కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని తెలంగాణ రాష్ట్ర వైద్య రంగంలో మరొకసారి నిరూపించబడింది. ‘హైదరాబాద్లోని ఉస్మానియా, గాంధీలలాంటి అన్ని స్పెషాలిటీస్తో కూడిన దవాఖానలు రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఉండాలి. వైద్యంకోసం ప్రజలు నానా అవస్థలు పడుతూ హైదరాబాద్ దాకా రాకూడదు. ఎవరి జిల్లాలో వారికి అన్ని రకాల వైద్య సౌకర్యాలు దొరకాలి’ ఇది నాటి ఉద్యమ నాయకుడు నేటి ముఖ్యమంత్రి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకాలం నాటి ఆకాంక్ష. ఇప్పుడా ఆకాంక్ష నెరవేరబోతున్నది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ దవాఖానాలు ఏర్పాటవుతున్నాయి.
మన దేశానికి స్వాతం త్య్రం సిద్ధించినప్పటినుంచి దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా తెలంగాణ పరిధిలో వైద్య సేవలందించిన బోధనాసుపత్రు లు కేవలం మూడు మాత్రమే. అవి హైదరాబాద్లోని ఉస్మానియా, గాంధీ, వరంగల్లోని (ఎంజీఎం) మహాత్మా గాంధీ మెమోరియల్ దవాఖానలు. ఆ తర్వాత కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏర్పాటు చేసిన ప్రభుత్వ బోధనాసుపత్రులు కేవలం మరొక రెండు మాత్రమే. అవి నిజామాబాద్, ఆదిలాబాద్ వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న దవాఖానాలు.
75 ఏండ్ల స్వతంత్ర భారతంలో జనాభా ఎన్నో రెట్లు పెరిగింది. 1947లో దేశ జనాభా 34 కోట్లు ఉంటే 2023లో దాదాపుగా 140 కోట్లకు చేరింది. చైనాను దాటివేసి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. అదే విధంగా రాష్ర్టాల జనాభా కూడా పెరుగుతూ వచ్చింది. కానీ పెరుగుతున్న ప్రజల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా వైద్య సౌకర్యాలు కల్పించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. వైద్య ఆరోగ్య శాఖను అవి ఒక నిరుత్పత్తి రంగంగా భావించి బడ్జెట్ కేటాయింపుల్లో కూడా నిర్లక్ష్యం వహించాయి. వాస్తవానికి ప్రజారోగ్యం అనేది ప్రతి రంగంపై పరోక్షంగా ప్రభావం చూపే అంశం. సింపుల్గా ఆలోచిస్తే ఒక మనిషి ఆరోగ్యం సరిగా లేకపోతే అతను పనిచేయలేడు. అదేవిధంగా ప్రజారోగ్య శాఖ పటిష్ఠంగా లేకపోతే ప్రతి రంగంలో వాటి వాస్తవిక సామర్థ్యం దెబ్బతిని ఉత్పత్తి తగ్గిపోయి అభివృద్ధి కుంటుబడే ప్రమాదం ఉంటుంది.
ఇదంతా గ్రహించిన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో నూతన వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టింది. కేంద్ర సహకారం లేనప్పటికీ ఎన్నో వైద్యకళాశాలలు వాటి అనుబంధ వైద్యశాలలు ఏర్పాటు చేసింది. మొదటి విడతలో మహబూబ్నగర్, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేటలో నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయగా, రెండవ విడతలో మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో మొత్తం ఎనిమిది వైద్య కళాశాలలు, వాటి అనుబంధ వైద్యశాలలు ఏర్పాటు చేసింది. ఇక మూడవ విడతలో కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్, జనగాం, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్తో కలిసి మొత్తం తొమ్మిది జిల్లాల్లో వైద్య కళాశాలలతో పాటు బోధనాసుపత్రులూ ఏర్పాటు చేయబడ్డాయి.
ఈ విధంగా ఇప్పటివరకు తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో 21 మెడికల్ కళాశాలలు వాటి బోధనాసుపత్రులు ఏర్పడగా త్వరలోనే యాదాద్రి, మహేశ్వరం, మెదక్, నరసరావుపేట, ములుగు, నారాయణపేట, గద్వాల జోగులాంబ, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్తో కలిపి మరో ఎనిమిది వైద్య కళాశాలలు వాటి అనుబంధ వైద్య శాలలు ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని బోధనాసుపత్రుల సంఖ్య 33 కు చేరనున్నాయి. దీంతో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల, ఒక బోధనాసుపత్రి అనే ఉద్యమకాలం నాటి కల సాక్షాత్కారం కానున్నది.
ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు మన రాష్ట్రంలో అవకాశాలు లేక పక్కనున్న కర్ణాటక, మహారాష్ట్రకు వెళ్లి చదువుకోవడం దశాబ్దాలుగా చూస్తున్న విషయమే. ఇక ఈ మధ్య మనవాళ్ళు దేశాన్ని విడిచి పక్క దేశాలైన చైనా, రష్యా, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలకు వెళ్లి వైద్య విద్యనభ్యసిస్తున్నారు.
పక్క దేశాలకు వెళ్లి చదువుకోవడమనేది చాలా కష్టతరమైనది. ఆర్థిక భారంతో కూడుకున్నటువంటి విషయం. వీటన్నిటికీ ముగింపు పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త మెడికల్ కళాశాలల వల్ల వేలాది ఎంబీబీఎస్ సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. తమ పిల్లలను డాక్టర్లుగా చూసుకోవాలనే తల్లిదండ్రుల ఆశలు తీరే అవకాశాలు మెరుగయ్యాయి.
ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఈరోజు వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ర్టాన్ని ముందు వరుసలో నిలబెడుతూ ఆరోగ్య విప్లవాన్ని సృష్టించాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. మునుపెన్నడూ లేని విధంగా బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు, డయాలసిస్ సెంటర్లు, తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్లు, కేసీఆర్ కిట్లు తెలంగాణ ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందించడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. తెలంగాణ వస్తే ఏమొస్తుంది? అన్నవారికి ప్రతి రంగం నుంచి సమాధానం దొరికినట్టుగానే వైద్య ఆరోగ్య రంగం నుంచి కూడా సమాధానం దొరికిందని భావించవచ్చు.