తెలంగాణ సమాచార హక్కు కమిషన్ ఏర్పడేనాటికి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించి 6,825 కేసులు పెండింగ్లో ఉన్నాయి. తెలంగాణ కమిషన్ ఏర్పడిన తర్వాత ఈ నాలుగేండ్లలో 25,252 కేసులు కొత్తగా వచ్చాయి. వాటిలో 19,748 కేసులు పరిష్కరించింది. సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించినందుకు ఇప్పటివరకు 650 కేసుల్లో షోకాజ్ నోటీసులు జారీచేసింది. లక్షా 82 వేల రూపాయల వరకు జరిమానా విధించింది.
తెలంగాణ సమాచార హక్కు కమిషన్ ఏడాదిలో ఐదు వేల కేసులు పరిష్కరించింది. కేసుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని మరో ఐదుగురు కమిషనర్లను 2020, ఫిబ్రవరి 25న నియమించారు. ప్రధాన కమిషనర్తో పాటు ఐదుగురు కమిషనర్లతో పూర్తిస్థాయిలో కమిషన్ పనిచేస్తున్నది. అంతకుముందు ఒక పిటిషన్ కమిషన్ వద్దకు వచ్చినప్పుడు ఇరుపక్షాలను విచారించి నిర్ణయం తీసుకోవడానికి సగటున 18 నెలలు పట్టేది. ఇప్పుడు 6 నెలలు పడుతున్నది. ఇదే వేగం కొనసాగితే సగటున 3 నెలలకు మించి పట్టదు. ఈ ఏడాది జూలైలో కమిషన్ వద్దకు 506 పిటిషన్లు రాగా, 726 పిటిషన్లను పరిష్కరించారు. అంటే ఆ నెలలో వచ్చిన పిటిషన్ల కన్నా పరిష్కరించినవి ఎక్కువ. ఇదే వేగంతో పెండింగ్ పిటిషన్లను పరిష్కరించి, కమిషన్ వద్దకు వచ్చిన పిటిషన్లను నెల రోజుల్లో పరిష్కరించాలనేది కమిషన్ లక్ష్యం.
ఈ నాలుగేండ్ల ప్రస్థానంలో వెలుగు, చీకటి రెండూ ఉన్నాయి. స.హ.చట్టం సామాన్యుడి చేతిలో వజ్రాయుధంగా నిలిచిన ఉదంతాలెన్నో ఉన్నాయి. అదే సమయం లో ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ పక్కదారి పట్టిస్తున్న సంఘటనలు సైతం ఉన్నాయి. అదే సమయం లో స.హ. చట్టాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నవారూ ఉన్నా రు. ఇతర ప్రయోజనాలు ఆశిస్తూ వంద ల సంఖ్యలో దరఖాస్తులు చేస్తున్నవారు కూడా ఉన్నారు.
‘కాలానికి తగ్గట్టు చట్టాల్లో సంస్కరణలు అవసరం’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. న్యాయవాదితో అవసరం లేకుండా ఒక తెల్ల కాగితంపై తనకు కావలసిన సమాచారం గురించి రాసి రూ. 10ల ఖర్చుతో దరఖాస్తు చేస్తే సరి పోతుంది. ఈ చట్టాన్ని రూపొందించేప్పుడు సద్వినియోగం చేసుకొనేవారి గురించే ఎక్కువగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీఐకి సంబంధించిన ఒక కేసు విచారణ సందర్భంలో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్ డే చేసిన వాఖ్యలో.. ఆర్టీఐ వల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి భయపడుతున్నారన్నారు. ఈ చట్టాన్ని దుర్వినియోగపరిచే దరఖాస్తులు ఫిల్టర్ చేసేవిధంగా గైడ్లైన్స్ అవసరమని అభిప్రాయపడ్డారు. కొందరు ఆర్టీఐ కార్యకర్తలమని చెప్పుకోవడంపై కూడా ప్రధాన న్యాయమూర్తి విస్మయం ప్రకటించారు. చట్టంలో వారి పాత్ర ఎక్కడుందని ప్రశ్నించటం గమనార్హం.
దుర్వినియోగాన్ని నివారించేలా, అధికారులు మరింత బాధ్యతతో వ్యవహరించి బాధితులకు న్యాయం చేసే విధంగా స.హ. చట్టంలో సైతం సంస్కరణలు అవసరం. ప్రజాప్రయోజనాలకై ఎక్కువ ఆర్టీఐ దరఖాస్తులు అందజేస్తే అర్థం చేసుకోవచ్చు. దుర్వినియోగపరుస్తూ, పనితీరుపై ప్రభావం చూపేవిధంగా దరఖాస్తులు చేయడం వల్ల నిజమైన బాధితులకు న్యాయం జరగడంలో ఆలస్యమవుతుంది. నాలుగేండ్ల కాలంలో తెలంగాణ సమాచార హక్కు కమిషన్ ఎంతోమంది సామాన్యులకు న్యాయం చేయగలిగింది.
(వ్యాసకర్త: బుద్దా మురళి, ప్రధాన కమిషనర్, రాష్ట్ర సమాచార హక్కు కమిషన్)