భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత హోదాలో ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో అడుగు మోపుతున్నారు. ఆదివారం నాందేడ్లో జరగనున్న సభలో బీఆర్ఎస్ శంఖాన్ని పూరించనున్నారు. ఈ సభ ద్వారా తెలంగాణ మహారాష్ట్ర ప్రజల శతాబ్దాల మైత్రీ బంధం మరింత బలోపేతమై దేశ రాజకీయాలలో నవశకానికి నాంది కానున్నది.
తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల మధ్య భౌగోళిక, భాష, సాంస్కృతిక, రాజకీయ, ఉద్యమ అనుబంధం ఈనాటిది కాదు. ఒక రకంగా తెలంగాణ మహారాష్ట్ర ప్రజలు సయామీ కవలలు. ఇవాల్టి మహారాష్ట్రలోని సగ భాగం ఒకప్పటి హైదరాబాద్ రాజ్యంలో, ఆ తర్వాత ఏర్పడిన హైదరాబాద్ రాష్ట్రంలో అంతర్భాగం. మహారాష్ట్ర నవ నిర్మాణంలో తెలంగాణ ప్రజల పాత్ర ఎంత గొప్పదో, తెలంగాణ వికాస ప్రస్థానంలో మహారాష్ట్ర ప్రజల పాత్ర అందుకు ఏమాత్రం తీసిపోనిది. మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని వర్లీ, బోయివాడ, మాతుంగ, దాదర్, నవీ ముంబయి ప్రాంతాల్లో పర్యటిస్తే తెలంగాణలో ఉన్నామా అన్న అనుభూతి కలుగక మానదు. విశేషమేమిటంటే ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రజలు ముంబయిలో కూడా ఎక్కడికక్కడ సమీకృతులై ఒక్కచోట చేరటం, స్థిరపడ్డ ప్రవాస తెలంగాణ కుటుంబాలు ఆయా జిల్లాల ఆశ్రితులను ఆదరించి ఆశ్రయం కల్పించి ఉపాధి అవకాశాలు చూపించడం శతాబ్దాలుగా జరుగుతున్నది. అదేవిధంగా హైదరాబాద్కు వచ్చి చేరుతున్న మహారాష్ట్ర ప్రజలను తెలంగాణ సమాజం ఆదరించి అక్కున చేర్చుకుంటున్నది.
రెండు రాష్ర్టాల భౌగోళిక బంధం కూడా ప్రగాఢమైనది. రెండు జీవనదులు కృష్ణా, గోదావరి ఒక పేగుబంధమైతే, రెండు రాష్ర్టాల్లో సరిహద్దు జిల్లాలు, సమీప జిల్లాలు గణనీయంగా ఉన్నాయి. నాందేడ్, యావత్మల్, చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాలు అక్కడి సరిహద్దు జిల్లాలు కాగా ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఇటువైపు జిల్లాలు. ఇక షోలాపూర్, ఉస్మానాబాద్, అకోలా, అమరావతి, నాగపూర్, రామ్టెక్ ప్రాంతాలు తెలంగాణ ప్రజలతో, ప్రాంతంతో పెనవేసుకున్నవే. భాషా సాంస్కృతిక బంధాల విషయానికొస్తే ఉభయ రాష్ర్టాల్లో సరిహద్దు జిల్లాల ప్రజలు తెలుగు, మరాఠీ భాషలను అర్థం చేసుకుంటారు. మాట్లాడతారు. ఇక పరస్పర వైవాహిక సంబంధ బాంధవ్యాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు.
ఎన్నికలొచ్చినప్పుడు ఈ రెండు రాష్ట్రాల అభ్యర్థులు పరస్పరం సహకరించుకోవడం, ప్రచారాల్లో పాల్గొనటం పరిపాటిగా వస్తున్నది. మరాఠా పత్రికలు చదివే, ఛానళ్ళను చూసే తెలంగాణ ప్రాంత ప్రజలున్నట్టే తెలుగు మీడియాను అనుసరించే మహారాష్ట్ర ప్రాంత ప్రజలూ లక్షల్లో ఉన్నారు. మన దగ్గర మరాఠీ మీడియం ఉన్నట్లే అక్కడ తెలుగు మీడియం విద్యాసంస్థలున్నాయి. ఇక్కడ మరాఠా సంఘాలున్నట్లే అక్కడ తెలుగు సంఘాలున్నాయి. చెప్పుకుంటూ పోతే సామరస్యం, సమాంతర సహజీవనాన్ని వర్ణించడానికి మాటలు చాలవు.
