‘ఉత్తర్ప్రదేశ్ మరోసారి బీజేపీదే, సీఎం పీఠం మళ్లీ యోగికే’నంటూ ఓ రెండు మూడు నెలల కిందటి వరకూ విశ్లేషణలు వెలువడ్డాయి. కానీ, మరో నెల రోజుల్లోనే ఎన్నికలు ఉన్న ప్రస్తుత తరుణంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయినట్లు కనిపిస్తున్నది. అఖిలేశ్ది పైచేయిగా కనిపిస్తున్నది. దీనికి ముఖ్య కారణం.. ఓబీసీ సామాజికవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులు బీజేపీని వీడి ఏస్పీ (సమాజ్వాదీ పార్టీ)లో చేరుతూ ఉండటం. అయితే, బీజేపీపై ఈ ఓబీసీ తిరుగుబాటు ఇప్పటికిప్పుడు రూపుదిద్దుకున్నది కాదు. దీనివెనుక నాలుగేండ్ల నేపథ్యం ఉన్నది.
2017లోబీజేపీ ఘనవిజయం అనంతరం యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం పగ్గాలు చేపట్టారు. ఆయన క్యాబినెట్లో అవకాశం లభించినవారిలో ఓం ప్రకాశ్ రాజ్భర్ ఒకరు. ‘సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ’ అధినేత రాజ్భర్. యూపీలోని చిన్న పార్టీల్లో అది ఒకటి. రాష్ట్రంలోని ఓబీసీల్లో ఒకరైన రాజ్భర్ల మద్దతు ఎక్కువగా ఉన్న పార్టీ అది. రాజ్భర్కు బీసీ సంక్షేమశాఖను యోగి కేటాయించారు. ఏడాదిలోపే మంత్రికి, సీఎంకు మధ్య సంబంధాలు దెబ్బతినటం మొదలైంది. పాఠశాల విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్లకు సంబంధించి.. బీసీ తదితర వెనుకబాటు వర్గాల పిల్లలకు రూ.700 కోట్లు యోగీ మంజూరు చేశా రు. అగ్రకులాలకు చెందిన పిల్లలకు కూడా అంతేమొత్తం కేటాయించారు. దీనిపై ఓం ప్రకాశ్ రాజ్భర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల్లో బీసీవర్గాల పిల్లలు 25 లక్షల మంది ఉండగా, అగ్రకులాల పిల్లల సంఖ్య ఐదు లక్షలు మాత్రమే. అటువంటప్పుడు ఇద్దరికి సమానంగా స్కాలర్షిప్ల మొత్తాన్ని కేటాయించటం బీసీ విద్యార్థులను తీవ్ర అన్యాయానికి, వివక్షకు గురి చేయటమేనని ఓం ప్రకాశ్ పేర్కొన్నారు. ఆయన విమర్శను యోగి పట్టించుకోకపోవటమే గాక, ఇస్తున్న ప్రాధాన్యాన్ని కూడా క్రమంగా తగ్గిస్తూ వచ్చారు.
ఓం ప్రకాశ్ కూడా వెనక్కు తగ్గకుండా.. క్యాబినెట్లోని ఇతర ఓబీసీ మంత్రులను, ఓబీసీ ఎమ్మెల్యేలను కూడగడుతూ రహస్య, బహిరంగ సమావేశాలు నిర్వహించారు. ఈ ప్రయత్నాల్లో ఆయన వెంట ఉన్నది.. రాష్ట్రంలోని కీలక ఓబీసీ నేత, యోగి క్యాబినెట్లోని సీనియర్ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మౌర్యకు ఓబీసీల్లో గణనీయమైన పట్టుంది. చాలా ఏండ్లపాటు బీఎస్పీలో పనిచేసి, గడిచిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. మౌర్యతోపాటు ఇతర ఓబీసీ మంత్రులు, ఎమ్మెల్యేలతో ఓంప్రకాశ్ రాజ్భర్ సమాలోచనలు కొనసాగించారు. ఠాకూర్ సామాజికవర్గానికి చెందిన యోగి ఆదిత్యనాథ్ అగ్రకులాల ప్రయోజనాలు నెరవేర్చటం కోసమే ప్రభుత్వ నిధులను ఉపయోగిస్తున్నారని, ఆయన వల్లించే హిందూత్వ నినాదం.. ఓబీసీలను తమ వెంట తిప్పుకోవటానికి మాత్రమేనని ఓం ప్రకాశ్ తదితర ఓబీసీ మంత్రులు, నేతల్లో క్రమంగా అనుమానం మొదలైంది. వీరి సందేహాలను దూరం చేసే చర్యలను యోగి తీసుకోలేదు. 2019లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. యూపీలో బీజేపీ హవా కొనసాగింది. అప్పటి వరకూ ఓం ప్రకాశ్ రాజ్భర్పై చర్యలు తీసుకుంటే.. ఎక్కడ ఓబీసీ ఓట్లు తగ్గుతాయో అన్న సందేహమైనా యోగికి ఉండేది. లోక్సభ ఫలితాలతో అదీ తేలిపోయింది. దీంతో రాజ్భర్ను మంత్రివర్గం నుంచి తొలగించివేశారు. నాటినుంచీ యోగి సర్కార్పై రాజ్భర్ తన వ్యతిరేకతను బహిరంగంగానే వెల్లడించటం ప్రారంభించారు. ఇలా బీజేపీపై ఓబీసీల అసంతృప్తి బలపడుతూ వచ్చింది.
