రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణ ప్రాంతంలో గురుకులాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం గురుకులాల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నది. ఆహారంలో నాణ్యత పెరిగింది. దీనంతటికీ కారణం రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకత్వం ఉండటం వల్లనే…
ఉమ్మడి రాష్ట్రంలో గురుకుల విద్యాలయాలను నిర్వహించడం కష్టంగా ఉండేది. ఆ పాఠశాలల్లోని విద్యార్థినీ, విద్యార్థులు మా సమస్యలు పరిష్కరించాలని ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు విన్నవించుకునేవాళ్లు. విద్యార్థులకు నాసిరకం బియ్యంతో వండిన అన్నం పెట్టేవాళ్లు. ఆ అన్నంలో రాళ్లు, పురుగులు వచ్చేవి. దీంతో విద్యార్థులు అపెండిసైటిస్ వంటి పలురకాల వ్యాధులకు గురయ్యేవాళ్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని అధికార యంత్రాంగం విద్యార్థుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తద్వారా గురుకులాల్లో పలు సంస్కరణలు తీసుకువచ్చారు. ఫలితంగా ఇప్పుడు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి ఆహారం కూడా అందుతున్నది.
పేద విద్యార్థులకు మంచి విద్య అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో గురుకులాల్లో ఇంగ్లీషు మీడియంలో విద్యనందించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నది. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో సరైన తరగతి గదులు, బాలికలకు సరిపడా మరుగుదొడ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. విద్యార్థులకు సరైన తాగునీరు అందుబాటులో లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం గురుకుల విద్యాలయాలకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించించింది. ఇవి సరిపోకపోతే నాబార్డ్ లాంటి సంస్థల నుంచి అప్పు తీసుకొని మరీ మౌలిక వసతులను మెరుగుపరిచింది.
నాటి గురుకులాల్లో ఉపాధ్యాయులు, అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది కొరత విపరీతంగా ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, గురుకుల ఉమ్మడి రిక్రూట్మెంట్ బోర్డు కలిసి ఉద్యోగులను నియమించింది. జాతీయ విద్యావిధానం-2020లోని అంశాలు, బోధనశాస్త్ర విషయాలు తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదేండ్లుగా అమలవుతున్నాయి. అందుకే గురుకులాల్లో మెరుగైన విద్యాబోధన జరుగుతున్నది. మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. పై సంస్కరణల ఫలితంగా పేదలు, బడుగు, దళితవర్గాల పిల్లల ప్రవేశాల కోసం వారి తల్లిదండ్రులు గురుకుల విద్యాలయాల్లో ప్రవేశం కోసం పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ గురుకుల విద్యాలయాలకు ప్రైవేటు బడుల నుంచి వలసలు పెరుగుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు రాష్ట్రవ్యాప్తంగా జనరల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల విద్యాలయాలతో కలిపి 298 గురుకుల విద్యాలయాలే ఉండేవి. కానీ ఆ సంఖ్య 1002కి పెరిగింది. ఈ స్థాయిలో పెరగటానికి కారణం విద్యార్థుల నమోదు, అడ్మిషన్ల కోసం డిమాండ్ పెరగటమే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల్లో దాదాపు ఆరు లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఏటా విద్యా సంవత్సరానికి ముందే.. అంటే, మార్చి, ఏప్రిల్ నెలల్లోనే ప్రవేశానికి దరఖాస్తులు తీసుకోవడం, ప్రవేశ ప్రక్రియను పూర్తిచేయడం జరుగుతున్నది.
గురుకుల విద్యాలయాల్లో విద్యనభ్యసించిన విద్యార్థినీ విద్యార్థులు దాదాపు 930 మంది వైద్యులయ్యారు. 1,517 మంది ఇంజినీర్లు అయ్యారు. ముస్లిం బాలికలు కళాశాల విద్యలో జాతీయస్థాయిలో రాష్ట్రంలో రెండోస్థానంలో నిలువగా, పాఠశాల విద్యలో మూడోస్థానంలో నిలిచారు. నేడు గురుకుల విద్యార్థినీ విద్యార్థులు జాతీయస్థాయిలో జరిగే పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తున్నారు. అటు విద్యలోనే కాకుండా ఇటు క్రీడల్లో, సాంకేతిక విద్యలో, నీట్ లాంటి పరీక్షల్లో, పర్వతారోహణ వంటి క్లిష్టమైన అంశాల్లో చూపిస్తున్న ఫలితాలు మేధావుల నోటా ఔరా అనిపిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల రూపకల్పనకు ప్రతిరూపం ఈ ఫలితాలని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గురుకులాల విద్యాలయాల్లో ఉచిత విద్య, ఉచిత భోజనం, ఉచిత వసతి సౌకర్యాలు, ఉచితంగా పాఠ్య పుస్తకాలను అందిస్తున్నది. నేడు గురుకులాల్లో ప్రవేశాల కోసం తలిదండ్రులు పోటీపడుతున్నారంటే గురుకుల విద్యాలయాలపై ప్రభుత్వం పెట్టిన ప్రత్యేక శ్రద్ధనే కారణం. ప్రధానంగా ఆర్థిక, సామాజిక, వెనుకబాటు ఉన్న వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న గురుకుల విద్య ఒక వరం.
సీవీవీ ప్రసాద్: 80196 08475
(వ్యాసకర్త: విశ్రాంతప్రధానోపాధ్యాయులు)