పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఆధిపత్య పోరు ఆరని చిచ్చులా రగులుతున్నది. అయితే ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి ఉన్నతాధికారిని పావుగా మార్చటం ఆక్షేపణీయం. ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అలాపన్ బందోపాధ్యాయను కేంద్ర సర్వీస్లోకి తీసుకుంటూ తక్షణమే చేరిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశం జారీచేసింది. దీంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయన చేత రాజీనామా చేయించి, ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర సర్వీస్ నిబంధనల ఉల్లంఘన కింద ఆయనకు చార్జ్ మెమో అందింది. దీని ఆధారంగా జరిమానా, శిక్ష విధించే అవకాశం ఉండటం గమనార్హం.
ఎన్నికలు అయిపోయి నెలరోజులు గడిచినా తృణమూల్, బీజేపీల మధ్య రాజకీయ కక్ష తగ్గటం లేదు. యాస్ తుఫాను నేపథ్యంలో ప్రధాని మోదీ పశ్చిమబెంగాల్ పర్యటన సందర్భంగా తాజా వివాదం చెలరేగింది. రాష్ట్రంలో ఏరియల్ సర్వే అనంతరం ప్రధాని మోదీ కలైకుంద వైమానిక స్థావరంలో సమీక్షా సమావేశం ఏర్పాటుచేశారు. దానికి సీఎస్ బందోపాధ్యాయతో సహా మమతా బెనర్జీ గైర్హాజరయ్యారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణతో బందోపాధ్యాయను బలిపశువును చేయటం గర్హనీయం. యాస్ తుఫాను విధ్వంసం, కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆయన సేవలు బెంగాల్కు అవసరమని మూడు నెలల పదవీకాలాన్ని పెంచాలని మమత లేఖ రాస్తే దానికి కేంద్రం కూడా ఆమోదం తెలిపింది. వారం తిరగకుండానే ఆయన్ను వెనక్కి పిలవటం కక్షపూరితమే.
ఎన్నికల ప్రచార సమయంలో తప్ప, సాధారణ సమయాల్లో రాజకీయాలు పొడసూపకూడదనేది ఒక ప్రజాస్వామిక విలువ. కానీ దీన్ని పక్కనపెట్టి పశ్చిమబెంగాల్లో ఆధిపత్యపోరు సాగుతున్నది. గతంలో కూడా బీజేపీ నేత నడ్డా పర్యటన సందర్భంగా జరిగిన అల్లరికి ముగ్గురు ఐపీఎస్ అధికారుల వైఫల్యమే కారణమని వారిని వెనక్కి పిలిపించింది. ఎన్నికల ఫలితాల అనంతరం ఏడేండ్ల కిందటి నారద కుంభకోణం వెలికి తీసి ఇద్దరు మంత్రులు, మాజీ మంత్రి, మాజీ మేయర్లను సీబీఐ అరెస్టు చేసింది. ఇదే కేసులో చార్జ్షీట్లో పేరున్న బెంగాల్ ప్రతిపక్షనేత, మమతా బెనర్జీపై గెలిచిన సుదేందు అధికారి, మరో బీజేపీ నేతను అరెస్టు చేయకపోవటం వివక్షాపూరితమే. ఎన్నికల ప్రచార సందర్భంలోనూ, ఫలితాల తర్వాత పెద్ద ఎత్తున హింస చెలరేగింది. హింసాదౌర్జన్యాలకు కారణం మీరంటే, మీరని ఇరు పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇదంతా ప్రజాస్వామ్య విలువలను పాతరేయటమేననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. ఇప్పటికైనా ఇరుపార్టీల నేతలు ప్రజాస్వామిక సంప్రదాయాలను గౌరవించి అనుసరించాలి. కక్షపూరిత రాజకీయాలకు తెరదించాలి.