తెలంగాణపై ఆంధ్రా ప్రాంతం మధ్య సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ వివక్ష కారణంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పురుడుపోసుకున్నది. ప్రత్యేక రాష్ట్రం కోసం చాలా కాలంగా ఉన్న ఆకాంక్ష ఉద్యమ రూపం సంతరించుకోవడంతో భారతదేశ 29వ రాష్ట్రంగా 2014, జూన్ 2న తెలంగాణ అవతరించింది. ప్రజల మద్దతును సమీకరించి మలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ అధినేత కే చంద్రశేఖర్రావు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయ్యారు.
కేసీఆర్ ప్రభుత్వ పాలనలో సమ్మిళిత అభివృద్ధి ఫలితంగా మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, పారిశ్రామికావృద్ధిలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పెట్టుబడులు, ఆర్థిక అవకాశాలకు మంచి గమ్యస్థానంగా తెలంగాణ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించుకున్నది.
వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి ప్రాముఖ్యాన్ని గుర్తించి తెలంగాణ ప్రభుత్వం వినూత్న పథకాలను ప్రవేశపెట్టింది. రైతు కేంద్రీకృత కార్యక్రమాలైన రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు వంటివి అమలుచేసి వ్యవసాయరంగంలో సమూల మార్పులు తీసుకువచ్చింది. తద్వారా రోజువారీ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేలా రైతులకు భరోసానిచ్చింది. జల వనరుల నిర్వహణ, నీటిపారుదల ప్రాజెక్టులు, రైతు సం క్షేమ పథకాల ద్వారా రాష్ట్రం మెరుగైన వ్యవసాయ ఉత్పాదకతను సాధించింది. ఇది గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరిచింది.
తెలంగాణ ప్రభుత్వం సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధిపై తొలిదశలోనే దృష్టిసారించింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వంటి భారీ ప్రాజెక్టులు చేపట్టింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చి తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల్లో గణనీయమైన మార్పును తీసుకువచ్చింది. రాష్ట్రంలోని కుంట లు, చెరువుల పునరుద్ధరణకు తీసుకొచ్చిన మిషన్ కాకతీయ కార్యక్రమం, నీటి సంరక్షణ, భూగర్భ జలాల సమృద్ధికి సహాయ పడింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి తాగునీటిని అందించడం, నీటి కొరతను పరిష్కరించడం ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో మిషన్ భగీరథ కార్యక్రమం ఎంతో తోడ్పాటునందించింది.
రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, విద్యలో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషిచేస్తున్నది. రాష్ట్రంలో ఉన్న 27 వేల పాఠశాలల్లో మొదటగా 7 వేల పాఠశాలల్లో అన్నిరకాల మౌలిక వసతులు, అంతర్జాతీయ సదుపాయాలుతో పునరుద్ధరించనున్నది. ఉన్నత విద్య కోసం అనేక కొత్త కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, వృత్తిశిక్షణ సంస్థలను తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీఎస్సీహెచ్ఈ) ద్వారా రూపకల్పన చేసింది. విద్యలో నాణ్యతను మెరుగుపరిచేందుకు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న కృషి నూతన ఆవిష్కరణలకు దోహదపడింది. వ్యాపారాన్ని సులభతరం చేయడానికి పారిశ్రామిక అనుమతుల కోసం సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టంను తీసుకువచ్చింది. తెలంగాణలో పారిశ్రామిక వృద్ధికి ఇది విశేషమైన ఫలితాలనిచ్చింది. విభిన్న రంగాలలో జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తున్నది రాష్ట్రం. మంచి విధానాలు, మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి వృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించాయి. ఇది ఆర్థికవృద్ధిని పెంచడమే కాకుండా తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలను కూడా సృష్టించింది.
2013-14లో రాష్ట్ర ఏర్పాటు సమయంలో రూ.5.05 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2022-23 నాటికి రూ.13.27 లక్షల కోట్లకు పెరిగింది. పలు నివేదికల ప్రకారం తెలంగాణ జీఎస్డీపీ సగటు వార్షిక వృద్ధిరేటు 8.6 శాతంగా నమోదైంది. 2014-15 వార్షిక సంవత్సరంలో రూ 1,24,104 తో ఉన్న తలసరి ఆదాయం 2023 మార్చి 15 నాటికి ప్రస్తుత ధరల ప్రకారం రూ.3,08,732తో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో ఉన్నది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాలు తెలంగాణ అభివృద్ధిని స్పష్టం చేస్తున్నాయి
కేంద్ర ప్రభుత్వం ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం.. రాష్ర్టానికి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. కాళేశ్వరం లేదా పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదాను విస్మరించింది. తెలంగాణ రుణ పరిమితిని తగ్గించడంతో పాటు రుణాల తిరస్కరణకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నది.
కేంద్ర-రాష్ట్ర సంబంధాలను రాజకీయం చేయడం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సమస్యగా పరిణమించింది. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ భారతదేశాన్ని రాష్ర్టాల సమాఖ్యగా అభివర్ణించారు. కానీ ప్రధాని నరేంద్రమోదీ తీరు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బ తీసేలా ఉన్నది. కేంద్రం ఫెడరల్ స్ఫూర్తిని ప్రోత్సహిస్తూ, రాజకీయాలకతీతంగా రాష్ర్టాలను తమ భవిష్యత్తు తాము నిర్ణయించుకునేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది.
‘తెలంగాణ రాష్ట్రం సహేతుకం కాదు’ అని కించపరిచే స్థాయి నుంచి తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రం అనే స్థాయికి ఎదిగింది. దీనంతటికి కారణం కేసీఆర్ రాజకీయ చతురత, సుస్థిర పరిపాలనా విధానం. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు అన్ని వర్గాల అభిమానాన్ని చూరగొన్నాయి. అరవై ఏండ్ల తెలంగాణ ప్రజల గోసను దశాబ్దకాలంలో తీర్చిన కేసీఆర్ చిత్తశుద్ధి, దృఢసంకల్పం స్వర్ణ తెలంగాణకు నాంది పలుకుతున్నది.
(వ్యాసకర్త: భారత జాగృతి యూరోప్ ప్రెసిడెంట్)
-దన్నంనేని సంపత్ కృష్ణ