భారతదేశం సుమారు వంద సంవత్సరాల ఉద్యమాల ఫలితంగా స్వాతంత్య్రం సాధించి 74 ఏండ్లయింది.ఈ 74ఏండ్ల స్వాతంత్య్రంలో కేంద్రంలో, రాష్ట్రాలలో పలు ప్రభుత్వాలు వచ్చాయి, పోయాయి.కొందరు ప్రధానమంత్రులైనారు, ముఖ్యమంత్రులైనారు. స్వాతంత్య్రోద్యమం నాటి నుంచే అస్పృశ్యతకు వ్యతిరేకంగా నినాదాలు విన్పించాయి. కాని అవి కేవలం నినాదాలుగానే మిగిలాయి.
వేదకాలం నుంచే సామాజిక అనాదరణకు, ఏవగింపునకు, అనేక ఆంక్షలకు, నిర్బంధాలకు, అణచివేతకు, అలక్ష్యానికి, వెట్టి చాకిరికి, కఠోర దారిద్య్రానికి గురైన ఆ వర్గం ఈ సమాజంలో తల ఎత్తి నిలిచే నిర్దిష్ట చర్య కోసం ఆలోచించిన వారు ఎవరూ లేకపోవడం విచిత్రం. ఇన్నేండ్ల అధోగతి తర్వాత, ఆ వర్గం నేటి సమాజంలో గౌరవంతో బతుకగలిగే చర్య గురించి అసాధారణ రీతిలో ఆలోచించింది, ఆ చర్యను సాహసవంతంగా అమలు జరుపుతున్నది (ఆ చర్య వల్ల కలిగే భారాన్ని లెక్కచేయకుండా) ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. ఇతరులకు సాధ్యం కాని అత్యంత క్లిష్ట కార్యాలను ఓరిమితో, తాలిమితో, చాతుర్యంతో సాధించడం కేసీఆర్ ప్రత్యేకత. రైతుబంధు తర్వాత ఆయన మస్తిష్కంలో అంకురించి మహావృక్షంగా ఎదిగిన మరో సంక్షేమ పథకం ‘దళితబంధు’. నిజానికి కేసీఆర్ అందరి, అన్ని వర్గాల బంధువు-సకల జన బంధువు.
సంక్షేమ పథకాలను రూపొందించి ప్రవేశ పెట్టే అవకాశం, అధికారం నిజానికి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ర్ట ప్రభుత్వాలు అన్నింటికి ఉన్నది. అయినప్పటికీ సమాజంలోని అన్ని వర్గాలకు, (బ్రాహ్మణులు తదితర అగ్రకులాల వారికి గూడ!) ఎంతమాత్రం వివక్ష లేకుండా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన చొరవ, ఘనత కేసీఆర్ దే. లబ్ధిదారులకు సంతృప్తికరంగా పెంచిన సంక్షేమ పథకాలను కాలానుగుణంగా రూపొందించిన ప్రత్యేకత కేసీఆర్ సొంతం. రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం లాంటివి అపూర్వ పథకాలు. తెలంగాణ రాష్ర్టసాధన ఉద్యమ లక్ష్యాలలో ప్రధానమైనదైన ‘నీళ్ల’ గరిష్ఠ వినియోగానికి (కృష్ణా, గోదావరి నదీ జలాలలో) దోహద పడగల అపూర్వ పథకాలు అమలు చేశారు. ఈ పథకాలను సైతం వ్యతిరేకించి ఆధార రహిత అనుమానాలను వ్యక్తం చేసినవారున్నారు. తర్వాత, వీటి సాఫల్యతను చూసి, ఈ పథకాలు మొత్తం దేశానికి ఆదర్శప్రాయమైనవని ప్రశంసించిన వారు గూడ లేకపోలేదు. కేసీఆర్ ఏ పథకాన్నయినా వ్యతిరేకిస్తున్న వారి ‘ఏడుపు’ ఒకటే- మంచి పనులతో కేసీఆర్ మించిపోతున్నారనేదే. సామాన్య ప్రజల హృదయంలో ఆయనకు శాశ్వత స్థానం లభిస్తున్నదన్నదే ఈ ‘ఏడుపు’. ఎవరు ఎంత ఏడ్చినా, మొత్తుకున్నా కేసీఆర్ ప్రగతి యాత్ర జేగీయమానంగా, ‘ఏడ్చేవాళ్లను ఏడవనీ’ అని గర్జిస్తూ ముందుకు సాగుతున్నది.
