తెలంగాణ రాజకీయ ప్రస్థానం కొత్త దశ, దిశను ఎంచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకు సంబంధించిన అంతఃసంఘర్షణ జరుగుతోంది. తెలంగాణ నేలపై అనేక చారిత్రక ఉద్యమాలు జరిగాయి. అన్నింట్లోనూ నిలిచి గెలిచింది తెలంగాణ అస్తిత్వ ఉద్యమమేనన్నది తిరుగులేని సత్యం. రాష్ట్ర అవతరణ తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించిన బలమైన దారి ఏర్పడింది. ఇప్పుడు అన్నీ చూసిన తెలంగాణ సమాజం కొత్త రాజకీయ కోణం వైపు దృష్టి సారిస్తున్నది.
సమాజంలో జరగాల్సిన అత్యంత కీలకమైన మార్పునకు సంకేతంగా నిలిచిన, సమాజంలో సగభాగమైన బీసీల నుంచి ఈ అంతఃసంఘర్షణ మొదలవుతున్నది. ఇప్పుడు తెలంగాణలో రాజకీయ సందిగ్ధత నెలకొన్నది. ఇది ఒక రకంగా సంధికాలంగా మారింది. ‘అన్నింట్లో ముందున్నాం, సంపద సృష్టిలో కీలకంగా నిలిచాం. కానీ, ఫలితాలు పొందడంలో ఎందుకు వెనుకబడి ఉన్నాం’ అనే ప్రశ్న బీసీలను వెంటాడుతోంది. దాని నుంచే ఒక కొత్త సంఘర్షణ మొదలుకానుంది. జనాభాలో సగానికి పైగా ఉండే తమకు అందుకు తగ్గట్టు సీట్ల వాటా ఏదని అన్ని రాజకీయ పార్టీలను బీసీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ చైతన్యానికి ప్రతిరూపంగానే బీసీల ఓట్లు బీసీలకే వేసుకోవాలనే బలమైన స్వరాలు వినిపిస్తున్నాయి. ‘అన్నీ చూసిన బీసీలం. మనల్ని మనం ఎందుకు గెలిపించుకోలేం’ అన్న ప్రశ్నలు కూడా బలంగా ఉదయిస్తున్నాయి.
ఈ సంధికాలమే తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారడానికి కావాల్సిన సరైన తరుణమని కూడా బీసీలు భావిస్తున్నారు. ఈ బీసీ చైతన్యాన్ని కూడా తమవైపు తిప్పుకోవాలని రాజకీయ పార్టీలు పథక రచనలు చేసుకుంటున్నాయి. పదునెక్కిన బీసీ చైతన్యం ముందుకు వస్తే సగభాగంగా ఉన్న తమకు అన్నింటిలో సమవాటా కావాలన్న నినాదం మిన్నంటుతుంది. ఆ మిన్నంటే దశకు వెళ్లడానికి ఎవరు కొలిమి రాజేస్తారా? అని బీసీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. బీసీలలో జరుగుతున్న ఈ తండ్లాటని తక్కువగా అంచనా వేసిన రాజకీయ పార్టీలు తప్పకుండా పక్కకుపోయి తీరుతాయి. ఎవరి గెలుపుకైనా తామే ఆధారం అన్న దృఢ నిశ్చయం కలిగిన బీసీలు ఇప్పుడు తమను తాము గెలిపించుకోడానికి సర్వసన్నద్ధం అవుతున్నారు. తెలంగాణ రాజకీయ ముఖచిత్రానికి ఇది సంధికాలం కావచ్చు. కానీ, ఇది బీసీలకు మాత్రం సమరానికి సన్నద్ధమయ్యే చారిత్రకమైన సమయంగా భావిస్తున్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏండ్లు కావస్తున్నా ఇంకా బీసీ కులాలకు సంపూర్ణ రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం అందడం లేదు. అందుకే బీసీల సాధికారత కోసం బీసీలందరు సంఘటితమై, కలిసికట్టుగా కదిలే సమయం కూడా తెలంగాణ సమాజం తప్పక చూస్తుంది.
బీహార్లో, తమిళనాడులో, ఉత్తరప్రదేశ్లో బీసీ కులాలకు సంబంధించిన నేతలు ముఖ్యమంత్రులుగా నిలిచారు. దేశవ్యాప్తంగా ఎన్నో మార్పులు సంభవిస్తున్న ఈ తరుణంలో తెలంగాణలో కూడా బీసీల అస్తిత్వం ఒక ప్రధాన ఎజెండాగా ముందుకు రాబోతోంది. ఇప్పటికే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక అందులో తమ సంఖ్య ఎంతో బీసీలు లెక్కించుకున్నారు. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు సమప్రాధాన్యం ఇచ్చిన రాజకీయ పార్టీలు ఏవో అంచనాలు కడుతున్నారు.
రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో తమకు 50 శాతం సీట్లివ్వాలన్న డిమాండ్లతో ముందుకు దూసుకువచ్చేందుకు బీసీ వర్గాలు సన్నద్ధమవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించింది. ఆ హామీని నెరవేర్చకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు ఎట్లా వెళ్తారో చూస్తామని బీసీలు అనుకుంటున్నారు. జనాభాలో సగం ఉన్న బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని బీసీ గర్జనలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా మున్సిపాలిటీల చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, గ్రామ పంచాయతీలు.. ఇలా అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం సీట్లు బీసీలకు ఇవ్వాలన్న ఒక ప్రధాన డిమాండ్ ముందుకు రానుంది. ఇదే రాబోయే కొత్త రాజకీయ మార్పునకు సంకేతంగా నిలుస్తుంది.
– జూలూరు గౌరీశంకర్