వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని సర్కారు బడుల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమైనది. దీంతోపాటు ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను పెంచడానికి, పాఠశాలల్లో సౌకర్యాలను మెరుగుపరచడానికి కూడా కార్యాచరణ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నది. విద్యాశాఖ ఇప్పటికే ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి సత్ఫలితాలను సాధించింది. ఆంగ్ల మాధ్యమం ఎంచుకునే పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నది. ప్రభుత్వ పాఠశాలల పట్ల నమ్మకం కూడా పెరిగింది. గత ఏడేండ్లుగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల మూలంగా గ్రామీణుల జీవన ప్రమాణాలు పెరిగాయి. దీనివల్ల పిల్లలు బడి మానేయడం తగ్గిపోతున్నది. ఇప్పుడు వ్యూహాత్మకంగా భారీ ఎత్తున ప్రభుత్వ బడులలో సౌకర్యాలను పెంచి, ఆంగ్ల మాధ్యమాన్ని అన్ని బడులలో ప్రవేశపెడుతున్నది.
ఏ మంచి పనిచేసినా రంధ్రాన్వేషణ చేసే వంకరబుద్ధులు ఎప్పుడూ ఉండనే ఉంటారు. ఇంగ్లీషులో బోధించడం మాతృభాషకు వ్యతిరేకం కాదు. తెలుగు భాషా ప్రేమికుడైన కేసీఆర్ అన్ని కోణాలలో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకొని ఉంటారు. ఈ కాలంలో ఇంగ్లీషు పరిజ్ఞానం ఉంటే తప్ప ఉద్యోగాలు రావు. కృత్రిమ మేధ, జన్యు పరిశోధనాది రంగాలలో వేగంగా వృద్ధి చెందుతున్న పరిజ్ఞానాన్ని ఆంగ్ల పరిజ్ఞానం ఉంటే తప్ప అందిపుచ్చుకోవడం సాధ్యం కాదు. ఉన్నత వర్గాలు తమ పిల్లలను ఇంగ్లీషు మాధ్యమంలోనే చదివిస్తున్నాయి. దీంతో పేద పిల్లలను అంతరాల సమాజంలో పెంచడమౌతున్నది. నాడు విద్య లేక వెనుకబడితే, ఇప్పుడు ఆంగ్ల మాధ్యమం లేక వారి భవిష్యత్తును బాల్యంలోనే తుంచేసినట్టవుతున్నది. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల ఈ అంతరాలు తొలగిపోతాయి. పేద పిల్లలకు కూడా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు లభిస్తాయి. ఇప్పటికే తమకు అవకాశాలు కల్పిస్తే విజయశిఖరాలు అధిరోహిస్తామని గురుకులాలలోని పేదవర్గాల పిల్లలు నిరూపించారు.
కేసీఆర్ అంటేనే ఒక బ్రాండ్ నేమ్గా మారింది! కేసీఆర్ బడి పెట్టినా, గుడి కట్టినా ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంది. తెలంగాణ వచ్చిన తర్వాత సర్కారు దవాఖానలకు రోగులు పోవ డం, ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు రావడం పెరిగిపోయింది. ముఖ్యమంత్రిపై ప్రజలకున్న విశ్వాసం అటువంటిది. ఇంతకాలం పరాయి పాలనలో అన్నిరంగాలూ నిర్లక్ష్యానికి గురయ్యాయి. కేసీఆర్ వ్యవసాయం, గ్రామీణ వృత్తుల వంటి ఒక్కో రంగాన్ని సమూలంగా మార్చివేస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు. ఇకముందు సర్కారు బడుల్లో పేదవర్గాల పిల్లల సంఖ్య భారీగా పెరుగుతుంది. వారిని కార్పొరేట్ స్కూల్స్లో చదివే పిల్లలకు దీటుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుంది. తల్లిదండ్రులు, గురువులు సమిష్టిగా కృషి సాగిస్తే ఈ మార్పు ఒక సామాజిక విప్లవానికి తలుపులు తెరుస్తుంది.