75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ప్రజలకు నాణ్యమైన విద్య అందించడంలో పాలకులు విఫలమయ్యారు. ప్రజల జీవన ప్రమాణం, వారి సామాజిక ఆర్థిక స్థితిగతులు విద్యపై మాత్రమే ఆధారపడి ఉంటాయి. ‘ప్రపంచాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం విద్య’అని నెల్సన్ మండేలా చెప్పిన మాటలు పాలకులు గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రఖ్యాత అమెరికా సంస్థ దీ గ్రూప్, వార్టన్ స్కూల్ ఆఫ్ యూనివర్సిటీ తయారుచేసిన వార్షిక నివేదిక ప్రకారం నాణ్యమైన విద్యను అందించడంలో అమెరికా, ఇంగ్లాండ్ మొదటి రెండు స్థానాల్లో ఉండగా భారతదేశం 32వ స్థానంలో ఉన్నది. ఈ సర్వేను 78 దేశాల్లో కొన్ని వేల మంది ప్రజలతో ఈ సంస్థ నిర్వహించింది.
భారతీయ విద్యావ్యవస్థ 26.5 కోట్ల మంది విద్యార్థులు,14.9 లక్షల పాఠశాలలు,95 లక్షల మంది ఉపాధ్యాయులతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యా వ్యవస్థగా గుర్తింపు పొందింది. అతి పెద్ద ప్రజాస్వామిక దేశం అతిపెద్ద విద్యావ్యవస్థలో ఉన్న మనం విద్యారంగంలో అనేక విద్యాసంస్కరణలు తీసుకొచ్చినప్పటికీ దేశ ప్రజలకు నాణ్యమైన విద్య అందించడంలో సఫలి కృతం కాలేకపోయాం.
నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ (NSSO) ప్రకారం భారతదేశంలో నాణ్యమైన విద్య అందించకపోవడానికి ప్రధాన కారణాలుగా విద్యారంగానికి సరైన బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం, దేశంలో 33 శాతం టీచర్లు అర్హత కలిగినవారు అందుబాటులో లేకపోవడం, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు టీచర్లు అందిపుచ్చుకోకపోవడం, ఆధునిక ప్రపంచంలో విద్యార్థులు రాణించేలా వారిలో సృజనాత్మకతను పెంచేలా కరికులం లేకపోవడం, దేశంలోని మెజారిటీ బడుల్లో మౌలిక సౌకర్యాలు కల్పించకపోవడమే. ప్రధానంగా మౌలిక వసతులైన మంచినీరు, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుదీకరణ, తరగతి గదులు చాలినంత అందుబాటులో లేవన్నది వాస్తవం.
21వ శతాబ్దంలో భారతీయ యువత ప్రపంచంతో పోటీ పడాలంటే వారికి నాణ్యమైన విద్యను అందించాలి. వారిలో సృజనాత్మకతను పెంచే ఉద్దేశంతో భారత ప్రభుత్వం 2020 జూలై 29న నూతన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)ను తీసుకొచ్చింది. ఈ నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం భారతదేశ జీడీపీలో విద్యారంగానికి కనీసం ఆరు శాతం నిధులను కేటాయించాలి. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం బడ్జెట్లో కేవలం 2.9 శాతం నిధులు (రూ.1,12,899 కోట్లు) మాత్రమే కేటాయించింది.
ప్రపంచంలో నాణ్యమైన విద్యను అందించే దేశాలు వాటి బడ్జెట్లో 6 శాతం కన్నా ఎక్కువ నిధులనే కేటాయిస్తున్నాయి. ఉదాహరణకు నార్వే, చీలి దేశాల్లో 6.6 శాతం, ఇజ్రాయిల్, న్యూజిలాండ్లలో 6.2శాతం, ఇంగ్లాండ్లో 6.1శాతం, అమెరికా 6శాతం నిధులు కేటాయించి నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి.
భారత ప్రభుత్వం పార్లమెంట్లో అధికారికంగా తెలిపిన వివరాల ప్రకారం భారతదేశం నుంచి ఉన్నత చదువులకు వివిధ దేశాలకు వెళ్తున్న విద్యార్థులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నారు. గతంతో పోలిస్తే ఈ సంవత్సరంలో 68శాతం పెరుగుదలతో 7,50,365 మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం వేరే దేశాలకు తరలి వెళ్లారు. ఒక సర్వే ప్రకారం ఇది ఇలాగే కొనసాగితే 2024 నాటికి భారతదేశం నుంచి 1.8 మిలియన్ల విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం కోసం వేరే దేశాలకు వెళ్లే అవకాశం ఉన్నది.
భారతదేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలలో చదివిన వారిలో మొదటి 10 ర్యాంకర్లలో 9 మంది , 100 ర్యాంకులోపు 62 శాతం మంది, 1000 ర్యాంకు లోపు 36 శాతం మంది ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం వలస వెళ్తున్నారు. ఈ మేధో వలసలను నిలువరించాల్సిన అవసరం ఉన్నది. దేశంలోని బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. ఇప్పటికైనా పాలకులు కండ్లు తెరిచి విద్యకు అధికంగా నిధులు కేటాయించి ప్రజలకు నాణ్యమైన విద్యను అందిస్తారని ఆశిద్దాం.