గొప్ప ప్రయత్నాలు, గొప్ప ఆలోచనలన్నీ హేళనతోనే మొదలవుతాయ’ని అల్జీరియాకు చెందిన రచయిత, తత్వవేత్త, నోబెల్ గ్రహీత ఆల్బ ర్ట్ కామూ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ పునర్నిర్మాణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదుర్కొన్న సవాళ్లు, విమర్శలు, ఆరోపణలకు పై వ్యాఖ్యలు సరిగ్గా సరిపోతాయేమో! ఉద్యమంలో గానీ, పాలనలో గానీ విమర్శలు ఎన్నివచ్చినా కేసీఆర్ కుంగిపోలేదు. ‘రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది. ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది’ అన్న తన సంకల్పం ముందు అన్నీ పటాపంచలయ్యాయి. ‘ఏపీ నుంచి వెళ్తున్నాను. తిరిగి తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెడతాను’ అని తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టేముందు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తూ కేసీఆర్ చెప్పి న మాటలు ఆయన ఆత్మవిశ్వాసానికి, దృఢచిత్తానికి తార్కాణం.
కేసీఆర్ తాను ఏ కార్యక్రమం చేపట్టినా దానికి సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకుంటారు. దానిపై విస్తృతంగా అధ్యయనం చేస్తారు. మేధోమథనం జరుపుతారు. కార్యాచరణ ప్రకటించడానికి ముందే పక్కా ప్రణాళిక రూపొందించుకుంటారు. స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలోను, తర్వాత పాలనలోనూ తనదైన గట్టి ముద్ర వేయడానికి గల కారణం ఇదే. ఉద్యమ ప్రతిబింబంగా తనను తెలంగాణ ప్రజలు బలంగా నమ్మడానికి కేసీఆర్కు గల ఈ అసమాన వ్యక్తిత్వమే దోహదపడింది. కేసీఆర్ ఉద్యమ నాయకత్వానికి సమాయత్తమయ్యే ముందే తనకు అలవాటైన విస్తృత అధ్యయనంలో భాగంగా దాదాపు ఏడు నెలల పాటు ప్రతిరోజూ తెలంగాణవాదులతో చర్చలు జరిపారు. తెలంగాణకు జరిగిన అన్యాయాలు, గతంలో తెలంగాణ ఉద్యమ లోపాలు, తెలంగాణ సమస్యలు, పరిష్కారం, ప్రత్యేక రాష్ట్ర సాధన, దానిలో ఎదురయ్యే సవాళ్లపై సంపూర్ణంగా అవగాహన పెంచుకున్నారు. పక్కగా ఉద్యమ రచన చేసుకొని కార్యక్షేత్రంలోకి అడుగుపెట్టారు.
అటు రాజకీయ పునరేకీకరణతో పాటు ఇటు ప్రజా బాహుళ్యంలోకి ఉద్యమాన్ని విస్తృతంగా చొప్పించి, ఎక్కువ కాలం పాటు ఉద్యమ ఆకాంక్షను ప్రజల్లో సజీవంగా ఉంచడంలో కేసీఆర్ మాట తీరు ఎంతో ఉపకరించింది. ఉద్యమంలో సబ్బండ వర్గాలను భాగం చేయడం, ప్రతి సభలో తాను చెప్పాల్సిందంతా సరళంగా, హాస్యోక్తులతో చెప్పి చివరికి మీరే నిర్ణయం తీసుకోవాలి, మనమిప్పుడు ఏం చేద్దాం? విజ్ఞతతో ఆలోచించండని నిర్ణయాన్ని ప్రజలకే వదిలివేసేవారు. అలా ప్రజల్లో ఆలోచన రేకెత్తేంచేవారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆధ్వర్యంలో లక్షలమందితో జరిగిన సభలు రికార్డులు నెలకొల్పాయంటే అది కేవలం ఆయన వాక్చాతుర్యానికి నిదర్శనం.
