ప్రతిష్ఠించింది అంబేద్కరుడినే కాదు, దళితజాతి ఆత్మగౌరవాన్ని కూడా.. తెలంగాణ నింగిపైన నిలిపి, నవశకానికి నాంది పలికి, మూర్తి కాదిది, తెలంగాణ స్ఫూర్తి, విగ్రహం కాదిది.. విప్లవమని నినదించి, నిజమని నిరూపించి, చైతన్యమూర్తికి ఆకాశమంత హారతి పట్టిన ఓ మహత్మా.. ఓ మహర్షీ కేసీఆర్..
సమైక్య రాష్ట్రంలో ఎన్నో పీడనలకు, వేదనలకు గురైన తెలంగాణ ప్రజానీకం కొట్లాడి స్వరాష్ట్రం సాధించుకున్నాక, ఇంతకాలం నిర్లక్ష్యం చేయబడిన సాంస్కృతిక అంశాల పరిరక్షణకోసం తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నది.
ఆనాడు దళిత, బడుగు, బలహీన వర్గాలను రాజకీయాల్లో భాగస్వామ్యం చేసిన ఎన్టీ రామారావు హుస్సేన్ సాగర్ తీరాన ట్యాంక్బండ్ మీద మహనీయుల విగ్రహాలతోపాటు, సాగరం మధ్యలో బుద్ధుడి ప్రతిమను నెలకొల్పి చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత దాదాపు 30 ఏండ్లపాటు పట్టించుకున్న వారే లేకుండాపోయారు. ఇన్నాళ్లకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆలోచన మేరకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున పలు నిర్మాణాలతో మరో చరిత్రకు అంకురార్పణ జరుగుతున్నది. హుస్సేన్ సాగర్లోని తథాగతుడికి దగ్గరలోనే బౌద్ధ ధర్మాన్ని అనుసరించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహె బ్ అంబేద్కర్ విగ్రహం దేశంలోనే పెద్దదిగా 125 అడుగుల ఎత్తుతో రూపుదిద్దుకున్నది.
తెలంగాణ సమాజంలో జనాభా ఎక్కువగా ఉండి, అవకాశాలు తక్కువగా ఉండి సతమతమవుతున్న జాతి దళితజాతి. తరతరాల సామాజిక వివక్ష వల్లే ఇవాళ ఈ పరిస్థితి. అనేక శతాబ్దాల నుంచి, అనేక బాధలు పడి కులవివక్షకు, వెలికి గురై గ్రామాల బయటే ఉంచబడింది ఈ జాతి. సమాజం చేసిన ఈ తప్పును సమాజమే సరిదిద్దుకోవాల్సి ఉన్నది.
రెక్కాడితేగానీ, డొక్కాడని కేవలం కాళ్లు, చేతులు మాత్రమే ఆస్తిగా లక్షలాది దళిత కుటుంబాలు నేడు మన సమాజంలో ఉన్నాయి. దళితజాతి పైకి రావాలంటే ఏదో ఒక అద్భుతం జరుగాలి. దళితుల సంపద పెంపులో భాగంగా సీఎం కేసీఆర్ మదిలోకి వచ్చిందే తెలంగాణ ‘దళితబంధు’. ఈ పథకం దేశ చరిత్రలోనే ఒక మహాయజ్ఞం. ఈ పథకం పూర్తి విజయవంతం కావాలంటే దళితుల పట్ల సమాజ దృక్పథం, ఆలోచనా ధోరణి మారాలి. దళితుల పట్ల, పేదల పట్ల సానుకూలంగా ఉండాలి.
దేశంలో దళితులు సామాజిక, ఆర్థిక వివక్షకు గురవడం మొత్తం సమాజానికే కళంకం. ఇది మనసున్న ప్రతి ఒక్కరినీ కలచివేసే విషయం. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఏ ఊరికి వెళ్లినా సామాజికంగా, ఆర్థికంగా పీడితవర్గాలు ఎవరున్నారంటే వారిలో అత్యధికులు దళితులే. ప్రభుత్వాలు మాత్రమే దళితుల బాధలు తొలగించలేవు. మేము కూడా పురోగమించగలం అనే ఆత్మస్థెర్యంతో దళిత సమాజం ముందుకుసాగాలి. ఈ దేశంలోని దళితుల సామాజిక, ఆర్థిక బాధలు తొలగించేందుకు అవసరమైన పథకాల కార్యాచరణ అమలు చేయాలి.
దళిత జాతిని ప్రత్యేక శ్రద్ధతో ఆదుకోవడం నాగరిక సమా జం ప్రధాన బాధ్యత. అది ప్రజాస్వామిక ప్రభుత్వాల ప్రాథమిక విధి. అణగారిన దళితజాతి అభ్యున్నతికి పాటుపడటమే నిజమైన దేశభక్తి. అదే నిజమైన దైవసేవ. మానవసేవయే మాధవ సేవ అని మహాత్ముడు ఏనాడో చెప్పారు.
‘తెలంగాణ రాష్ట్రంలో దళిత, బడుగు బలహీనవర్గాల ముఖాలు వెలిగినప్పుడే, వారి కండ్లలో ఆనందం వెల్లివిరిసినప్పుడే, ఈ రాష్ట్రం ఏర్పడినందుకు సార్థకత ఉంటుంది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతుంటారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరం నడిబొడ్డున దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ మహా విగ్రహాన్ని నెలకొల్పిన ఘట్టం దేశ చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచిపోనున్నది.
అంబేద్కర్ మహావిగ్రహం ఏర్పాటు చేయాలన్న నిర్ణయమే సాహసోపేతమైనది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో పాటు దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోని గొప్ప నిర్ణయాన్ని కేసీఆర్ సర్కారు తీసుకొన్నది. ఆచరణలో కూడా చేసి చూపించింది. ‘దళితజాతి సమాజోద్ధరణతోపాటు, యావత్ భారతదేశ అభ్యున్నతికి అంబేద్కర్ సాగించిన కృషిని భవిష్యత్తు తరాలు గుర్తుంచుకొనేలా ఆయనకు 125 అడుగుల మహావిగ్రహాన్ని నిర్మించతలపెట్టడం గొప్ప విషయం. ఈ నిర్ణయంతో కేసీఆర్ దళిత పక్షపాతి అని మరోసారి రుజువైంది’ అని బీఆర్ అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ కొనియాడటాన్ని తెలంగాణ సమాజం సవినయంగా స్వాగతిస్తున్నది.
సుంకె రవిశంకర్
(వ్యాసకర్త : శాసనసభ్యులు, చొప్పదండి నియోజకవర్గం)