తెలంగాణకు సంబంధించినంతవరకు 2014 ఓ కటాఫ్ మార్కు. ఆ ఏడాదికి ముందు విద్యుత్తు రంగంలో చీకటి రాజ్యమేలుతుండేది. కానీ పాలనా పగ్గాలు చేపట్టిన అనతికాలంలోనే సీఎం కేసీఆర్ విద్యుత్తు రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఎవరూ ఊహించని రీతిలో అనతికాలంలో స్వావలంబన సాధించడమే కాకుండా కేవలం తొమ్మిదేండ్లలో తెలంగాణ విద్యుత్తు రంగాన్ని సమున్నతంగా నిలబెట్టి దేశం అబ్బురపడేలా చేశారు. మరోవైపు, దశాబ్దాలుగా కాంగ్రెస్, బీజేపీ పాలనలో కొనసాగిన ఇతర రాష్ర్టాలు విద్యుత్తు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. తెలంగాణకు, ఆయా రాష్ర్టాలకు మధ్య జమీన్ ఆస్మాన్ పరఖ్ ఉంది.
2014 జూన్ 2కు పూర్వం తెలంగాణ ఎలా ఉండేది? విద్యుత్తు రంగంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ఓ పక్క, రైతులు, వినియోగదారులు మరోపక్క మోహరించిన యుద్ధ వాతావరణం. ఎండిన పంటలు, కరెంటు కోతలు, విద్యుత్తు ప్రమాదాలకు గురై పిట్టల్లా రాలిపోతున్న రైతులు. సబ్స్టేషన్ల ముట్టడి, రాస్తారోకోలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలతో నిత్యం భీతావహ భయానక పరిస్థితి. ప్రజలకు, అధికారయంత్రాంగానికి మధ్య స్పష్టమైన విభజన రేఖ. గ్రామీణ ప్రాంత గృహ వినియోగదారులకు పగలంతా కరెంటు ఉండేది కాదు. పట్టణాలు, నగరాలలో నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు కరెంటు కోతలతో ఉక్కపోత వాతావారణం. పరీక్షల సమయంలో విద్యార్థుల పాట్లు చెప్పనలవి కావు. పారిశ్రామిక వినియోగదారులకు వారానికి రెండు రోజులు పవర్ హాలీడేలు. ‘పీక్ అవర్స్’ నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా పెనాల్టీలు.. ఇదంతా గతం. మరి వర్తమానం ఎలా ఉందో చూద్దాం.
జూన్ 5, 2023. తెలంగాణ రాష్ట్రంలోని 119 శాసనసభా నియోజకవర్గ కేంద్రాలలో తెలంగాణ విద్యుత్తు విజయోత్సవ సమావేశాలు ఘనంగా జరిగాయి. రైతులు, దళిత బహుజన గృహ వినియోగదారులు, పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు, విద్యుత్తు అధికారులు, సిబ్బంది, కార్మికులు అందరూ కలిసి విజయోత్సవాలు జరుపుకొన్న అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. ఒకరి శ్రమను మరొకరు గుర్తించి అంతమైన కడగండ్లు స్మరించుకుంటూ ఉమ్మడిగా జరుపుకొన్న సామాజిక వేడుక సందర్భం అది. నరకప్రాయమైన స్థితిగతుల నుంచి ఆనందోత్సాహాల మధ్యన సంబురాలు జరుపుకొనే ప్రస్థానం ఎలా సాధ్యమైంది?
ప్రజల పట్ల అవ్యాజ్యమైన ప్రేమ, సమస్య లోతుపాతుల గురించిన స్పష్టమైన అవగాహన, ప్రజలను సమస్యల సుడిగుండాల నుంచి శాశ్వతంగా విముక్తి కావించాలనే ఉక్కు సంకల్పం కలిగిన ఒకే ఒక్క ప్రజానాయకుడి వల్లే సాధ్యమైంది. కేసీఆర్ అంటే మూడక్షరాల పేరున్న దార్శనికుడు. తెలంగాణ రాగానే, ప్రజల కరెంటు కష్టాలు కడతేర్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్పత్తి, సరఫరా పంపిణీ రంగాలపై ఏకకాలంలో దృష్టిసారించారు. భారీ ఎత్తున నిధులు కేటాయించారు.
