ప్రసిద్ధి గాంచిన ఢిల్లీ ఎర్రకోటలో నిర్వహించబడ్డ రెండు విచారణలు, అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రాతిపదికగా జరిగినవి కాబట్టి, ప్రపంచ వ్యాప్తంగా అవి న్యాయకోవిదుల దృష్టిని ఆకర్షించాయి. అందులో మొదటిది 1858లో చివరి మొఘల్ చక్రవర్తి బహదుర్-షా-జఫర్ పై జరిగిన విచారణకాగా, రెండవది 1945 లో ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఏ) పోరాట యోధులపై జరిగిన విచారణ.
ఇక మొదటి విచారణతో భారతదేశంలో మొఘల్ పాలన అంతం కాగా, రెండవ విచారణతో బ్రిటిష్ పాలన అంతం కావడం ఒక చారిత్రక విశేషం. ఏదేమైనా రెండు విచారణలు భారత దేశ చరిత్ర పుటల్లో ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.ఎర్రకోటన ఐఎన్ఏ విచారణ గురించి తెలుసుకొనే ముందు ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఏ) లేదా ‘ఆజాద్-హింద్-ఫౌజ్’ గురించి తెలుసుకోవలసిన అవసరమున్నది.
అది రెండవ ప్రపంచ యుద్ధ సమయం. ప్రపంచంలోని పెక్కు దేశాలు, మిత్రరాజ్యాలుగా, అక్షరాజ్యాలుగా విడిపోయి పోరాటం చేస్తున్నాయి. అమెరికా, బ్రిటన్ దేశాలు మిత్రరాజ్యాలు కాగా, ఇటలి, జర్మనీ, జపాన్ లు అక్షరాజ్యాలుగా మారాయి. యుద్ధ ప్రారంభ దశలోఅక్షరాజ్యాలు ఘన విజయాలు సాధించడంతో వేలాది మంది బ్రిటిష్ సైనికులు, వారితో పాటే కలిసి పోరాడుతున్న భారత సైనికులు జర్మనీ, జపాన్లకు బందీలయ్యారు.
అప్పటికే జపాన్లో స్థిరపడ్డ భారత విప్లవకారుడు రాస్బిహారి బోస్, భారతదేశ స్వాతంత్య్రమే లక్ష్యంగా పనిచేసే ఇండియన్-ఇండిపెండెన్స్-లీగ్ అనే సంస్థను జపాన్లో స్థాపించాడు. తర్వాత జపాన్ ప్రభుత్వాన్ని ఒప్పించి యుద్ధంలో పట్టుబడ్డ భారతీయ బందీలతో ఇండియన్-నేషనల్-ఆర్మీ (ఐఎన్ఏ) అనే సైనిక దళా న్ని నిర్మించాడు. దీని నేతృత్వాన్ని కెప్టెన్ మోహన్సింగ్ కు అప్పగించాడు. ఈ సైనిక దళ లక్ష్యం జపాన్ సహకారంతో భారత దేశంలోని బ్రిటిష్ సైన్యంపై దండెత్తి, వారినోడించి, భారత దేశానికి స్వాతంత్య్రం సాధించడం.
సరిగ్గా ఇదే సమయంలో జర్మనీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్, జర్మనీ నియంత హిట్లర్ను కలుసుకొని ఆయన సహకారంతో ‘ఫ్రీ-ఇండియా- సెంటర్’ ను , దానితో పాటే, ఒక రేడియో స్టేషన్ను జర్మనీలో స్థాపించాడు. వీటితో పాటు యూరప్ యుద్ధరంగంలో పట్టుబడిన భారత బందీలతో ‘ఇండియన్-లెజియన్’ అనే సైనిక పటాలాన్ని నిర్మించాడు. జర్మనీ సహకారంతో ఈ సైనికదళం భారతదేశంలోని బ్రిటిష్ సైన్యంపై దాడిచేసి స్వాతంత్య్రం సాధించాలన్నది నేతాజీ ఆశయం.
