India | భారతీయులకు విదేశాలపై మోజు పెరుగుతున్నది. చదువు కోసం, ఉపాధి కోసం, సమాజంలో గుర్తింపు కోసం అనేకమంది ఇతర దేశాల వైపు చూస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఉండటాన్ని ఓ హోదాలాగా భావిస్తున్నారు. పై కారణాల వల్లనే ఏటా లక్షల మంది భారత్ను వీడుతున్నారు. అయితే ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా గొప్పలు చెప్పుకొనే పాలకులు దేశంలోని యువతకు ఉపాధి చూపకపోవడమే భవిష్య భారతం తరలిపోవడానికి ప్రధాన కారణం.
భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. 3.21 కోట్ల మంది భారతీయులు వివిధ దేశాల్లో ఉంటున్నారు. వీరే కాకుండా ఏటా సుమారుగా 25 లక్షల మంది మన దేశాన్ని వీడుతున్నారు. విదేశాల బాట పట్టేవారిలో భారతీయులే అత్యధికం కావడం గమనార్హం. ఈ విషయంలో భారత్ ప్రథమ స్థానంలో ఉన్నది. విదేశాలకు వెళ్తున్నవారిలో అనేకమంది కొన్నేండ్లకు భారత పౌరసత్వాన్ని వదిలేస్తున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ ప్రకారం.. 2020లో 85,256 మంది పౌరసత్వాన్ని వదిలేసుకున్నారు. 2021లో 1,63,370 మంది, 2022లో 2,25,650 మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు. వీరిలో కోటీశ్వరుల సంఖ్య సుమారు 8 వేలు. 2011 నుంచి చూసుకుంటే 17 లక్షల మందికి పైగా భారతీయులు విదేశీయులుగా మారారు. అంటే సుమారుగా ఒక్కరోజుకు 604 మంది అన్నమాట. 2014లో ఈ సంఖ్య 304 మాత్రమే. యూఏఈ, యూఎస్ఏ, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే, కువైట్, ఒమన్ తదితర దేశాల్లో ఎక్కువమంది సెటిల్ అవుతున్నారు.
మన దేశంలో జనాభాకు తగ్గట్టుగా విశ్వవిద్యాలయాలు లేకపోవడం, జేఈఈ, నీట్కు పోటీ ఎక్కువగా ఉండటం తదితర కారణాల వల్ల విద్యార్థులు విదేశాలకు తరలిపోతున్నారు. మన దేశంతో పోలిస్తే విదేశీ యూనివర్సిటీల్లో నాణ్యమైన విద్య అందడం, వసతులు, ఉపాధి అవకాశాలు తదితర కారణాల వల్ల భారతీయ విద్యార్థులు పాశ్చాత్య దేశాలవైపు చూస్తున్నారు. విద్యార్థులతో పాటు ఇతర వయసుల వారు దేశాన్ని వీడుతున్నారు. ఎక్స్ప్యాక్ట్ ఇన్సైడర్ 2021 ప్రకారం.. విదేశాలకు వెళ్తున్న భారతీయుల సగటు వయస్సు 38.7 ఏండ్లు. అత్యధికులు పురుషులే. కెరీర్ కోసం విదేశాలకు వెళ్లేవారి ప్రపంచ సగటు 47 శాతం ఉండగా, ఈ విషయంలో భారతీయుల సగటు 59 శాతంగా ఉన్నది.
భారతీయులు ఎక్కువగా విదేశాలకు ఎందుకు వెళ్తున్నారనే అంశంపై ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ 2023లో సర్వే చేసింది. ఆ సర్వే ప్రకారం.. విదేశాల్లో 8 గంటలే పని చేయాలన్న నిబంధనను కచ్చితంగా అమలుచేయడం, ఎక్కువ గంటలు పనిచేస్తే అందుకు నగదు చెల్లింపులు, తక్కువ ట్రాఫిక్, తక్కువ గాలి కాలుష్యం, అవినీతి తక్కువగా ఉండటం తదితర కారణాలను సర్వేలో పాల్గొన్నవారు చెప్పారు. అదే సమయంలో భారత్లో ప్రభుత్వాలు రాజకీయ నాయకుల నిర్ణయాలపై నడవటం.. కులం, మతం, ప్రాంతం ప్రాతిపదికన అభివృద్ధికి విరోధం కలిగించడం.. అవినీతి, లంచం తదితర కారణాల వల్ల విదేశాల బాట పడుతున్నట్టు మరి కొంతమంది చెప్పుకొచ్చారు.
ఉపాధి అవకాశాలు లేకపోవడం కూడా మరో కారణం. ‘సెంటర్ ఫర్ మానిటర్ ఇన్ ఇండియన్ ఎకానమీ- 2022’ నివేదిక ప్రకారం.. ఆ ఏడాది మొదటి 9 నెలల నిరుద్యోగ రేటు 7 శాతంగా ఉంటే డిసెంబర్లో 8.3 శాతానికి పెరిగింది. అర్బన్ నిరుద్యోగ రేటు 10.9 శాతంగా ఉండటం గమనార్హం. పత్రికా స్వేచ్ఛ లేకపోవడం, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో ఆర్థికవ్యవస్థ మందగమనం కూడా వలసలకు కారణాలే. ఎంతో ప్రతిభ ఉన్నవారు వలసలు పోవడం వల్ల మన దేశం భారీగా నష్టపోతున్నది. నాణ్యమైన విద్య, ఉపాధి, ఉద్యోగాలను కల్పించి ప్రజల జీవన ప్రమాణాలను పెంచి వలసలను తగ్గించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై దృష్టిసారించాలి.