‘కొట్లాడి తెచ్చుకున్నంత మాత్రాన కోరుకున్న తెలంగాణ కాదు’ అని ముందే ఎరిగిన కేసీఆర్ ఉద్యమ ట్యాగ్లైన్ అయిన ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అనే ఆకాంక్షలను చాలా కొద్దికాలంలోనే సాధించి దేశానికే మార్గ నిర్దేశకుడయ్యారు. 24 గంటల కరెంటు, కాళేశ్వరం జలాలు… ఇలా ఉమ్మడి రాష్ట్రంలో అసాధ్యమనుకున్న ప్రతి దాన్ని సుసాధ్యం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఉద్యమ నాయకత్వ బాధ్యతలను తన భుజాల మీద వేసుకొని ఆమరణ దీక్షతో ప్రాణ త్యాగానికి సిద్ధమై రాష్ర్టాన్ని సాధించారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నప్పటికీ దేశం ఇంకా అభివృద్ధి చెందిన దేశంగానే ఎందుకున్నదన్నది కేసీఆర్ ఆవేదన. అందుబాటులో ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకుంటే చేయగల అద్భుతాలేంటో ముఖ్యమంత్రిగా తెలంగాణలో చేసిచూపించారు కేసీఆర్. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోరుతూ బీఆర్ఎస్ను స్థాపించారు. ‘ఈ రోజు దేశానికి ఒక లక్ష్యం ఉన్నదా? లక్ష్యం లేకుండా, దేశం ఎటు వైపు పోతుంది? చివరికి ఎక్కడికి చేరుతుంది?’ అని బీఆర్ఎస్ స్థాపనకు ముందునుంచి కేసీఆర్ ప్రతి వేదిక మీద సంధిస్తున్న ప్రశ్నలు అభివృద్ధి పేరుతో ఇదివరకటి కేంద్ర ప్రభుత్వాలు ప్రజలను ఎంత మభ్యపెట్టాయో చెప్పకనే చెప్తున్నాయి. సాగునీరు, కరెంటు, ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, పంటల సాగు పట్ల కేంద్రానికి ఒక ప్రణాళిక లేకపోవడం, దేశంలో దాదాపు 60 శాతం జనాభా ఆధారపడిన వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను కేంద్రం నిర్లక్ష్యం చేస్తుండటం ముఖ్యమంత్రి కేసీఆర్ను కలచివేసింది.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు16 నెలల పాటు ఢిల్లీ వీధుల్లో పోరాడారు. అందులో 750మంది అమరులయ్యారు. వారి పట్ల, వారి కుటుంబాల పట్ల కేంద్రం వ్యవహరించిన తీరు కేసీఆర్కు ఏ మాత్రం రుచించలేదు. ప్రపంచానికి ఆహారం అందించే అన్నదాత ఎప్పుడూ శాసించేస్థాయిలో ఉండాలి కానీ, యాచించే స్థాయిలో కాదన్నది కేసీఆర్ ఆకాంక్ష. అందుకే ఢిల్లీ పోరాటంలో అమరులైన రైతు కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున సాయం అందించారు.
దేశవ్యాప్తంగా కేసీఆర్ లేవనెత్తుతున్న ప్రశ్నలు సగటు భారతీయుని గుండెల్లోకి సూటిగా చొచ్చుకుపోయాయి. అందుకే బీఆర్ఎస్కు దేశ వ్యాప్తంగా క్రమంగా ఆదరణ పెరుగుతున్నది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఈ ఆదరణ క్రమంగా ప్రభంజనంలా మారనున్నది. అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ నమూ నా దేశానికి దిక్సూచి అయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఇప్పుడు దేశ సేవ కోసం ఒక ప్రణాళికతో ముందుకు అడుగులువేస్తున్న మన నాయకుడి ఆశయ సాధనలో మనమంతా భాగస్వాములమవుదాం.
శేరి సుభాష్రెడ్డి (వ్యాసకర్త: రాష్ట్ర శాసనమండలి సభ్యులు)