తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు పోషించిన పాత్రకు మరోసారి సముచిత స్థానం దక్కింది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్యాదవ్ పేరును ప్రకటించటమే దీనికి నిదర్శనం.ఇక రాష్ట్ర సాధన సమయంలో రెండు నాల్కల ధోరణిని ప్రదర్శించిన బీజేపీ, రాష్ట్ర ఏర్పాటును తాత్సారం చేసి.. వందల మంది ప్రాణాలను బలిగొన్న కాంగ్రెస్ పార్టీలు ఏ ముఖం పెట్టుకొని ప్రజలను ఓట్లడుగుతాయి!
తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి తేటతెల్లమే. వ్యవసాయ, పారిశ్రామిక, విద్య, వైద్య రంగాల్లోనూ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తున్నది. అయినా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయంటే వాటి కపట బుద్ధిని అంచనావేయొచ్చు. అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణలోని ప్రతి కుటుంబం లబ్ధి పొందుతున్నదనేది వాస్తవం. ఈ విషయాన్ని గ్రహించకుండా ప్రతిపక్షాలు తెలంగాణ ఆత్మబంధువైన కేసీఆర్ను విమర్శించడం కుటిలత్వమే అవుతుంది. ఇక కేసీఆర్ పెట్టిన రాజకీయ భిక్షతో ఎదిగి, ఆయననే వెన్నుపోటు పొడవాలని చూడటం హేయనీయం. అలాంటి ద్రోహులకు మద్దతుగా నిలవటం కుసంస్కృతికి, దివాళాకోరుతనానికి నిదర్శనం.
సుదీర్ఘ పోరాటాల తర్వాత తెలంగాణ ఆవిర్భవించింది. ఇప్పుడు సబ్బండ కులాలు సగౌరవంగా తలెత్తుకొని జీవిస్తున్నయి. అన్నదాతల ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడింది. వలస పాలకుల పుణ్యాన ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల ఇప్పుడు సిరిశాలగా మారింది. చేనేత కార్మికుల ముఖాల్లో చిరునవ్వు తొణికిసలాడుతున్నది. మత్స్యకార్మికులు ఈలలేసుకుంటూ చేపలు పడ్తున్నరు. రాష్ట్రంలోని రైతులు సంతోషంగా సాగు చేస్తున్నరు. గొల్లకుర్మలు కేసీఆర్లో మల్లన్న, బీరప్పలను చూసుకుంటున్నరు. వృత్తికులాల ఆదాయమార్గాలు, యువతకు ఉద్యోగావకాశాలు పెరిగినయి. పరిశ్రమల స్థాపన, అభివృద్ధి వికేంద్రీకరణ జరిగింది. తాగు, సాగునీటి సమస్య తీరింది. ఎన్నడూలేని విధంగా ఎండకాలంలో కూడా చెరువులు మత్తళ్లు దుంకుతున్నయి. బహుశా ఇదంతా ప్రతిపక్షాలకు కనపడటం లేదేమో! అందుకే, వాటి వంకరబుద్ధిని ప్రదర్శిస్తున్నాయి.
సబ్బండకులాల బతుకు వెతలను తీర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వ పాలన జరుగుతున్నది. రాష్ట్రంలో రైతు బంధు, ఉచిత, నాణ్యమైన విద్యుత్, ఆసరా పింఛన్లు, ‘మిషన్ భగీరథ’ తాగునీరు, కాళేశ్వరం సాగునీరు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, గురుకులాలు, ప్రభుత్వ వైద్యం, కంటివెలుగు లాంటి అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల బతుకులను మార్చేందుకు ‘దళిత బంధు’ ప థకాన్ని రూపొందించడం ఓ విప్లవాత్మక నిర్ణయం. ఈ పథకంతో దళితులు తరతరాల వివక్ష, అణచివేతల నుంచి వి ముక్తులు కాబోతున్నారు. ఈ పథకంతో దళితులు చిన్నపా టి పారిశ్రామికవేత్తలుగా ఎదుగవచ్చు. వ్యాపారాలు చేసుకోవచ్చు. రూ.10 లక్షల చొప్పున ఇచ్చే ఈ పథకం ద్వారా తమకు విముక్తి దొరుకుతుందని దళితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థుల పాత్ర గొప్పది. ఓయూ విద్యార్థులు ఉద్యమించిన తీరును తెలంగాణ సమాజం ఆదర్శంగా తీసుకున్నది. విద్యార్థి జేఏసీ పాదయాత్రను స్వాగతించి వారి స్ఫూర్తితో ప్రత్యేక ఉద్యమంలో మమేకమైంది తెలంగాణ. ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న విద్యార్థి నాయకులెందరినో కేసీఆర్ సముచితరీతిలో గౌరవించారు. యువతను ప్రోత్సహిస్తూ భవిష్యత్ నాయకులుగా ఎదగడానికి అవకాశం కల్పించారు. ఇప్పుడు తాజాగా ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి మరో విద్యార్థి నేతకు సముచిత గౌరవం లభించడం ఆహ్వానించదగిన పరిణామం. విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ను హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించటం కేసీఆర్కు ఉద్యమకారుల పట్ల ప్రేమను తెలియజేస్తున్నది.
ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా ఈటలకు ప్రభుత్వంలో ప్రాధాన్యం కల్పించినా ఆయన అవినీతివైపే మొగ్గుచూపారు. భూ ఆక్రమణలతో కోట్లకు పడగలెత్తాడు. ఆవినీతి ఆరోపణలు రావడంతో తన అక్రమ ఆస్తులను కాపాడుకోవటం కోసం బీజేపీ పీఠం ఎక్కి ఆత్మగౌరవమంటూ నాటకాలాడుతున్నాడు. ఆయన మాటలకు మరోసారి మోసపోయే స్థితిలో ఇప్పుడు హుజూరాబాద్ ప్రజలు లేరు. ఇదిలా ఉంటే అభ్యర్థి లేక కాంగ్రెస్ తంటా లు పడుతున్నది. ఓయూ విద్యార్థి నాయకుడు, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఆకాంక్షకు ప్రతీక. టీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థిగా ‘గెల్లు’ గెలుపు నల్లేరుమీద నడకనే చెప్పాలి.
(వ్యాసకర్త: వ్యవస్థాపక అధ్యక్షులు, గొల్ల కుర్మ హక్కుల పోరాట సమితి)
–గోసుల శ్రీనివాస్యాదవ్