ముంబయికి తలమానికంగా ఉన్న విక్టోరియా టెర్మినల్తో సహా ఎన్నెన్నో బృహత్ నిర్మాణాలలో తెలంగాణ శ్రమజీవుల పాత్ర జగద్విదితమే. షోలాపూర్ మొదలుకొని భివాండి దాకా వివిధ పరిశ్రమలను ప్రత్యేకించి వస్త్ర పరిశ్రమను శిఖరాయమానంగా నిలబెట్టిన శ్రమజీవులు తెలంగాణ బిడ్డలే. ముంబయి వికాస ప్రస్థానంలో తెలంగాణ ప్రజల పాత్రను నిర్ధారిస్తూ వివిధ భాషల్లో ఎన్నో పుస్తకాలు వెలువడ్డాయి. మరోవైపు తెలంగాణలో గత శతాబ్ది ఆరంభంలోనే వివేక వర్థిని సహా వివిధ మరాఠీ విద్యాసంస్థలు వేలాది మంది విద్యార్థులకు నీడనిచ్చాయి. 1895లోనే అంటే కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయానికి ముందే శాలిబండలో ఏర్పాటైన భారత గుణవర్థక సంస్థ గ్రంథాలయం, వందేండ్ల క్రితమే కోఠిలో ఏర్పాటైన మరాఠా గ్రంథాలయం సహా వివిధ అక్షరాలయాలకు మరాఠా రూపశిల్పులు జీవం పోశారు. హైదరాబాద్ సిటీ కాలేజీలో చదివిన మహారాష్ట్రకు చెందిన శివరాజ్ పాటిల్ కేంద్రమంత్రిగా, లోక్సభ స్పీకర్గా దేశ రాజకీయాల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తే, నాగపూర్లో విద్యాభ్యాసం చేసిన పి.వి.నరసింహారావు దేశ ప్రధానమంత్రి అయ్యారు.
మహారాష్ట్రలోని రామ్టెక్ నియోజక వర్గానికి పీవీ రెండుసార్లు (1984, 89లలో) ప్రాతినిధ్యం కూడా వహించారు. మరాఠా భూమిపుత్రులు వినాయకరావు కౌరాట్కర్ (1957-62) హైదరాబాద్ నుంచి, హరీశ్చంద్ర హెడా నిజామాబాద్ నుంచి (1952-67) లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. మరాఠా మూలాలున్న స్వామి రామానంద తీర్థ, కాళోజీ మన వైతాళికులు అయితే తెలంగాణ మూలాల నుంచి ఎదిగి వచ్చిన జయాకరణ్ లింగు, నాగూ సాయాజి, విఠల్ సాయన్న, మానాజి రాజోజి, ఎల్లప్ప బలరాం, శంకరరావు పర్సా, శంకరరావు పుష్పాల, నరసింహ పుష్పాల, షాయాజీరావు శీలం, ఆదం నర్సయ్య వంటి వారు ఎందరో మహారాష్ట్ర దార్శనికులుగా ప్రసిద్ధికెక్కారు. షోలాపూర్లో ధర్మన్న సాధు సహా ఎందరో కేంద్ర, రాష్ట్ర చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో కొలువు దీరారు. ఒక అంచనా ప్రకారం వర్తమాన మహారాష్ట్రలో 30 లక్షల మంది తెలుగు వారున్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు.
ముంబయిలో 12 లక్షలు, షోలాపూర్లో 3 లక్షలు, పుణేలో లక్ష, నాగపూర్, నాందేడ్, జాల్నా, దెగ్లూర్, రామ్టెక్ తదితర పట్టణాల్లో ప్రభావితం చేయగలిగిన స్థాయిలో మన వాళ్ళున్నారు. అలాగే తెలంగాణలోని నారాయణ్ ఖేడ్, జుక్కల్, బోధన్, నిజామాబాద్, బాన్స్వాడ, మధోల్, బోధన్, ఆదిలాబాద్, కాగజ్ నగర్ వంటి సరిహద్దు పట్టణ ప్రాంతాల్లో మరాఠీ మాట్లాడేవారు అడుగడుగునా అగుపిస్తారు. ఒక్క హైదరాబాద్లోనే లక్షన్నర మంది మరాఠీ బిడ్డలు స్థిరపడ్డారు. మహారాష్ట్ర సంప్రదాయ కులాల వారు తెలంగాణలో అధిక సంఖ్యలో ఉండగా, ఇక్కడి పద్మశాలీలు మహారాష్ట్రను మలుపు తిప్పగల స్థాయిలో అక్కడ స్థానికులై స్థిరపడ్డారు. రెండు రాష్ర్టాల ఆహార్యం, ఆహారం, పండుగలు, జాతరలు, ఆలయాల ఆదాన ప్రదానాలు తరతరాలుగా కొనసాగుతున్నాయి.
