కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ సినిమా ‘దేవతా మనుష్య’లోని ఓ పాట పల్లవికి అర్థం ‘నా హృదయంలో నది ప్రవహిస్తోందేమి’ అని. ‘ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తోంది’ అని రామకృష్ణ పాడిన పాట కూడా ఉంది ‘చక్రవాకం’ తెలుగు సినిమాలో. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్డే కూడా దూరంగా ఉంది కదా మరి ఈ ప్రేమ గోల ఎందుకని మీరు అనుకోవచ్చు.
దేశాన్ని ప్రేమించడం ఒక గొప్ప విషయం. గురజాడ చెప్పారు కదా ‘దేశమును ప్రేమించుమన్నా’ అని. మన మహాత్మునికి ఇష్టమైన ‘రఘుపతి రాఘవ రాజారామ్.. సబ్ కో సన్మతి దే భగవాన్’ అర్థం కూడా ప్రేమయే కదా? మరి తన ‘బిజినెస్’లో దేశంపైన ప్రేమ ఏమైనా ఉన్నదా అని పార్లమెంట్ను అడగడం న్యాయమే కదా? అధికార పార్టీ బుల్డోజింగ్ ద్వారా తెచ్చే చట్టాలకు వేదికైన పార్లమెంట్ను మనం ప్రశ్నించడం సబబే కదా?
అభివృద్ధి చెందిన దేశాలతో సహా ప్రపంచమంతటా సంక్షోభం ముసురుతున్నది. ఆఫ్ఘన్లో పిల్లల ఆకలి తీర్చలేక తల్లులు మత్తు మందిచ్చి నిద్రపుచ్చుతున్నరు. పాకిస్థాన్లో గోధుమపిండి కోసం దొమ్మీలు జరుగుతున్నయి. అమెరికా, బ్రెజిల్లో అధికార సౌధాలపై దాడులు జరుగుతున్నయి. శ్రీలంకలో అధ్యక్ష భవనం మసై పోయింది. ఆర్థికమాంద్యంతో ఇవన్నీ అల్లాడుతున్నాయి. వేలాది ఉద్యోగాల ఉద్వాసన జరుగుతున్నది. శుభవార్త ఏమంటే.. పైన చెప్పిన అన్ని అంశాల్లోనూ భారతదేశం పరిస్థితి మెరుగ్గా ఉన్నది. దీనికి కారణం ఇక్కడి ప్రజలు, సంస్కృతి, ఇక్కడి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, సహనశీలత. దీనిని పదిలంగా నిలుపుకోవాలా వద్దా? అంత మంచి ప్రజల్ని ప్రేమించాలా వద్దా, చెప్పు పార్లమెంట్?
మనలో ప్రతి ఒక్కొక్కరికీ మోదీ ఇస్తానన్న 15 లక్షల రూపాయలు, మన ఎల్ఐసీ, మన ఎస్బీఐ ద్వారా మనం పెట్టిన పెట్టుబడి మొత్తం అదానీకి దొబ్బపెట్టేసిన మోదీ నేతృత్వంలోని పార్టీ, దాని ఎంపీలూ కొలువు దీరిన పార్లమెంట్ ఆలోచిస్తుందా కొంచెమైనా? పెద్దల సభ చైర్మన్ సీటులో కూచునే పెద్దమనిషికి ఇవేవీ పట్టవు కానీ, ప్రతి రోజూ న్యాయవ్యవస్థను తప్పుపట్టడంలో మాత్రం ఓవర్ టైమ్ పనిచేస్తూ ఉం టరు. దేశం పట్ల ఇదేమి ప్రేమ రాహిత్యం? వ్యవస్థలపై ఇదేమి దాడి?
భారతదేశం ఉజ్వల భవిష్యత్తుతో అభివృద్ధి చెందుతున్న సూపర్ పవర్. ‘అదానీ గ్రూప్ వల్ల దేశ భవిష్యత్తు వెనుకబడిపోతుంది. జాతీయవాదం పేరు చెప్పి దేశ ప్రజలను మోసం చేయడం తప్పు అనిచెబుతున్నాం’ అదానీ గ్రూప్ దుర్మార్గాలను, మోసాన్ని, దోపిడీని ఎత్తిచూపుతూ హిండెన్ బర్గ్ అంటున్నమాటలవి. మీ ప్రజల్ని మీరు ముంచకండిరా, ప్రేమించండిరాఅని ఒక విదేశీ సంస్థతో చెప్పించుకోవాల్సిన దౌర్భాగ్యపు దాపురింత వజ్రోత్సవ భారత్ కు మంచిదా?
