బండన్న ఏ స్టేట్మెంట్ ఇచ్చినా ఆవేశం పులకించిపోతది. విద్వేషం బ్రేక్డ్యాన్స్ జేస్తది. విషం వికటాట్టహాసం జేస్తది.ఆయ్న మాటలిని దయ్యాలు, భూతాలు సప్పట్లు కొడుతయి. ఏం కుత్కె అది. ఏం ఆవేశం, ఏం కోపం అదీ.. అబ్బరకొండె.అభివృద్ధి మీద గాకుంట, సీన్మలు తీసుడు మీద సారు ఆవేశం పుండులకెల్లి సొన కారినట్టు కారిపోతున్నదిప్పుడు.సారు నరాలు తెగిపడతయా అన్నంత కసిగా మాట్లాడుతడు మైకు ముందట.
అచ్చే ఎలక్షన్ల ఎట్లన్నజేసి గెలువాల్నని శాంతంగున్న తెలంగాణను ఆగం వట్టియ్యాల్నని ఇట్ల మైకుల ముంగట పిడుగులు వడ్డట్టే మొత్తుకుంటున్నడు. అందుకే ‘రజాకార్ ఫైల్స్’ సీన్మ తీస్తనని 56 ఇంచుల ఛాతి ఇర్సుకొని దీర్ఘాలు తీసి చెప్తున్నడు. బండన్నకు 56 ఇంచుల ఛాతి ఉంటదా? అని మీరనుకోవద్దు. బీజేపోళ్లు అన్నంక గాయింత ఉండదా?
తెలుగు సీన్మల డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ సారుకు మొన్న కేంద్రంల రాజ్యసభ ఎంపీ పదవి ఇచ్చిర్రు గదా! మరి, ఆ సారు రుణం తీర్సుకోవద్దు? బరాబర్ తీర్సుకుంటడు. ఆంధ్రల పుట్టిన అల్లూరి సీతారామరాజుకు, తెలంగాణ గోండుబిడ్డ కొమురం భీముకు లింకువెట్టి పచ్చి పులుసుల సాంబార్ కలిపినట్టు త్రిపుల్ ఆర్ సీన్మకు కథ ఇచ్చినాయ్నె ఇగ ఈ సీన్మకు కథ ఇయ్యడా? బీజేపోళ్లకు అసొంటియే గావాల్నాయె? ముస్లింల బండు కడ్క తాగే కథలైతే చెవి కోసుకుంటరు. అసొంటియి జూపిచ్చి జనాలను ఆగం జెయ్యాలె. వాళ్లు వాళ్లు కొట్టుకసస్తె తమాషా సూడాలె.. అగ్గదీ కమలమోళ్ల పాలసీ.కశ్మీర్ ఫైల్స్ అనే సినిమా తీసి కశ్మీర్ పండితుల వలసల గురించి గగ్గోలు పెట్టిన్రు. నాడు సిక్కులు, ఆ తర్వాత డోగ్రాల పరిపాలనల ఎంతమందో కశ్మీరులు, అన్ల ఎక్కువమంది ముస్లింలు పొట్టచేత వట్టుకొని కశ్మీర్ నుంచి వలసపోయిన ముచ్చట గురించి ఎందుకు మాట్లాడరు?
ముస్లింలే పండితులను సంపిర్రని ఏకపక్షంగ సూపెట్టిర్రు. శ్రీనగర్, జిల్లా పోలీసు కార్యాలయం ఆర్టీఐ అందిచ్చిన ప్రామాణిక సమాచారం ప్రకారం 1990 తర్వాత మిలిటెంట్ల చేతిల మొత్తం 1,724 మంది సచ్చిపోయిర్రు. అన్ల కశ్మీరీ పండిట్ల సంఖ్య 89 మందే. మరి తతిమా 1,635 మందిల ముస్లింలు, వేరే నిమ్న కులాలకు చెందిన హిందువులు కూడా ఉన్నరు. కానీ వారి సావులేవీ కాషాయపోళ్ల కండ్లకు కనపడవా? ఐదు శాతమే కశ్మీరీ పండిట్లు సచ్చిపోయింది. దీనికి ‘జెనోసైడ్’ అని పేరు పెట్టి సినిమా తీసేంత అవసరం ఏమొచ్చింది పువ్వోళ్లకు. పండిట్లు ఇప్పటికీ మస్తుమంది ఉన్నరు. ఆ సీన్మల మమ్ములను తప్పుగ సూపించిర్రంటున్నరు. వాళ్లకేం జవాబిత్తరు? 1960 నుంచి వరుసగా అస్సామీలు 18 వేల మంది బెంగాల్ హిందువులను సంపేశిర్రు. వేలమందిని ఎళ్లగొట్టిర్రు. ఆ హత్యల గురించి మాట్లాడుమంటే మాత్రం కామూష్ ఉంటరు. ఇదేం కత?