రెండు రాష్ట్రాల ఆహార్యం, ఆహారం, పండుగలు, జాతరలు, ఆలయాల ఆదాన ప్రదానాలు తరతరాలుగా కొనసాగుతున్నాయి. షోలాపూర్ నుంచి ముంబయి దాకా స్థిరపడిన తెలంగాణ బిడ్డలు తెలంగాణ మలి దశ ఉద్యమంలో అపారమైన మద్దతు ప్రకటించి ఉద్యమసారధి కేసీఆర్ వెంట నడిచారు.
షోలాపూర్ నుంచి ముంబయి దాకా స్థిరపడిన తెలంగాణ బిడ్డలు తెలంగాణ మలి దశ ఉద్యమంలో అపారమైన మద్దతు ప్రకటించి ఉద్యమసారధి కేసీఆర్ వెంట నడిచారు. ఉభయ రాష్ర్టాల రచయితలు, కళాకారులు అటు ఇటు పర్యటనలు జరుపుతున్నారు. సభలు నిర్వహిస్తున్నారు. 2017లో హైదరాబాద్లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు మహారాష్ట్ర సాంస్కృతిక సాహిత్యకారులు పెద్దఎత్తున తరలి వచ్చారు. ఇవాళ ఏకంగా, తెలంగాణ సంక్షేమ అభివృద్ధి పథకాలను మాకు అమలు చేయండి, లేదా మమ్మల్ని తెలంగాణలో కలపండి అని మహారాష్ట్రలోని వివిధ గ్రామాల్లో ప్రజలు తీర్మానాలు చేస్తున్నారు.
ఉద్యమిస్తున్నారు. మహారాష్ట్ర ఏర్పడి 60 ఏండ్లయినా నేటికీ దక్షిణ మహారాష్ట్ర-ఉత్తర కర్ణాటక సరిహద్దు తగాదాలు, తూర్పు మహారాష్ట్రలో మంచి నీళ్ల కోసం మహిళలు బిందెలతో మైళ్ళకు మైళ్ళు నడిచే దుస్థితి, విదర్భ ప్రాంతపు వెనుకబాటుతనం, చెరకు రైతుల సమస్యలు, ప్రతి వానకాలంలో మునిగి తేలుతున్న ముంబయి… ఇలాంటి ఎన్నెన్నో సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి.
వాటిని పరిష్కరించి ఒక కొత్త శకానికి శ్రీకారం చుట్టగలిగే నేత కోసం అక్కడి ప్రజలు ఎదురు చూస్తున్నారు. దానికి నాంది భారత రాష్ట్ర సమితి నాందేడ్ సభ. భారత దేశ అస్తిత్వ ఆత్మగౌరవ నవ శకారంభం.
కేసీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణాన్ని స్వీకరించి పరేడ్గ్రౌండ్లో ప్రసంగిస్తూ ఒక వేదవాక్యాన్ని ముక్తాయింపుగా ఉటంకించారు. అది
సర్వే భవంతు సుఖినః
సర్వే సంతు నిరామయాః
సర్వే భద్రాణి పశ్యంతు
మాకశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్
అందరూ సుఖంగా ఉండాలి.
అందరూ ఆరోగ్యంగా ఉండాలి.
అందరూ క్షేమంగా ఉండాలి.
ఏ ఒక్కరికీ దుఃఖం కలగకూడదు అని
ఆ వాక్యాల సారాంశం. అదే జెండాగా,
ఎజెండాగా దేశ ప్రజల కలలు సాకారం
చేయడానికి కేసీఆర్ మహారాష్ట్రకు
బయల్దేరనున్నారు.
శుభం భూయాత్.
డాక్టర్ అయాచితం శ్రీధర్: 98498 93238