లక్నో: ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన కేసులో నిందితుడికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నేరాన్ని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలలకు అత్యాధునిక యంత్రాలు, తగిన సిబ్బందిని సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. (Bail To Rape, Murder Accused) ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక మహిళపై హత్యాచారం కేసులో నిందితుడు మనోజ్ బెయిల్ పిటిషన్పై అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది.
కాగా, డీఎన్ఏ ప్రొఫైల్ అసంపూర్తిగా ఉండటంతో మృతురాలి ప్రైవేట్ పార్ట్ నుంచి సేకరించిన నమూనాలో లభించిన డీఎన్ఏతో నిందితుడి డీఎన్ఏను సరిపోల్చలేకపోయినట్లు ఎఫ్ఎస్ఎల్ నివేదికలో పేర్కొన్నారు. దీంతో అత్యాచారం, హత్య కేసు నిందితుడికి ఆ నేరంతో సంబంధం ఉందని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ‘భారీ హృదయంతో, తీవ్రమైన బాధతో’ నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు జస్టిస్ అరుణ్ కుమార్ సింగ్ దేశ్వాల్ మే 21న తీర్పు ఇచ్చారు.
మరోవైపు ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాల (ఎఫ్ఎస్ఎల్)ల్లో పాతబడిన యంత్రాలు, అసంపూర్ణ మౌలిక సదుపాయాలే డీఎన్ఏ ప్రొఫైల్ జనరేట్ కాకపోవడానికి ప్రధాన కారణమని హైకోర్టు ఆరోపించింది. ఎఫ్ఎస్ఎల్కు ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించే సమస్యతో పాటు, పరిగణించాల్సిన ఇతర సమస్యలు చాలా ఉన్నాయని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్ప మరెవరినీ నిందించలేమని కోర్టు పేర్కొంది.
అయితే ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక యంత్రాలు, తగిన సిబ్బందిని అందిస్తుందని తాము ఆశిస్తున్నట్లు ధర్మాసనం అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి పరిశీలన కోసం ఈ ఉత్తర్వు ప్రతిని యూపీ ప్రధాన కార్యదర్శికి పంపాలని హైకోర్టు రిజిస్ట్రార్ను ఆదేశించింది.