మాల్దీవుల వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. ఆ దీవుల రాజ్యం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మహమ్మద్ మాయిజ్జు అంతకంతకు భారత వ్యతిరేక వాగాడంబరాన్ని పెంచుతుండటమే ఇందుకు ప్రబల నిదర్శనం. ఒకప్పుడు మాల్దీవులపై తమిళ ఈలం ఉగ్రవాదుల వత్తాసుతో సైనిక తిరుగుబాటు జరిగినప్పుడు భారత్ తన సైన్యాన్ని పంపి అక్కడి ప్రభుత్వాన్ని కాపాడిన సంగతి చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మాల్దీవుల స్వరం మారిపోయింది. భారతదేశం తన సైనికులను వెనుకకు పిలిపించుకోవాలని మాయిజ్జు డిమాండ్ చేస్తున్నారు. రెండు దేశాల సంబంధాల్లో పెరిగిన దూరాన్ని ఇది తెలియజేస్తున్నది. కొత్తగా ఎన్నికైన మాల్దీవుల అధ్యక్షుడు మొదటగా భారత్ సందర్శించడం అనే సంప్రదాయానికి మాయిజ్జు తిలోదకాలిచ్చి టర్కీ, చైనాల పర్యటనకు బయల్దేరటం అంతర్జాతీయంగా చర్చాంశమైంది. మాల్దీవులు భారత్కు దూరమవుతూ, చైనాకు దగ్గరవుతున్నదని చెప్పడానికి ఇంతకన్నా సంకేతాలు అక్కర్లేదు. అప్పులిచ్చి, ఆపై ఆక్రమించి, గుప్పెట్లో పెట్టుకోవడమనే చైనా విస్తరణవాద ప్రణాళికలో మాల్దీవులు ఓ పావుగా మారింది.
ఇప్పుడు మన ఇరుగు పొరుగు దేశాల్లో బంగ్లాదేశ్ ఒక్కటే మనకు పూర్తిగా అనుకూలం. మిగతావన్నీ ఏదోరకంగా చైనా ప్రభావ పరిధిలోకి వచ్చాయి. తాజాగా మాల్దీవులు వాటి సరసన చేరింది. తమ దేశం భారత్కు ఇంటివెనుక పెరడు (బ్యాక్యార్డ్) లాంటిది కాదని మాయిజ్జు ధిక్కార ధోరణిలో మాట్లాడటం రెండు దేశాల మధ్య పెరిగిన దూరానికి ఓ కొలమానం. భారతదేశంలోని కొన్ని వర్గాలు మాల్దీవులు వద్దు.. లక్షద్వీప్ ముద్దు అనే ప్రచారానికి తెరతీసిన నేపథ్యం తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రచారం జోరందుకున్నది. మాల్దీవులకు బుక్ చేసిన విమాన టిక్కెట్లు, హోటల్ గదులు పెద్ద ఎత్తున రద్దు చేసుకున్నారనే వార్తలు కొద్దిరోజులుగా హల్చల్ చేస్తున్నాయి. సినీ నటులు, ఇతర రంగాల ప్రముఖులూ ఇందులో గొంతు కలుపుతున్నట్టు మనం వింటున్నాం. తాజాగా బీజేపీ ముఖ్యమంత్రులూ ఈ ప్రచారంలో వచ్చి చేరడం కొంత వైపరీత్యంగానే కనిపిస్తున్నది. ఇవన్నీ మాల్దీవుల ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటైన టూరిజాన్ని దెబ్బతీసేవిధంగా ఉన్నాయనేది తెలిసిందే. దౌత్యంలో దుందుడుకుతనం పనికిరాదు. కానీ దురదృష్టవశాత్తూ ఇప్పుడు అదే విదేశాంగ విధానమై కూర్చున్నది.
మాల్దీవులను కాదనడం వరకు సరే. అందుకు ఎవరి కారణాలు వారికి ఉండొచ్చు. కానీ మధ్యలో లక్షద్వీప్ పేరెందుకు ఎత్తుతున్నారనేది ఇక్కడ ప్రశ్న. మన దేశంలో మరే ఇతర టూరిస్టు కేంద్రాలు లేవా? అంటే రకరకాల వాదాలు వినిపిస్తున్నాయి. నైసర్గిక సౌందర్యంతో అలరారే లక్షద్వీప్ను టూరిస్టు కేంద్రంగా అభివృద్ధి చేసి తద్వారా వ్యాపారాభివృద్ధి చేసుకోవచ్చని మన దేశంలో కొందరు భావిస్తుండటం ఇందుకు ప్రధాన కారణంగా చెప్తున్నారు. దీనిపై పర్యావరణవాదులు మొదటి నుంచీ అభ్యంతరం చెప్తూనే ఉన్నారు. మరోవైపు టూరిస్టులు వరదలా వస్తే తట్టుకునే శక్తి లక్షద్వీప్కు అసలే లేదని అక్కడి ఎంపీ స్వయంగా ప్రకటించడం ఇక్కడ గుర్తుంచుకోవాలి. చైనాతో దోస్తీ వల్ల దీర్ఘకాలికంగా ఎదురయ్యే ముప్పు గురించి మాల్దీవుల నాయకతానికి తెలిసేలా చేయాలి. అందుకు దౌత్యపరమైన పరిణతితో వ్యవహరిం చడం ఎంతైనా అవసరం.