దేశంలో వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాన ఎజెండాగా తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘భారత్ రాష్ట్ర సమితి’ పార్టీని ఏర్పాటుచేసి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడం అభినందనీయం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత వ్యవసాయరంగం నిరాదరణకు గురైంది. దశాబ్దాల తరబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంత వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశాయి. తత్ఫలితంగా రైతుల ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోయింది. దీంతో తెలంగాణ రైతుకు ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్యే శరణ్యంగా భావించాడు. రైతు.. ఇలా అనేక సమస్యలతో సతమతమవుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది.
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంక్షోభంలో చిక్కుకున్న రైతులను గట్టెక్కించడానికి శ్రీకారం చుట్టారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన స్వయంగా రైతు. వ్యవసాయరంగ సమస్యలు, పరిష్కార మార్గాలపై స్పష్టమైన అవగాహన ఉన్నందువల్లే వెంటనే స్పందించారనేది నిర్వివాదాంశం. అందులో భాగంగానే రాష్ట్ర బడ్జెట్లో అధికభాగం వ్యవసాయ రంగానికి కేటాయించి, రైతాంగం ఊహించినదానికన్నా రెట్టింపుగా సహాయక చర్యలు చేపట్టారు. వాటిగురించి ఒక్కసారి విశ్లేషించుకుందాం.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి 24 గంటల నిరంతర ఉచిత, నాణ్యమైన విద్యుత్తునందించింది. తద్వారా మాటిమాటికి మోటార్లు కాలిపోయి ఇబ్బందులు పడే రైతాంగానికి ఉపశమనం లభించింది. పంటలు ఎండిపోవటమనేది లేకుండా రైతుకు శాశ్వత పరిష్కారం లభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ చెరువులకు మరమ్మతులు నిర్వహించడమే కాకుండా, వాటి నిల్వ సామర్థ్యం పెంచింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజలాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ బీడువారిన పంటపొలాలకు శాశ్వత నీరందించి సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో భారీ సాగునీటి ప్రాజెక్టు అయిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నారు. ఆ ప్రాజెక్టు విజయవంతమై రాష్ట్రంలోని చెరువులన్నీ కళకళలాడుతున్నాయి.
‘రైతుబంధు’ పథకం ద్వారా పసలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేల చొప్పున రెండు పసళ్లకు కలిపి ఎకరానికి రూ.10 వేల పెట్టుబడి సాయం అందిస్తున్నది. కుటుంబానికి పెద్ద దిక్కయిన రైతు అకస్మాత్తుగా చనిపోతే రైతు కుటుంబసభ్యులను ఆదుకునే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘రైతుబీమా’. ఈ పథకం ద్వారా ప్రభుత్వం వారం రోజుల్లోనే రైతు కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందజేస్తున్నది. రైతు పండించిన పంట చివరి గింజవరకు కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. ఇవన్నీ చేస్తామని 2014కు ముందు జరిగిన ఎన్నికల మ్యానిఫెస్టోలో టీఆర్ఎస్ ప్రకటించనూ లేదు. ఇవన్నీ చేయమని కేసీఆర్ను రాష్ట్ర రైతాంగం కోరనూ లేదు. కానీ రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషిచేస్తుండటం అభినందనీయం.
దేశవ్యాప్తంగా పరిష్కారం కావాల్సిన రైతు సమస్యలు: రైతు పండించిన పంటకు లాభసాటి ధరను కేంద్రమే నిర్ణయించాలి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర (ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించాలి. బహిరంగ మార్కెట్లో ఎంఎస్పీ కన్నా తక్కువ ధర ఉన్నప్పుడు ఎంఎస్పీ ప్రకారం ప్రభుత్వమే రైతు ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. పంటకు ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు రైతుకు బీమా వర్తించేలా కేంద్ర ప్రభుత్వం ఏటా బీమా ప్రీమియం చెల్లించాలి. దేశ రైతాంగాన్ని ప్రైవేట్ అప్పులు, అధిక వడ్డీ భారం నుంచి శాశ్వతంగా విముక్తులను చేయడానికి అవసరం ఉన్న ప్రతి రైతుకు రిజర్వ్ బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలి.
పై సమస్యలను పరిష్కరించాలని గత ఎనిమిదేండ్లుగా రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. కానీ కేంద్రం పెడ చెవిన పెడుతున్నది. రైతు సంక్షేమాన్ని గాలికి వదిలేసి కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత ప్రభుత్వంలో ప్రముఖ పాత్ర వహిస్తే రైతు సమస్యలు అనతికాలంలోనే పరిష్కారమవుతాయనడంలో సందేహం లేదు. దేశవ్యాప్తంగా రైతులు ఆర్థికంగా ఎదగడానికి అనేక చర్యలు చేపట్టాలి. వారి జీవన ప్రమాణాలు గణనీయంగా పెంచాలి. అందుకే దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం చెందింది. ఈ పార్టీకి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు దేశ రైతాంగం అండగా ఉండాలని తెలంగాణ రైతు రక్షణ సమితి కోరుతున్నది. ఆ దిశగా అడుగులు పడుతాయని ఆశిద్దాం.
రైతు పండించిన పంటకు లాభసాటి ధరను కేంద్రమే నిర్ణయించాలి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర (ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించాలి. బహిరంగ మార్కెట్లో ఎంఎస్పీ కన్నా తక్కువ ధర ఉన్నప్పుడు ఎంఎస్పీ ప్రకారం ప్రభుత్వమే రైతు ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. పంటకు ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు రైతుకు బీమా వర్తించేలా కేంద్ర ప్రభుత్వం ఏటా బీమా ప్రీమియం చెల్లించాలి.
పాకాల శ్రీహరిరావు: 93475 80252