స్వరాష్ట్రం సాకారమైన తర్వాత తెలంగాణ సాధిస్తున్న విజయపరంపరలో తాజా ఘట్టం.. హైదరాబాద్లో ‘ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్’ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కావడం. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు వాణిజ్య వివాదాలను కోర్టు బయట, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవటానికి ఈ కేంద్రం మనదేశంలోనేగాక ఆసియాకు కేంద్రబిందువుగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం సింగపూర్, ప్యారిస్, లండన్ వంటి కొన్ని చోట్ల మాత్రమే ఈ తరహా అంతర్జాతీయ స్థాయి మధ్యవర్తిత్వ కేంద్రాలున్నాయి. మనదేశంలో వాణిజ్య వివాదాలు తలెత్తితే ప్రస్తుతం న్యాయస్థానాలను లేదా హాంకాంగ్లోని ఆర్బిట్రేషన్ సెంటర్ను ఆశ్రయించవలసి వస్తున్నది. హైదరాబాద్లో ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు ద్వారా పెట్టుబడిదారులకు అంతర్జాతీయస్థాయి వివాద పరిష్కార వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది.
ఏదైనా దేశంలో పెట్టుబడి పెట్టటానికి బహుళజాతి కంపెనీలు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. అనువైన ప్రభుత్వ విధానాలు, మానవ వనరులు, మౌలిక సదుపాయాలు ఉన్నాయా అనేది పరిశీలిస్తాయి. వీటితోపాటు, వాణిజ్యపర వివాదాలు తలెత్తితే పరిష్కారం ఏమిటి? అనేది కూడా వాటికి ఎంతో కీలకమైన విషయం. సంక్లిష్ట చట్టాలు, కోర్టుల్లో సుదీర్ఘ విచారణ, భారీ వ్యయం వంటివి వ్యాపార సంస్థలకు ఇబ్బందిగా ఉంటాయి. అందువల్ల మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారానికి మొగ్గుచూపుతుంటాయి.. ఆర్బిట్రేషన్ సెంటర్ ఉంటే వారికి ఎంతో అనుకూలం. ప్రపంచ ఆర్థికశక్తుల్లో ఒకటిగా ఎదుగుతున్న భారత్లో ఇలాంటి కేంద్రం ఇప్పటి వరకూ లేదు. హైదరాబాద్లో ఏర్పాటుకానున్న ‘ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్’ఈ లోటును భర్తీ చేస్తుంది. ఇది అంతర్జాతీయంగానే కాదు, మనదేశంలోని పెట్టుబడిదారుల మధ్య వివాదాల పరిష్కారానికి కూడా తోడ్పడనుంది.
ఆర్బిట్రేషన్ కేంద్రం డీడ్ రిజిస్ట్రేషన్ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ- ఈ కేంద్రం ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి కేసీఆర్తో జూన్లో ప్రస్తావించానని, మూడు నెలల్లోనే తన కల సాకారమైందని సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధానమంత్రి, దివంగత పీవీ నరసింహారావును ఈ సందర్భంగా స్మరిస్తూ, ఇప్పుడు మరో కీలకఘట్టానికి హైదరాబాద్ వేదిక కావటంపై హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే టీఎస్-ఐపాస్ వంటి పారిశ్రామికవిధానంతో, అంతర్జాతీయస్థాయి మౌలిక సదుపాయాలతో సులభ వాణిజ్యానికి కేరాఫ్ అడ్రస్గా మారిన తెలంగాణకు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కేంద్రం మరింత వన్నె తేనుంది. అనేక దిగ్గజ, బహుళజాతి కంపెనీలు కొలువై విశ్వనగరంగా మారిన హైదరాబాద్కు ఈ కేంద్రం ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపును తెస్తుంది.