270 ఎమ్డబ్ల్యూ x4=1080 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మణుగూరు భద్రాద్రి థర్మల్ పవర్ప్లాంటును యుద్ధప్రాతిపదికన తక్షణావసరాల కోసం చేపట్టారు. దామరచెర్లలో 4 వేల మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ శరవేగంగా పనులు పూర్తిచేసుకుంటూ ఉండగా, 600 మెగావాట్ల కాకతీయ థర్మల్ ప్లాంటును, కేటీపీఎస్ 800 మెగావాట్ల యూనిట్లను రికార్డు సమయంలో ప్రారంభించుకోవడం జరిగింది. రాష్ట్రం ఏర్పడిన నాటికి కేవలం 71 మెగావాట్లుగా ఉండిన సౌరవిద్యుత్తు నేడు 5200 మెగావాట్లకు చేరుకుంది. రైతులకు, ఎస్సీ ఎస్టీలకు, సెలూన్లకు, దోబీ ఘాట్లకు ఉచితంగా, రాయితీతో విద్యుత్ ను అందిస్తున్నది. తెలంగాణ విద్యుత్తురంగం గత తొమ్మిదేండ్లలో సాధించిన అభివృద్ధి నభూతో నభవిష్యత్తుగా నిలిచింది.
ఇదే సమయంలో మన చుట్టూ ఉన్న రాష్ర్టాలను చూసినా, జాతీయపార్టీల పాలనలో ఉన్న రాష్ర్టాలను చూసినా విద్యుత్ రంగం సంక్షోభంలో కూరుకుపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. విద్యుత్తు రంగంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పెట్టుబడిదారీ అనుకూల విధానాలు పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనవి. మన దేశ విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 4,11,649 మెగావాట్లు కాగా అందులో ప్రైవేట్ ఉత్పత్తి కేంద్రాల వాటా 2,07,272 మెగావాట్లు. రాష్ర్టాల పరిధిలో కేవలం 1,04,922 మెగావాట్ల సామర్థ్యమే ఉన్నది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్టీపీసీ తదితర విద్యుత్తు సంస్థల అధీనంలో 99,455 మెగావాట్ల ఉత్పత్తి కేంద్రాలున్నాయి.డిమాండ్ కంటే 40 శాతానికి పైగా ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా కరెంటు కోతలు ఎందుకు ఉంటున్నాయో కారణాలు చెప్పాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది. 4,11,649 మెగావాట్ల సామర్థ్యం ఉన్నప్పటికీ, మన దేశంలో రికార్డయిన పీక్ డిమాండ్ 2,17,000 మెగావాట్లు మాత్రమే.
తెలంగాణ మినహా మరే రాష్ట్రంలోనూ కోతలు లేకుండా కరెంటును అందించడం లేదు. రాజస్థాన్, ఏపీ, గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్ లాంటి పెద్ద రాష్ర్టాలు గృహ వినియోగదారులకు 18 గంటలకు మించి కరెంటు ఇవ్వటం లేదు. పరిశ్రమలకు చాలా రాష్ర్టాలలో కోతలు విధిస్తున్నారు. వ్యవసాయరంగానికి వస్తే రాజస్థాన్ 7 గంటలు, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, కర్ణాటకల్లో 8 గంటలు మాత్రమే ఇస్తున్నట్టుగా తెలుస్తున్నది. తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ 2166 యూనిట్లతో అగ్రస్థానంలో ఉండగా.. యూపీ 642 యూనిట్లు, బీహార్ 345 యూనిట్లతో ఎంతో వెనుకబడి ఉండటం ఆయా రాష్ర్టాలలో నెలకొన్న చీకటి యుగాలకు అద్దం పడుతున్నది. విద్యుత్తు రంగంలోనూ తెలంగాణ మాడల్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది.
తుల్జారాంసింగ్ ఠాకూర్: 78930 05313
(వ్యాసకర్త:అధ్యక్షులు, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్, టీఎస్ఎస్పీడీసీఎల్)