200 మంది ప్రదర్శనగా వెళ్తుంటే వారిని ఆపటానికి 2000 మంది పోలీసులు అడ్డం నిలిచారు. ఆ ప్రదర్శకులు సంఘవిద్రోహ శక్తులో, కరడుగట్టిన నేరస్థులో కాదు.. గౌరవ పార్లమెంటు సభ్యులు. గౌతమ్ అదానీ కుంభకోణంపై హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో ఈ వ్యవహారం మీద విచారణ జరపాలన్నది వారి డిమాండ్. ఆ ఎంపీలు మొత్తం 18 ప్రతిపక్ష పార్టీలకు చెందినవారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యావత్ దేశ ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే ప్రతినిధులు. అదానీపై దర్యాప్తునకు దరఖాస్తు ఇవ్వటానికి ఈడీ ఆఫీసుకు వెళ్తుంటే వారిని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. అంతకుముందు ఇదే అంశంపై సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (జేపీసీ)ని నియమించాలని పార్లమెంటులో విపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తే అక్కడా వారికి ప్రభుత్వం నుంచి వ్యతిరేకతే వ్యక్తమైంది. దీంతో మరోదారి లేక వారు వీధుల్లోకొచ్చారు. ఇక్కడా అడ్డగింతే. అదానీ ప్రయోజనాల పరిరక్షణకు మోదీ సర్కార్ ఎంతగా దిగజారుతున్నదో దీనిద్వారా అర్థమవుతున్నది. కంచే చేను మేస్తున్నట్లుగా ఉన్నదీ వైఖరి.
అదానీ కుంభకోణం ఫలితంగా దేశంలోని స్టాక్మార్కెట్లు కుప్పకూలాయి. అందరూ చూస్తుండగానే లక్షల కోట్ల మేర అదానీ సంపద ఆవిరైపోయింది. ఆయన కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు నష్టపోయారు. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. కేంద్రం ఒత్తిడి మేరకు అదానీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసీ తీవ్రంగా నష్టపోయింది. ఆయనకు ఎడాపెడా అప్పులు ఇచ్చిన ప్రభుత్వరంగ బ్యాంకుల పరిస్థితి డోలాయమానంగా మారింది. అంతర్జాతీయంగా భారత స్టాక్మార్కెట్ల గౌరవం పతనమైంది. వాస్తవానికి ఇదొక ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఇటువంటి సందర్భాలు గతంలో ఎన్నడూ ఎదురుకాలేదు. హర్షద్ మెహతా వంటి వ్యక్తులు, సత్యం వంటి కంపెనీల ఆర్థిక అక్రమాలు బయటపడినప్పుడు కూడా ఈ స్థాయిలో నష్టం జరగలేదు. అయినప్పటికీ, నాటి ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలు తీసుకున్నాయి. స్టాక్ మార్కెట్లను గాడినపెట్టే సంస్థలు ఆవిర్భవించాయి. కొత్తగా కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
తప్పులను సరిదిద్దుకోవటం, పునరావృతం కాకుండా చూసుకోవటమనేది ఏ వ్యవస్థకైనా అవసరం. ఇప్పటిదాకా భారతీయ స్టాక్మార్కెట్లు ఈ ప్రక్రియను కొనసాగించాయి కాబట్టే.. అంతర్జాతీయంగా గౌరవ ప్రతిష్ఠలను సంపాదించుకున్నాయి. స్టాక్మార్కెట్ నిర్వహణ నిష్పక్షపాతంగా జరుగుతుందని, తమ పెట్టుబడులకు భద్రత ఉంటుందనే నమ్మకమే భారీస్థాయి విదేశీ ఇన్వెస్టర్లతోపాటు దేశీయ చిన్న, మధ్యతరహా ఇన్వెస్టర్ల వరకూ అందరినీ మార్కెట్ వైపు నడిపిస్తుంది. ఆ నమ్మకం వమ్మయినప్పుడు వారందరూ కకావికలమవుతారు. స్టాక్ మార్కె ట్లపై నమ్మకాన్ని నిలబెట్టడం ప్రభుత్వం బాధ్యత. అదానీ కుంభకోణంపై దర్యాప్తు జరిపించడానికి అభ్యంతరం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. కనీసం పార్లమెంట్ సభ్యులతోనైనా విచారణ జరిపిం చడానికి జేపీసీ వేయాలన్న విపక్షాల డిమాండ్ సమంజసమైనది. మోదీ సర్కార్ ఇకనైనా తన మిత్రుడి ప్రయోజనాల కోణంలో కాకుండా, దేశ ప్రయోజనాల కోణంలో ఆలోచించటం ప్రారంభించాలి.