మిలిటెంట్లు సంపిన ఆ దమనకాండను అల్కగ దొరుకుతున్న ముస్లింల మీద రుద్దిర్రు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రాపగాండ సీన్మ గావట్టి కశ్మీర్ఫైల్స్ల ముస్లింలను దోషులుగా సూపెట్టిర్రు. అట్లనే మొన్న అచ్చిన అక్షయ్కుమార్ సీన్మ పృథ్వీరాజ్ల గూడ గవ్వే కతల్ వడ్డరు. సామ్రాట్ పృథ్వీరాజ్ 1192ల సచ్చిపోయిండు. సచ్చే ముందుగాల్ల ఒక బాణం ఇసిరిండు. అది 14 ఏండ్లు ప్రయాణం జేసి 1206ల జీలమ్ నది ఒడ్డుకు నిలవడ్డ ఘోరీకి తలిగింది. ఆయన సచ్చిపోయిండు. 14 ఏండ్ల కాలాన్ని తిర్రమర్ర జేసుడు బీజేపీ పూనిన బాలీవుడ్కు తప్ప హాలీవుడ్కు కూడా సాధ్యం కాదు. తానాజీ, పద్మావత్, మణికర్ణిక, కేసరి, పానిపట్, బాజీరావు మస్తానీ అసుంటి సీన్మల్ల కొన్ని సీన్లల్ల విద్వేషాన్ని కక్కిర్రు. ఇప్పుడు ‘రజాకార్ ఫైల్స్’తోని మల్ల ముస్లింలకు సూటివెడుతున్నరు. కరోనా టైంల ముస్లింలను ఎంత బద్నాం జెయ్యాలని సూశిర్రో… అంత ఉల్టాపల్టా అయిపోయింది. నవరసాలల్ల బత్తాయిరసం గూడా కలిపి చరిత్ర మీద ప్రతీకారం తీర్సుకునుడు బాలీవుడ్కు మాత్రమే తెలుసు. తెలుగుల గూడ గసంటి ఓ సీన్మ తియ్యాలెనని చూస్తుర్రు. ఎలక్షన్లు వొచ్చేనాటికి చరిత్రను వక్రీకరించి సీన్మలు తీసి ప్రజలను నమ్మిచ్చి ఓట్లు దండుకోవాల్నని కోశిష్ జేస్తున్నట్లున్నది బీజేపీ.
హిందూముస్లింల నడ్మ గిచ్చి కయ్యం వెట్టాలె. తెలంగాణల అధికారం ఎల్గవెట్టాలె. అగో గదీ బండన్న సారు గుట్టు. మరి గిచ్చేది ఎవలూ? ఇంకెవరు రజాకార్ ఫైల్స్ సీన్మనేనాయె. ఈ సీన్మల అయ్యాకొడుకుల చరిత్ర సూపిస్తనంటున్నడు. సూపియ్, రజాకార్ల కాలం నుంచి తొలిదశ తెలంగాణ ఎసొంటిదో, మలిదశ తెలంగాణల కేసీఆర్ పాత్ర ఎసొంటిదో చరిత్రనే చెప్తది. ఒరెక్క మర్చిపోతిం గదా.. చరిత్ర కమ్మలను చింపి టాకలు ఏసుట్ల బీజేపోల్లు ముదుర్లకే ముదుర్లాయే. కేటీఆర్ సార్ అన్నట్టు తెలంగాణ ఉద్యమంల బండన్న గుట్కలు నములుకుంట యాడ దాక్కున్నడో గూడ సూపియ్యవల్సిందే. వీళ్ల ఉద్దేశంల రజాకార్లంటే కేవలం ముస్లింలే అని సీన్మ తీస్తరు. రజాకార్లల్ల సగం కంటే ఎక్కువ మంది హిందువులు ఉండేటోళ్లు. కని, కేవలం ముస్లింలనే బూచీలుగ సూపిస్తరు. వాళ్లకు కావాల్సింది గూడా గదేనాయె.షోయబుల్లాఖాన్ రజాకార్ల దుర్మార్గాలను ఖండించి హత్యకు గురైండు. నవాబ్ అహ్మద్ మీర్జా, బాకర్ అలీ మీర్జా, ముల్లా అబ్లుల్ బాసిత్, అబ్దుల్ మునీమ్, ఫరీద్ మీర్జా, నవాబ్ మంజూర్ జంగ్, మహ్మద్ హుస్సేన్ జాఫ్రీ అసుంటోళ్లు రజాకార్ల దౌర్జన్యాలను ఖండించిర్రు.
మరి అప్పటి రజాకార్ల అరాచకానికి ఇప్పటి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు ఎట్ల లింకు కలుపుతరు బీజేపోళ్లు? 1938ల రజాకార్లు పుడితె, 1969ల తొలిదశ తెలంగాణ ఉద్య మం, 2001ల మలిదశ తెలంగాణ ఉద్య మం పుట్టింది.
ఈ మలిదశ తెలంగాణ ఉద్యమంల కేసీఆర్ సారు ఎంత పోరాడిండో అందరికీ ఎర్కున్న ముచ్చటనే. మరి ఈ మూడు కాలాలను లింక్జేసి కేసీఆర్ సారును ఎట్ల సూపియ్యాలనుకుంటున్నడో బండన్న. త్రిపుల్ఆర్ లెక్క సాన్పి లీల్లల్ల బురద కలిపినంత పనిజేస్తరేమో సూడాలె మరి. కనీ, బీజేపోళ్లు యాది మరుస్తున్న ఒగ ముచ్చట ఏందంటే.. అధికారం శాశ్వతం గాదు. కేంద్రంల ఏరే సర్కార్ కూడా అధికారంల వస్తది. అప్పుడు గుజరాత్ ఫైల్స్, రైతు ఉద్యమం, ఢిల్లీ రైట్స్, నోట్ బందీ, ఆర్ఎస్ఎస్ ఆగడాల మీద బొచ్చెడు సీన్మలు తీస్తరు.
– హెచ్ఎస్