గతేడాది అఖిలేశ్ యాదవ్ లక్నో నుంచి ఢిల్లీకి విమానంలో బయల్దేరారు. ఆయనతో మాట్లాడేందుకే రాష్ట్ర అటవీ సంరక్షణశాఖ మంత్రి దారాసింగ్ చౌహాన్ అదే విమానం ఎక్కారు. క్యాబినెట్లోని ఓబీసీ మంత్రులను యోగి కావాలనే అందరిముందు అవమానిస్తున్నారని, నానా ఇబ్బందులు పెడుతున్నారని దారాసింగ్ అఖిలేశ్ ఎదుట భోరున విలపించారు. సీనియర్ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య తరఫు దూతగా వచ్చానని, ఎస్పీలో చేరుతామని, ఓకే అంటే.. దాదాపు 15 మంది ఓబీసీ ఎమ్మెల్యేలు రావటానికి సిద్ధంగా ఉన్నారని అఖిలేశ్కు దారాసింగ్ విజ్ఞప్తి చేశారు. అయితే, అప్పటికే తమ పార్టీలో ప్రతీ నియోజకవర్గానికి ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆ విజ్ఞాపనను అఖిలేశ్ పట్టించుకోలేదు.
కానీ, రాజకీయ దిగ్గజం, ఎస్పీ వ్యవస్థాపకుడు, అఖిలేశ్ తండ్రి ములాయంసింగ్ యాదవ్ తన కొడుక్కి హితబోధ చేశారు. రాష్ట్రంలో మారుతున్న పరిస్థితులను గమనించాలని, బీజేపీ హిందూత్వను ఎదుర్కోవాలంటే, లోహియా, అంబేద్కర్ సిద్ధాంతాలను మళ్లీ ముందుకు తీసుకురావాలని చెప్పారు. యాదవుల-ముస్లింల పార్టీగా పరిమితమైన ఎస్పీ ఇమేజ్ను విస్తృతపర్చాలని, ఓబీసీలను, దళితులను కలుపుకొనిపోవాలని, ఆ వర్గాలకు చెందిన అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని ఆయన సూచించారు. విషయం అర్థమైన అఖిలేశ్.. తన బాబాయ్ శివపాల్ యాదవ్ పార్టీతో సంధి చేసుకోవటం ప్రారంభించి ఇప్పటివరకూ ఏడు చిన్నపార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. ఇవన్నీ ఓబీసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నవే. ఓంప్రకాశ్ రాజ్భర్ పార్టీ కూడా ఇప్పుడు అఖిలేశ్ కూటమిలో ఒక భాగస్వామి.
అఖిలేశ్ వ్యూహానికి తోడు.. యోగి సర్కార్పై పెట్టుకున్న ఆశలు, అంచనాలు వమ్ము కావటంతో గత ఎన్నికల సమయంలో బీజేపీలో చేరిన అనేకమంది ఓబీసీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పుడు ఎస్పీ దిశగా తరలివస్తున్నారు. తమ సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం ఇస్తామన్న యోగి.. ఆ హామీని నెరవేర్చకపోగా, హిందూత్వ నినాదంతో అగ్రకులాల ప్రయోజనాలే పరిరక్షణగా పనిచేశారని వీరు ఇప్పుడు అంచనాకొచ్చారు. ఈ నేపథ్యంలోనే, బీజేపీపై ఓబీసీల తిరుగుబాటు.
–కె.వి.రవికుమార్