‘నాపై దాడి దేశంపై దాడి’ అని అదానీ అంటున్న మాటలను ఒక్కరు కూడా నమ్మడం లేదు. పైగా నవ్వుతున్నారు. నిజంగా అదానీని నమ్మితే మదుపరులు ఎవరూ తమ షేర్లను తెగనమ్ముకోరు. వీరు దాదాపుగా హిందువులే కదా? మరి వారికి ‘హిందూత్వ పార్టీ’ మానస పుత్రుడు అదానీపై నమ్మకముంటే, ఎందుకు ఆయన గ్రూ ప్ స్టాక్ మార్కెట్లో దెబ్బతింటున్నది? మతం, జాతి పేరుతో చేసే మోసం డబ్బు ముందు నడువదనే కదా అర్థం? ఈ దేశ నిర్మాణం చేస్తున్న శ్రమజీవుల సంపదను బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఆర్థిక సంస్థలు, జీఎస్టీల ద్వారా రాబట్టి, ఒకరిద్దరు గుజరాతీలకు దోచి పెట్టడం మంచిదా?
‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అని అర్థం చేసుకోవడం వ్యాపారులకేనా, ప్రజలకు వద్దా? ఇపుడు మదుపరులు అదానీ షేర్ల నుంచి ఉపసంహరించుకుంటున్నట్టుగా దేశ ప్రజలంతా తమ సొమ్మును బ్యాంకుల నుంచి, ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ఉపసంహరిస్తే ఏమవుతారు మీరు? కరోనా లాక్డౌన్లో దేశమంతా అతలాకుతలమయింది కదా? దేశసంపద కొల్లగొట్టిన ఏడెనిమిది శాతం సంపన్నులు ఏమైనా ఆదుకున్నారా దేశాన్ని? శ్రమజీవుల చేతులు ఆడితేనే కదా ఆర్థిక చక్రం మళ్లీ తిరిగింది?
సామాన్య ప్రజలు లేకపోతే దేశానికి బతుకేదీ? మరి బతుకు భద్రత కల్పిస్తున్న వారి పట్ల గౌరవం, అభిమానం, ప్రేమ ఎంతుండాలి? మై డియర్ పార్లమెంట్.. చూద్దాం! ఇపుడు జరుగుతున్న సమావేశాల్లో ఎంత పట్టింపుతో ఉంటా రో! ఇంత సంక్షోభంలోకి దేశాన్ని నెట్టేసిన ప్రధానమంత్రి ఏమైనా పెదవి కదుపుతారేమోఅని దేశం ఎదురు చూస్తున్నది. అదానీని, ఆయన గ్రూప్లను నడిపించే వారిని ఏమైనా కట్టడి చేయగలవా ఓ నా దేశ పార్లమెంట్?
ఇపుడున్న పరిస్థితిలో ఇవాళ కాకపోతే రేపైనా అదానీ దివాళా తీస్తాడు. ‘ఆయన కూడా విజయ్ మాల్యా లాగా దేశం వదిలి పారిపోయాక మా పరిస్థితి ఏమిటి?’ అని జనం ప్రశ్నిస్తున్నారు. మత దౌష్ట్యం గురించి బీబీసీ, ఆర్థిక దౌష్ట్యం గురించి హిండెన్బర్గ్ మన బట్టలు విప్పి అంతర్జాతీయ విపణిలో నగ్నంగా నిలబెట్టినయి. సిగ్గు తెచ్చుకుందామా? లేక దేవతావస్ర్తాలు అంటూ సంబురపడదామా?
ఇప్పటి పార్లమెంట్ మనను ప్రేమించకపోతే సరికొత్త పార్లమెంట్ను కొలువు తీర్చుకుందాం! కన్నడ కంఠీరవుడి పాటలోలా మీ హృదయంలో నది ప్రవహించకపోతే.. మేము సముద్రమై ముంచేస్తం. జాగ్రత్త!!
జై హింద్ !!
శ్రీశైల్ రెడ్డి పంజుగుల: 90309 97371