‘వైద్యో నారాయణో హరిః’ అని సూక్తి. రోగులకు పునర్జన్మనిచ్చే వైద్యుడు దేవునితో సమానమని భావిస్తాం. కరోనా కాలంలో మన దేశంలో వైద్యుల కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. దేశ జనాభా 138 కోట్లను మించిపోతున్నది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వైద్యులు, వైద్య వసతుల కల్పన అత్యావశ్యకం. ఈ విషయంలో తెలంగాణ వడివడిగా అడుగులు ముందుకేస్తున్నది. రాష్ట్రంలో ఏడు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను నెలకొల్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించటం హర్షణీయం.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో త్వరలో పల్లె దవాఖానలు ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. బస్తీ దవాఖానల తరహాలోనే ఇవి పనిచేస్తాయి. ప్రస్తుతం గ్రామాల్లోని ఆరోగ్య ఉప కేంద్రాల్లో కేవలం నర్సులు మాత్రమే రోగులకు ఆరోగ్య సూచనలు అందిస్తున్నారు. ఇక నుంచి వైద్యులు సేవలందించే భారీ ఆరోగ్య కార్యక్రమం ముందుకురానున్నది. దీనికోసం రాష్ట్రంలోని 4,834 ఆరోగ్య ఉప కేంద్రాల్లో వైద్యులు, నర్సులు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి తగిన ఔషధాలు కూడా ఇవ్వనున్నారు. దీనికోసం ప్రభుత్వం త్వరలో 4,500 మందికిపైగా గ్రామీణ వైద్యులను నియమించనున్నది. అదేవిధంగా వైద్యరంగంలో మౌలిక వసతుల కల్పనకు రూ.10 వేల కోట్లతో కార్యాచరణకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టడం హర్షించదగిన పరిణామం. రాష్ట్రంలో ప్రస్తుతం 37 వేల మంది వైద్యులున్నారు. వీరిలో 4,300 మంది వరకు ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్నారు. ఏటా 4 వేల మంది వైద్యలు పట్టా పుచ్చుకొని వృత్తిలోకి వస్తున్నారు.
రాష్ట్రంలో కొత్తగా మరిన్ని వైద్యకళాశాలలు, సూపర్ స్పెషాలిటీ దవాఖానలు ఏర్పాటుకానున్నాయి. వరంగల్, మహబూబ్నగర్లో సూపర్ స్పెషాలిటీ దవాఖానలు త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఇక కొత్త వైద్య కళాశాలలు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలల్లో 1,790, ప్రైవేటు కళాశాలల్లో 3,450 మొత్తం 5,240 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. రాష్ట్ర అవతరణ తర్వాత తొలి ప్రభుత్వ వైద్యకళాశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్నగర్కు మంజూరు చేశారు. ఆ తర్వాత వరుసగా సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేటలలో ప్రభుత్వ వైద్యకళాశాలలు నెలకొల్పారు. ప్రస్తుతం కొత్తగా భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, మహబూబాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, వనపర్తి, నాగర్కర్నూలులో ప్రభుత్వ వైద్యకళాశాలలు ఏర్పాటుకానున్నాయి. దీనివల్ల ఒక్కో కళాశాలలో 150 చొప్పున మొత్తం 1,050 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి వస్తాయి. మరోవైపు, కొత్త కాలేజీలకు బోధన, బోధనేతర సిబ్బందిని నియమించుకోవటానికి రాష్ట్రప్రభుత్వం పరిపాలనపరమైన అనుమతులను కూడా మంజూరు చేయటం విశేషం. ఇదే క్రమంలో జిల్లా దవాఖానలను 300 పడకల దవాఖానలుగా మార్చనున్నారు. వైద్యకళాశాలలకు అనుగుణంగా అధునాతన పరీక్షలు చేసే ల్యాబ్లు ఏర్పాటు చేస్తారు. దీనివల్ల నిపుణులైన వైద్యులు జిల్లాల్లోనే ఉంటూ ప్రజలకు వైద్య సేవలందించడానికి వీలవుతుంది. పేదలు మెరుగైన వైద్యం కోసం నగరాలకు పరుగులు తీయాల్సిన అవసరం ఉండదు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఏర్పాటుకానున్న ఏడు ప్రభుత్వ వైద్యకళాశాలలే కాకుండా రాబోయేకాలంలో మరికొన్ని వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో, సింగరేణి బొగ్గు గనులున్న గోదావరిఖని (పెద్దపల్లి జిల్లా)లో ఇవి ఏర్పాటవుతాయని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వైద్యులు గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో పనిచేసేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించేందుకు వృత్తి నిబద్ధతతో ఉన్నప్పుడే అనుకున్న ఫలితాలను సాధించటం సాధ్యమవుతుంది.
మరోవైపు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వైద్యులు, వైద్యవసతుల కల్పన అవసరమన్న విషయాన్ని కేంద్రప్రభుత్వం కూడా గుర్తించింది. దేశంలో కొత్తగా 157 ప్రభుత్వ వైద్యకళాశాల లు నెలకొల్పాలని, వీటిని జిల్లా దవాఖానలకు అనుబంధంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కొత్త కళాశాలలతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వైద్యుల సంఖ్య పెరుగుతుందని, ఆరోగ్య వసతుల కల్పన మెరుగవుతుందని ప్రభుత్వం చెప్తున్నది. దేశంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 286, ప్రైవేటులో 276 మొత్తం 562 వైద్యకళాశాలలు ఉండగా వీటిలో 84,649 ఎంబీబీఎస్ సీట్లున్నాయి.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 20 ప్రభుత్వ వైద్య కళాశాలలు, 1500 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం వీటి సంఖ్య పెరిగినా, జనాభాకు తగినట్లుగా వైద్యులు లేకపోవటం, కళాశాలలు ఏర్పాటుకాకపోవడం బాధాకరం. దేశంలో ప్రస్తుతం ప్రతి 1,445 మంది జనాభాకు ఒక డాక్టర్ ఉన్నారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రమాణాల కన్నా తక్కువ. ప్రతి వెయ్యి మందికి ఒక డాక్టరు ఉండాలని డబ్ల్యూహెచ్ఓ చెప్తున్నది. దేశంలో ప్రస్తుతం 11.80 లక్షల మంది అల్లోపతి డాక్టర్లున్నారు. ఈ సంఖ్య మరింత పెరగాల్సి ఉన్నది. దీనికి కావాల్సింది కొత్తగా వైద్యులను తయారుచేయడమే.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
కె.బాలకిషన్రావు