులు వారికి అదనంగా రావలసిన 22 రిజర్వ్డ్ స్థానాలు కోల్పోతున్నారు. 2011 ప్రకారం సీట్ల సంఖ్య పెరిగితే 35 దాకా ఎస్సీ, ఎస్టీలకు స్థానాలు పెరుగుతాయి.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)
– ఇనగంటి రవికుమార్
94400 53047