భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తెగలకు రాజకీయ రిజర్వేషన్లకోసం 330, 332 అనే రెండు అధికరణాలను చేర్చారు. అదే విధంగా కార్యనిర్వాహక/ పరిపాలన శాఖలలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పిస్తూ 15 (4 )16 (4) అధికరణాలను చేర్చారు. ఆ తర్వాత ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించే నిమిత్తం ఒక ప్రతిపాదనను తయారు చేశారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ఏర్పర్చిన తర్వాత అంబేద్కర్ ఓబీసీల రిజర్వేషన్లపై దృష్టి పెట్టారు. కానీ అది అమలు కాకుండా కాంగ్రెస్ అడ్డుపడింది.
ఓబీసీలకు రిజర్వేషన్ల విషయమై అంబేద్కర్ నాటి కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాజేంద్రప్రసాద్ ,జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్లను సంప్రదించారు. అయితే ఓబీసీలు ఎవరు? వారు ఎంతశాతం ఉంటారు? ఆ కులాల అస్తిత్వాన్ని గుర్తించడం ఎలా? అని వారు సందే హం వెలిబుచ్చారు. బాబా సాహెబ్ అర్థం చేసుకొని రా జ్యాంగపరమైన రిజర్వేషన్ కల్పించాలంటే ఆ కులాలకు చట్టపరమైన గుర్తింపు ఉండాలి. ఆ కులాల అస్తిత్వాన్ని గుర్తించిన తర్వాత హక్కులు, రక్షణలు ఇవ్వబడుతాయి. తగిన రిజర్వేషన్లు మంజూరు చేసేట్లు ఏర్పాటు చేయవచ్చని భావించారు. ఆ విధంగా రాజ్యాంగంలో 340 వ అధికరణ వచ్చి చేరింది. దీని ప్రకారం ఓబీసీ కులాలను గుర్తించడానికి ఒక కమిషన్ నియమించడానికి భారత రాష్ట్రపతికి అధికారం ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ దాన్ని పట్టించుకోలేదు. అంబేద్కర్ దేశవ్యాప్త ఉద్యమంతో ఒత్తిడి పెరిగి 1953లో కాకా కలేల్కర్ కమిషన్ వేశారు. కానీ ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్టును అమలు చేయకుండా కాంగ్రెస్ తిరస్కరించింది. ఆ తర్వాత నెహ్రూ కాలం ముగిసింది. ఇందిరాగాంధీ కాలంలోనూ ఆ కమిషన్ నివేదికను పట్టించుకోలేదు. ఎమర్జెన్సీతో ఇందిరాగాంధీపై వ్యతిరేకత పెరిగి జనతాపార్టీ అధికారంలోకి వచ్చింది. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి హోదాలో ఓబీసీ రిజర్వేషన్ కోసం బిందేశ్వర్ ప్రసాద్ మండల కమిటీ నియమించారు. కానీ జనతా పార్టీ ప్రభుత్వం 18 నెలల్లోనే కూలిపోయింది.
బిందేశ్వర ప్రసాద్ మండల్ నిజాయితీగా పనిచేసి ఆయనకు ఇచ్చిన సమయం చాలా తక్కువైనా దేశమంతా పర్యటించి 3743 కులాలను గుర్తించి 40 సిఫారసులతో ప్రభుత్వానికి నివేదిక అందజేశాడు. కానీ నాటి కాంగ్రెస్ ఇందిరాగాంధీ ప్రభుత్వం పలు కారణాలతో వాయిదా వేస్తూ వచ్చింది. ఆ తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్, కాన్షీరాం తదితర బీసీ నాయకుల తిరుగుబాటు, దీక్షలు, ఆందోళనల ఫలితంగా 27 శాతం రిజర్వేషన్ అమల్లోకి వచ్చింది. అయితే బీపీమండల్ చేసిన 40 సిఫారసుల్లో ఒకదాన్ని మాత్రమే నాటి ప్రధాని వీపీసింగ్ అమల్లోకి తే గలిగారు. అది ఉద్యోగాల్లో రిజర్వేషన్. అందులో కూడా క్రిమిలేయర్ అనే పదాన్ని చేర్చడంతో చదివించే శక్తి ఉన్నవారికి కాకుండా రూ.లక్ష ఆదాయం ఉన్నవారికి మాత్రమే రిజర్వేషన్ వర్తించేదిగా ఓబీసీ రిజర్వేషన్ పరిమితమైంది.
అప్పుడున్న పరిస్థితుల్లో ఓబీసీల్లో విద్యలేనివారే ఎక్కువగా ఉండడంతో ఓబీసీలకు లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగింది. ఈ మధ్యకాలంలో స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ తీసుకొచ్చారు కానీ చట్టాలు రూపకల్పన చేసే పార్లమెంటు, శాసనసభల్లో ఇప్పటివరకు రిజర్వేషన్లు కల్పించలేదు.
జనాభా దామాషా ప్రకారం బీసీల కుల గణన జరుగాలని, ఓబీసీల రిజర్వేషన్లు కల్పించాలని అనేక ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్, బీజేపీలు పట్టించుకున్న పాపాన పోలేదు. గత పదేండ్లుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభు త్వం కూడా నిర్లక్ష్యం చేయడం కండ్ల ముందు కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా 52 శాతం ఉన్న బీసీలను 70 ఏండ్లుగా కాంగ్రెస్, బీజేపీలు కలిసి మోసం చేస్తున్నాయి. కానీ రెండు శాతం లేని ఈడబ్ల్యూఎస్ వారికి కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ 10 శాతం రిజర్వేషన్ కల్పించింది.ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేముంటుంది?
– పీఎం బాబు 99495 69205