ఇక, జపాన్లో రాస్ బిహారి బోస్ ఇండియన్-ఇండిపెండెన్స్-లీగ్ నిర్వహణ బాధ్యతను నేతాజీ సమర్థవంతంగా నిర్వహించగలడని భావించి, ఆయనను జపాన్కు రావలసిందిగా ఆహ్వానించాడు. ఆ ఆహ్వానాన్ని అంగీకరించిన నేతాజీ అతి ప్రమాదకరమైన సబ్ మెరైన్లో ప్రయాణం చేసి, జపాన్ చేరుకొని, లీగ్ బాధ్యతని స్వీకరించి ఐఎన్ఏకు సర్వ సైన్యాధ్యక్షుడయ్యాడు. అంతేగాక 1943అక్టోబర్లో జపాన్ సహకారంతో స్వతంత్ర భారత (తాత్కాలిక) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఈ ప్రభుత్వానికి అక్షరాజ్యాలతో పాటు బర్మా, ఫిలిఫ్పైన్ల గుర్తింపు లభించింది. అంతేగాక అండమాన్, నికోబార్ దీవులను జపాన్ ఈ ప్రభుత్వానికప్పగించింది. అంతర్జాతీయ గుర్తింపు లభించడంతో నేతాజీ అమెరికా, బ్రిటన్ దేశాల మీద యుద్ధం ప్రకటించాడు.
సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఐఎన్ఏ, జపాన్ సేనలతో కలసి బ్రిటిష్ సైన్యంతో తలపడింది. అయితే జపాన్ సైన్యాధికారుల తప్పుడు నిర్ణయాల వల్ల, జపాన్ సైన్యం, దానితో పాటు ఐఎన్ఏ పరాజయం పాలయ్యాయి. మరొక వైపు 1945 ఆగస్ట్టులో హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబుల దాడితో జపాన్ మిత్రరాజ్యాలకు తలవంచక తప్పలేదు.
ఇక యుద్ధం ముగియడంతో బ్రిటిష్ ప్రభుత్వం పోరాటంలో ప్రముఖ పాత్ర వహించిన ముగ్గురు ఐఎన్ఏ సైనికాధికారులమీద ఢిల్లీలోని ఎర్రకోటలో కోర్ట్ మార్షల్ విచారణ ప్రారంభించింది. ఆ ముగ్గురు కెప్టెన్ షానవాజ్ ఖాన్, కెప్టెన్ ప్రేమ్కుమార్ సెహగల్, లెఫ్టినెంట్ గురుబక్ష్సింగ్ ధిల్లాన్. విచిత్రంగా వీరు ముగ్గురూ మూడు మతాలకు చెందినవారు.
కోర్ట్మార్షల్లో వీరి ముగ్గురి మీద మోపబడ్డ ప్రధాన అభియోగం బ్రిటిష్-చక్రవర్తిపై యుద్ధం చేయడం. అంతేగాక ధిల్లాన్పై నాలుగు హత్యల నేరం, షానవాజ్ ఖాన్, ప్రేమ్ కుమార్ సెహగల్ పై నేర ప్రేరేపణ (Abetment) అభియోగాలు మోపబడ్డాయి. కోర్ట్ మార్షల్ విచారణలో అప్పటి ప్రముఖ న్యాయవాది భులాభాయి దేశాయి నిందితుల తరఫున వాదించాడు. నిందితులంతా స్వతంత్ర భారత (తాత్కాలిక) ప్రభుత్వ సైనికాధికారులని, అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం వేరొక ప్రభుత్వ సైనికుల్ని కోర్ట్ మార్షల్ చేసే అధికారం ఏప్రభుత్వానికీ ఉండదని తేల్చి చెప్పాడు. విచారణ దాదాపు రెండు నెలలు కొనసాగింది. ఇక 1945 డిసెంబర్ 31న కోర్ట్ మార్షల్ తీర్పు వెలువడింది. హత్యా నేరం నుంచి ధిల్లాన్, నేర ప్రేరేపణ నుంచి సెహగల్లు బయటపడగా, కెప్టెన్ షానవాజ్ ఖాన్ నేర ప్రేరేపణ దోషిగా నిర్ణయించబడ్డాడు. అయితే ముగ్గురు యోధులు కూడా బ్రిటిష్-చక్రవర్తిపై యుద్దం చేశారనే నేరంలో దోషులుగా నిర్ణయించబడ్డారు.. ఈ నేరానికి ముగ్గురికీ యావజ్జీవ ప్రవాస శిక్ష విధించబడింది.
అయితే ఈ శిక్షలకు కమాండర్-ఇన్ -ఛీఫ్ ఆమోదముద్ర లభించవలసి ఉంటుంది. అంతే కాదు ఆయనకు వారి శిక్షలను తగ్గించే, మార్పు చేసే , కొట్టివేసే అధికారముంది. ఇక దేశంలో నెలకొన్న పరిస్థితులను అర్థం చేసుకొన్న అప్పటి బ్రిటిష్ కమాండర్-ఇన్ -ఛీఫ్ వారికి విధించిన శిక్షను కొట్టి వేశాడు. ఆ తర్వాత ఐఎన్ఏ యోధులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.