సంక్షేమ పథకాల భారీ వ్యయం ‘అనుత్పత్తి వ్యయ’మని, ఈ వ్యయం సమాజంలో పరాన్న భుక్కులను సృష్టిస్తుందని ఓ వాదన. శ్రేయోరాజ్యంలో సామాజిక అసమానతలను దూరం చేయడానికి, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఈ వ్యయం అనివార్యం. ఇటువంటి వ్యయాన్ని ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక వేత్తలు అమర్త్యసేన్, బెనర్జీ, రఘురామ్ రాజన్ వంటివారు కూడా అనేక సందర్భాలలో సమర్థించారు. ఇది సమంజస, అత్యవసర వ్యయం. సామాజిక అసమానతలను, వివక్షను దూరం చేయడానికి ఈ వ్యయం అత్యవసరం. దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య చలామణి అధికం కావడానికి ఇటువంటి వ్యయాన్ని ఆర్థికవేత్తలు సమర్థిస్తున్నారు. ఈ వ్యయా నికి ‘దళిత బంధు’ వంటి వ్యయం తోడైనప్పుడు స్వయం పోషక త్వం, స్వయం సమృద్ధి సుసాధ్యమవుతాయి. దళితబంధు వంటి నిర్మాణాత్మక, స్వయంపోషక పథకాలు లేకుండా స్వావలంబన (ఢిల్లీ నుంచి విన్పిస్తున్న బూటక, శుష్క నినాదం) సాధ్యం కాదు. స్వావలంబన ఆకాశం నుంచి ఊడిపడదు- ప్రయత్నం, కృషి, చిత్తశుద్ధి, సంకల్పబలం లేకుండా. కేసీఆర్ సంకల్ప బలం సాటిలేనిది, అద్భుతాలను సృష్టించగలది. దళితులను కార్యదక్షులుగా చేయగలది.
ఇటీవల రెండేండ్ల నుంచి కరోనా మహమ్మారి, లాక్డౌన్లు కలిగించిన ఆర్థిక నష్టాలను, నిరుద్యోగాన్ని ఎదుర్కోవడానికి ఈ వ్యయం తప్పనిసరి. 2014లో 16వ లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు మొదటిసారి జాతీయస్థాయికి ఎదిగిన నరేంద్రమోదీ ఆ ఎన్నికల్లో ఏ విధంగానైనా గెలిచి అధికారం చేపట్టడానికి దేశ ప్రజలలో ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేయడానికి చేసిన వాగ్దానం నెరవేరలేదు. అందువల్ల ప్రజలకు రాజకీయ నాయకులపట్ల, వారి వాగ్దానాల పట్ల విశ్వాసం సన్నగిల్లింది. కానీ తెలంగాణ రాష్ర్టంలో ఏ సంక్షేమ పథకం కూడా గత ఏడేండ్లలో విఫలం కాలేదు. అందువల్ల రాష్ర్ట ముఖ్యమంత్రి వాగ్దానాలపట్ల, ఆయన ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలపట్ల విశ్వాసం ఇనుమడిస్తున్నదే కానీ తరగడం లేదు. ఇది గమనార్హమైన విష యం. అన్నిటికంటే ముఖ్యం స్వయంపోషకత్వం. ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం స్వయం పోషకమైనప్పుడు ఆర్థిక వ్యవస్థ ప్రగతి సుసాధ్యమవుతుంది.
-దేవులపల్లి ప్రభాకర రావు